Republic Day: రాజ్భవన్ లోనే గణతంత్ర దినోత్సవ వేడుకలు.. షెడ్యూల్ విడుదల చేసిన గవర్నర్ కార్యాలయం..
ప్రభుత్వ నిర్ణయం ప్రకారం రాజ్భవన్లోనే గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగనున్నాయి. ప్రస్తుతానికి ఖరారైన కార్యక్రమాల ప్రకారం గురువారం ఉదయం 7 గంటలకు రాజ్భవన్లో గవర్నర్ తమిళిసై త్రివర్ణ పతాకాన్ని ఎగరేస్తారు.
ప్రభుత్వ నిర్ణయం ప్రకారం రాజ్భవన్లోనే గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగనున్నాయి. ప్రస్తుతానికి ఖరారైన కార్యక్రమాల ప్రకారం గురువారం ఉదయం 7 గంటలకు రాజ్భవన్లో గవర్నర్ తమిళిసై త్రివర్ణ పతాకాన్ని ఎగరేస్తారు. ఆ తర్వాత ప్రత్యేక విమానంలో పుదుచ్చేరికి వెళ్లి అక్కడ జెండా వందన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ విమానాన్ని కూడా గవర్నర్ సొంత ఖర్చుతో ఏర్పాటు చేసుకున్నట్టు తెలుస్తోంది. సాయంత్రానికి హైదరాబాద్ తిరిగి వచ్చి రాజ్భవన్లో ఎట్ హోమ్ నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని సీఎం సహా ప్రముఖులందరికీ రాజ్భవన్ నుంచి ఆహ్వానాలు పంపారు.
ప్రగతి భవన్ వర్సెస్ రాజ్భవన్..
74వ రిపబ్లిక్ డే వేడుకలు తెలంగాణలో రాజకీయ రగడకు కారణమయ్యాయి. గవర్నర్కు, గవర్నమెంట్కు మధ్య ఏర్పడిన దూరాన్ని గణతంత్ర వేడుకలు మరింత పెంచాయి. ఇందులో పార్టీలు కూడా చేరడంతో విమర్శలు జోరందుకున్నాయి. మరో వైపు వేడుకల నిర్వహణపై హైకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో ప్రగతి భవన్, రాజ్భవన్ మధ్య దూరం రోజు రోజుకూ పెరుగుతోంది. రిపబ్లిక్ డే పరేడ్ విషయంలో మరోసారి ఈ దూరం మరోసారి స్పష్టంగా కనిపించింది. ఈసారి దూరం రిపబ్లిక్ డే పరేడ్ రూపంలో వచ్చింది. రిపబ్లిక్ డే సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో గవర్నర్ జెండా ఎగరేసి గౌరవ వందనం స్వీకరించి ప్రభుత్వం అందించిన ప్రసంగాన్ని చదవడం సంప్రదాయం. దీనిని ప్రభుత్వం కొన్నేళ్ల క్రితం నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్కు మార్చింది.
గతేడాది కొవిడ్ కారణంగా పబ్లిక్ గార్డెన్స్లో జెండా వందనం నిర్వహించలేదు. రాజ్భవన్లోనే నిర్వహించుకోవాలని ప్రభుత్వం సూచించింది. పోయిన సంవత్సరం గవర్నర్ తమిళిసై రాజ్భవన్లోనే జెండా ఎగరవేశారు. ఇప్పుడు కూడా గత సంవత్సరం మాదరిగానే రిపబ్లిక్ డే రాజ్భవన్లోనే నిర్వహించుకోవాలని ప్రభుత్వం నుంచి రాజ్భవన్కు సమాచారం వచ్చింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం తరపున సీఎం, డీజీపీ హజరువుతారని ప్రభుత్వం నుంచి వచ్చిన లేఖలో ఉంది.
రాష్ట్రంలో అధికారికంగా గణతంత్ర వేడుకలు నిర్వహించకూడదని ప్రభుత్వం నిర్ణయించడంపై గవర్నర్ తమిళిసై అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. పరేడ్ గ్రౌండ్స్లో రిపబ్లిక్ డే జరుపుకోకపోవడం తెలంగాణ ప్రజలను అన్యాయం చేయడమేనని గవర్నర్ ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. ఖమ్మంలో ఐదు లక్షల మందితో బహిరంగ సభ నిర్వహిస్తే లేని కొవిడ్ – పరేడ్ గ్రౌండ్స్లో రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహిస్తే వస్తుందా అని ప్రభుత్వాన్ని గవర్నర్ ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారాన్ని ఆమె కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లనున్నట్టు తెలుస్తోంది.
మరో వైపు గవర్నర్కు ఇవ్వాల్సిన మర్యాదల్లో ఎక్కడా తాము తక్కువ చేయడం లేదని బీఆర్ఎస్ స్పష్టం చేసింది. తాము ఎవరిని ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదని రైతుబంధు ఛైర్మన్ పల్లా రాజేశ్వరరెడ్డి తెలిపారు. మరోవైపు రాజ్భవన్లోనే రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయడాన్ని బీజేపీ తప్పుబట్టింది. ఇది అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని అవమానించడమేనని ఈటల రాజేందర్ విమర్శించారు.
హైకోర్టు ఆదేశాలు..
మరో వైపు రిపబ్లిక్ డే వేడుకలను అధికారికంగా నిర్వహించుకోకపోవడంపై దాఖలైన పిటిషన్పై హైకోర్టులో వాదనలు జరిగాయి. పరేడ్తో గణతంత్ర వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాల్సిందేనని హైకోర్టు ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వ గైడ్లైన్స్ ప్రకారం ప్రజల్లో స్ఫూర్తిని నింపేలా రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించాలని ఉన్నత న్యాయస్థానం సూచించింది. ఈ ఆదేశాల ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..