AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Congress Left Parties : కామ్రేడ్స్‌కి కాంగ్రెస్‌ ప్రపోజల్‌.. లెఫ్ట్‌పార్టీలు సర్దుకుపోతాయా?

ఎర్రజెండాలతో దోస్తీ చేయాలనుకుంటోంది కాంగ్రెస్‌. నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరిస్తే ఎలాగంటోంది సీపీఎం. చేరో సీటిచ్చినా చాలని లెఫ్ట్‌పార్టీలు ప్రపోజ్‌ పెట్టినా ఒక్కటీ ఇచ్చేలా లేదు కాంగ్రెస్‌. దీంతో సీపీఐ ఇంకా వెయిటింగ్‌లో ఉంటే.. సీపీఎం మాత్రం తగ్గేదేలేదంటోంది. ఈసారికి సహకరించండి.. మీ మంచి చెడ్డా మేం చూసుకుంటామంటోంది కాంగ్రెస్‌.

Congress Left Parties : కామ్రేడ్స్‌కి కాంగ్రెస్‌ ప్రపోజల్‌.. లెఫ్ట్‌పార్టీలు సర్దుకుపోతాయా?
Congress Cpi Cpm
Balaraju Goud
|

Updated on: Apr 20, 2024 | 5:51 PM

Share

ఎర్రజెండాలతో దోస్తీ చేయాలనుకుంటోంది కాంగ్రెస్‌. నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరిస్తే ఎలాగంటోంది సీపీఎం. చేరో సీటిచ్చినా చాలని లెఫ్ట్‌పార్టీలు ప్రపోజ్‌ పెట్టినా ఒక్కటీ ఇచ్చేలా లేదు కాంగ్రెస్‌. దీంతో సీపీఐ ఇంకా వెయిటింగ్‌లో ఉంటే.. సీపీఎం మాత్రం తగ్గేదేలేదంటోంది. ఈసారికి సహకరించండి.. మీ మంచి చెడ్డా మేం చూసుకుంటామంటోంది కాంగ్రెస్‌. ఈ పార్లమెంట్‌ ఎన్నికల్లో ఎర్రజెండాలు హస్తంపార్టీతో కలిసొస్తాయా? ఫ్రెండ్లీ కంటెస్ట్‌ తప్పదంటాయా?

అసెంబ్లీ ఎన్నికల్లో స్నేహహస్తం చాచారు. కానీ సీట్ల దగ్గర కాస్త తేడా వచ్చేసరికి లెఫ్ట్‌పార్టీల్లో సీపీఐ సహకరిస్తే, సీపీఎం దూరంగా ఉండిపోయింది. నాలుగునెల్లు తిరిగేలోపే పార్లమెంట్‌ ఎన్నికలొచ్చేశాయి. దీంతో తెలంగాణలో లెఫ్ట్‌పార్టీలతో కాంగ్రెస్‌ దోస్తీపై ఊహాగానాలే తప్ప క్లారిటీ లేదిప్పటిదాకా. అసెంబ్లీ ఎన్నికల్లో మిత్రపక్షం సీపీఐకి కొత్తగూడెం సీటిచ్చింది కాంగ్రెస్. దీంతో ఆ పార్టీకి అసెంబ్లీలో ప్రాతినిధ్యం దక్కింది. సీట్ల విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవటంతో ఒంటరిపోరుకు దిగిన సీపీఎం ఎక్కడా గెలవలేకపోయినా.. కాంగ్రెస్‌తో మాత్రం ఫ్రెండ్లీగానే ఉంది.

పార్లమెంట్‌ ఎన్నికల్లో తమకు బలమున్న ఒక్క సీటైనా ఇవ్వాలని లెఫ్ట్‌పార్టీలు రెండూ కోరుకున్నాయి. ఒక సీటయినా ఇస్తే ఫ్రెండ్‌షిప్‌ మరింత స్ట్రాంగ్‌ అవుతుందంటూ కాంగ్రెస్‌ ముందు నాలుగుసీట్లు ఆప్షన్‌గా పెట్టింది సీపీఐ. సీపీఎం కూడా తమకు బలమున్న చోట ఓ సీటిస్తే చాలనుకుంది. కానీ పార్లమెంట్‌ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్‌ లెఫ్ట్‌పార్టీలతో సీట్లు షేర్‌ చేసుకునే పరిస్థితుల్లో లేదు. దీనిపై సీపీఐ వేచిచూసే ధోరణితో ఉండగా, సీపీఎం ఇప్పటికే భువనగిరి నుంచి అభ్యర్థిని ప్రకటించింది. ఆ పార్టీ అభ్యర్థిగా ఎండీ జహంగీర్‌ నామినేషన్‌ కూడా వేశారు. దీంతో తెలంగాణలో సీపీఎం మద్దతుకోసం కాంగ్రెస్‌ నాయకత్వం రంగంలోకి దిగింది. ఆ పార్టీ ప్రతినిధిగా డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క సీపీఎం రాష్ట్ర కార్యాలయానికి వచ్చి ఆ పార్టీ ముఖ్యనేతలతో చర్చించారు.

