Sitarama Project: ‘ఖమ్మం’ కలల ప్రాజెక్ట్.. సీతారామ పంప్ హౌస్ ట్రయల్ రన్.. గోదారమ్మ పరవళ్లకు పరవశించిన మంత్రి తుమ్మల.. వీడియో
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో సీతారామ ప్రాజెక్ట్ మొదటి పంప్ హౌస్ వద్ద ట్రయల్ రన్ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. గోదావరి జలాలు పరవళ్ళు తొక్కుతుండటంతో ఆయన ఒక్కసారిగా పరవశించిపోయారు. ఆనందంతో భూమాతకు సమస్కరించారు మంత్రి తుమ్మల..
![Sitarama Project: ‘ఖమ్మం’ కలల ప్రాజెక్ట్.. సీతారామ పంప్ హౌస్ ట్రయల్ రన్.. గోదారమ్మ పరవళ్లకు పరవశించిన మంత్రి తుమ్మల.. వీడియో](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/06/sitarama-project.jpg?w=1280)
ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజానీకానికి వరప్రదాయని అయిన.. సీతారామ ప్రాజెక్ట్ చివరి దశకు చేరుకుంది.. ట్రయల్ రన్ కూడా పూర్తయింది.. ఆగస్టు 15 నాటికి సాగర్ లింక్ కెనాల్ కు అనుసంధానించి గోదావరి జలాలు అందించేందుకు సర్వం సిద్ధమైంది.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో సీతారామ ప్రాజెక్ట్ మొదటి పంప్ హౌస్ వద్ద ట్రయల్ రన్ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. గోదావరి జలాలు పరవళ్ళు తొక్కుతుండటంతో ఆయన ఒక్కసారిగా పరవశించిపోయారు. ఆనందంతో భూమాతకు సమస్కరించారు మంత్రి తుమ్మల.. త్వరగా పనులు పూర్తి చేసి నీటిని అందించాలంటూ ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలు ఇవ్వడమే తన చివరి కోరిక అన్నారు మంత్రి మంత్రి తుమ్మల. గోదావరి జిల్లాల మాదిరిగా ఖమ్మం జిల్లాలో సాగు ఇవ్వాలన్నది తన కోరికగా చెప్పారు. సీతారామ ప్రాజెక్ట్కు భూమి ఇచ్చిన వారికి పాదాభివందనాలు తెలిపిన తుమ్మల..అధికారులు రేయింబవళ్ళు కష్టపడ్డారరని అభినందించారు. ఈ వర్షాకాలంలోనే లక్షన్నర ఎకరాలకు సాగునీరు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
వీడియో చూడండి..
బుధవారం అర్ధరాత్రి సీతారామ ప్రాజెక్టు మొదటి పంప్ హౌస్ వద్ద ట్రయల్ రన్ నిర్వహించారు అధికారులు. గత ఇరవై రోజులుగా ట్రయల్ రన్కు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆగస్టు 15 లోగా సాగర్ లింక్ కెనాల్కు గోదావరి జలాలు అందించి.. వైరా రిజర్వాయర్కు అనుసంధానం చేయాలని అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో సుమారు 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
సీతారామ ప్రాజెక్ట్ పూర్తి చేయడం నా జీవిత ఆశయం.. లక్ష్యం అని గతంలో తుమ్మల నాగేశ్వరరావు పలుమార్లు పేర్కొన్నారు.. దానికి తగినట్లుగానే త్వరగా పనులు పూర్తిచేసేలా ప్రత్యేకంగా పర్యవేక్షించారు. ఆగస్టు 15 కల్లా ప్రజెక్ట్ పూర్తి అయి.. గోదావరి జలాలు పరవళ్లు తొక్కనున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్య శ్యామలం చేసే లక్ష్యంతో టీడీపీ హయంలో తుమ్మల నాగేశ్వరరావు సీతారామ ప్రాజెక్ట్ కు రూపకల్పన చేశారు. కానీ నిధుల సమస్యతో ఉమ్మడి రాష్ట్రంలో ఆ కల సాకారం కాలేదు. అనంతరం కేసీఆర్ కేబినెట్ లో తుమ్మలకు అవకాశం దక్కడంతో సీతారామకు పునాది పడింది. 2016 ఫిబ్రవరి 16న అప్పటి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత సీతారామ ప్రాజెక్ట్ పనులు వేగంగా జరిగాయి.. 2018లో తుమ్మల ఓటమితో నత్తనడకన కొనసాగాయి.. అనంతరం కాంగ్రెస్ లో చేరిన తుమ్మల నాగేశ్వరరావుకు మంత్రి పదవి దక్కడంతో ప్రాజెక్ట్ పనులు శరవేగంగా పూర్తయ్యాయి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..