AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రియల్ ఎస్టేట్ ముసుగులో భారీ మోసం.. రూ.13.31 కోట్లు నొక్కేసిన కేటుగాళ్లు..కట్‌చేస్తే..

రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెడితే స్వల్ప కాలంలోనే ఊహించని రీతిలో భారీ లాభాలు వస్తాయంటూ అమాయకులకు ఆశ చూపి కోట్ల రూపాయలు కొల్లగొట్టిన ఘరానా మోసం ఆదిలాబాద్ జిల్లాలో బట్టబయలైంది. తెలిసిన వారిని, నమ్మకస్తులనే టార్గెట్ చేస్తూ సాగించిన ఈ రియల్ దందాలో ఏకంగా రూ.13.31 కోట్ల మేర మోసం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.

రియల్ ఎస్టేట్ ముసుగులో భారీ మోసం.. రూ.13.31 కోట్లు నొక్కేసిన కేటుగాళ్లు..కట్‌చేస్తే..
Real Estate Fraud Exposed
Naresh Gollana
| Edited By: |

Updated on: Sep 12, 2026 | 9:24 PM

Share

రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెడితే భారీగా లాభాలు వస్తాయంటూ నమ్మించారు.. తెలిసిన వాళ్లనే టార్గెట్ చేశారు.. బ్యాంకు ఖాతాలు, ఫోన్‌పే, గూగుల్‌పే, నగదు రూపంలో డబ్బులు వసూలు చేశారు. మొదట కొంత మొత్తాన్ని లాభంగా తిరిగి ఇచ్చి నమ్మకం పెంచుకున్నారు. ఆ తర్వాత అసలు కథ మొదలైంది. పెట్టిన డబ్బు తిరిగి ఇవ్వకుండా కాలయాపన చేయడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులకు కోట్ల రూపాయల మోసాన్ని బట్టబయలు చేశారు.

ఆదిలాబాద్ జిల్లా శాంతినగర్‌కు చెందిన సాయిని ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టి మోసాపోయాడు. న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించాడు. చీటింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

విచారణలో షాకింగ్ విషయాలు

కేసు దర్యాప్తులో భాగంగా నిందితుడు బండారి రాకేష్‌ను పోలీసులు విచారించారు. పోలీసుల వివరాల ప్రకారం.. కుంటవార్ అచ్యుత్ రెడ్డితో కలిసి సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయడానికి పథకం వేసినట్లు విచారణలో వెల్లడైంది. తెలిసిన వ్యక్తులను నమ్మించి.. రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని చెప్పి డబ్బులు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

16 మంది.. రూ.13.31 కోట్ల లెక్క..

విచారణలో ఇప్పటివరకు 16 మంది నుంచి సుమారు రూ.13.31 కోట్ల వరకు డబ్బులు సేకరించినట్లు వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. ఫోన్‌పే, గూగుల్‌పే, బ్యాంకు ఖాతాలతో పాటు నగదు రూపంలోనూ డబ్బులు తీసుకున్నట్లు గుర్తించారు. దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో సెప్టెంబర్ 11న CCI క్రాస్‌రోడ్ వద్ద బండారి రాకేష్, కుంటవార్ అచ్యుత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి ఫార్చునర్, థార్ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలో ఉన్న ఖరీదైన ప్లాట్లు, స్థలాలకు సంబంధించిన పలు డాక్యుమెంట్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీటిని జప్తు చేసి కోర్టుకు సమర్పించనున్నట్లు వెల్లడించారు.

మరో నిందితుడి కోసం గాలింపు

ఈ వ్యవహారంలో కుంటవార్ చంద్రకాంత్ రెడ్డి కూడా నిందితుడిగా ఉన్నాడని… ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. అదే సమయంలో బ్యాంకు ఖాతాల్లో జరిగిన లావాదేవీలు, నగదు బదిలీలు, ఆస్తులకు సంబంధించిన వివరాలపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అధిక లాభాలు వస్తాయనే ఆశతో ఎవరికి పడితే వారికి భారీ మొత్తాల్లో డబ్బులు ఇవ్వొద్దని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. పెట్టుబడి పెట్టే ముందు సంస్థలు, వ్యక్తుల విశ్వసనీయత, ఆర్థిక లావాదేవీలు, సంబంధిత పత్రాలను పూర్తిగా పరిశీలించాలని సూచించారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us