కాంగ్రెస్‌ నాయకత్వం అభిప్రాయాన్ని.. భట్టి సీపీఎం నేతలతో పంచుకున్నారు. తమ అభిప్రాయాలు, ఆక్షేపణలను లెఫ్ట్‌ నేతలతో ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఇండియాకూటమిలో లెఫ్ట్‌ పార్టీలు భాగస్వామ్యపక్షాలుగా ఉన్నాయి. కేరళలాంటి రాష్ట్రంలో కొన్ని అభిప్రాయభేదాలు తలెత్తినా మిగిలిన చోట్ల కాంగ్రెస్‌-సీపీఎం మధ్య స్నేహపూర్వక వాతావరణమే ఉంది. సీట్లు ఇవ్వలేకపోయినా నామినేటెడ్‌ పదవుల్లో ప్రాధాన్యం ఉంటుందని సీపీఎం నేతలకు భట్టి హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో భువనగిరి మినహా అన్ని స్థానాల్లో కాంగ్రెస్‌కి మద్దతిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. అయితే కీలకమైన భువనగిరిలో కూడా సీపీఎం పోటీతో నష్టం జరగక్కుండా చూసుకోవాలనుకుంటోంది కాంగ్రెస్‌.

అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌నుంచి సానుకూల ప్రకటన కోసం చివరిదాకా వేచిచూసింది సీపీఎం. కానీ కోరుకున్న సీట్ల విషయంలో కాంగ్రెస్‌ ససేమిరా అనటంతో ఒంటరిగా పోటీకి దిగింది. ఈసారి కూడా కాంగ్రెస్‌నుంచి సానుకూల సంకేతాలేమీ లేకపోవటంతో ఒంటరిపోరుకు సిద్ధమై భువనగిరిలో అభ్యర్థిని ప్రకటించింది. అయితే బీజేపీని ఓడించడమే ప్రధాన లక్ష్యం కాబట్టి మిగిలిన స్థానాల్లో కాంగ్రెస్‌కి మద్దతిచ్చేందుకు ముందుకొచ్చింది సీపీఎం.

మాటల్లేవ్‌ అనకుండా డిప్యూటీసీఎంని చర్చలకు పంపటంతో సీపీఎం మెత్తబడినట్లే కనిపిస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో సహకరిస్తే ఎమ్మెల్సీ లేదా కీలకమైన కార్పొరేషన్‌ పదవి ఇస్తామని కాంగ్రెస్‌ ప్రతిపాదించినట్లు చెబుతున్నారు. ఒంటరిపోరుతో నష్టమే తప్ప లాభం ఉండదని కామ్రేడ్లకు కూడా తెలుసు. అందుకే ఎర్రజెండా పార్టీలు కూడా తెగేదాకా లాగాలనుకోవడం లేదు. అయితే కేరళ ప్రచారంలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి లెఫ్ట్‌ ప్రభుత్వంపై విమర్శలు చేయడాన్ని సీపీఎం తప్పుపడుతోంది. కాంగ్రెస్‌ కూడా కలిసొచ్చే పార్టీలనుంచి ఎలాంటి తల్నొప్పులు వద్దనుకుంటోంది. భట్టి ఎంట్రీతో ఆల్‌ఈజ్‌ వెల్‌ అనుకుంటోంది అధికారపార్టీ. అటు సీపీఐ కూడా కాంగ్రెస్‌తో కుదిరిన స్నేహాన్ని చెడగొట్టుకోదని భావిస్తున్నారు. స్నేహపూర్వకపోటీకి లెఫ్ట్‌పార్టీలు సిద్ధమైనా జాతీయస్థాయిలో అగ్రనాయకత్వం మాట్లాడకుంటే తెలంగాణలో కాంగ్రెస్‌కి బేషరతుగా మద్దతు పలికే అవకాశం కనిపిస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us