AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణలోనూ జై బజరంగభళీ.. బీజేపీ నేతలు కాదండోయ్.. ఇక్కడ సీన్ రివర్స్..!

జై బజరంగభళి, జై హనుమాన్..!! కర్నాటక ఎలక్షన్‌ వార్‌ను పీక్‌ స్టేజ్‌కు తీసుకెళ్లి.. ఓ రేంజ్‌లో ఊపేసిన నినాదం ఇది. బజరంగ్‌దళ్‌ నిషేధం వివాదం తర్వాత ఆ అంశం ఎన్నికల ఎజెండాగా ఎలా మారిపోయిందో చూశాం. అన్ని పార్టీలు హనుమాన్ జపం చేశాయి. ప్రచారమంతా హనుమాన్‌ చుట్టే తిరిగింది.

Telangana: తెలంగాణలోనూ జై బజరంగభళీ.. బీజేపీ నేతలు కాదండోయ్.. ఇక్కడ సీన్ రివర్స్..!
Telangana Politics
Shiva Prajapati
|

Updated on: May 10, 2023 | 8:19 PM

Share

జై బజరంగభళి, జై హనుమాన్..!! కర్నాటక ఎలక్షన్‌ వార్‌ను పీక్‌ స్టేజ్‌కు తీసుకెళ్లి.. ఓ రేంజ్‌లో ఊపేసిన నినాదం ఇది. బజరంగ్‌దళ్‌ నిషేధం వివాదం తర్వాత ఆ అంశం ఎన్నికల ఎజెండాగా ఎలా మారిపోయిందో చూశాం. అన్ని పార్టీలు హనుమాన్ జపం చేశాయి. ప్రచారమంతా హనుమాన్‌ చుట్టే తిరిగింది. ఇప్పుడు అదే జై బజరంగభళి నినాదం.. అదే హనుమాన్ చాలీసా పారాయణం తెలంగాణ రాజకీయలనూ ప్రభావితం చేయబోతోందా? ఇప్పటికే హిందుత్వ ఎజెండాతో దూసుకెళ్తున్న బీజేపీకి చెక్‌ పెట్టడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పావులు కదుపుతోందా? కొండగట్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, కేసీఆర్ కుమార్తె కవిత చేసిన హనుమాన్‌ చాలీసా పారాయణం.. పొలిటికల్‌ సర్కిల్స్‌లో అనేక చర్చలకు కారణం అవుతోంది.

తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న దేవాలయాన్ని సందర్శించారు ఎమ్మెల్సీ కవిత. ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత హునుమాన్ చాలీసా పారాయణంలో పాల్గొన్నారు. మామూలుగా అయితే దీన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ, పొరుగు రాష్ట్రమైన కర్నాటకలో ఇదే హనుమాన్ చుట్టూ రాజకీయం జరిగాక.. అదే ఎన్నికల ఎజెండగా మారాక.. ఇంకా ఆ వేడి కొనసాగుతుండగానే తెలంగాణలో హనుమాన్ చాలీసా పారాయణం జరగడం, అది కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో జరగడం అనేక చర్చలకు దారితీస్తోంది.

గత ఏడాది కూడా కొండగట్టును సందర్శించారు కవిత. అఖండ అనుమాన్ చాలిసా పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక సీఎం కేసీఆర్ కూడా యాదాద్రి తర్వాత మళ్లీ ఆ స్థాయిలో కొండగట్టుని తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. ఇటీవలే కొండగట్టు అంజన్నను సందర్శించుకున్న కేసీఆర్.. ఆలయ అభివృద్ధి కోసం రూ. 500 కోట్లు కూడా ప్రకటించారు. బీజేపీకి చెక్‌పెట్టాలంటే.. హిందుత్వ ఎజెండాను ఎదుర్కోవాలంటే.. అదే పద్ధతిని ఫాలో కావాలని బీఆర్ఎస్ భావిస్తోందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

కర్నాటక తర్వాత బీజేపీ ఫోకస్ అంతా తెలంగాణపైనే ఉండబోతోంది. సరిగ్గా మరో 6 నెలల్లోనే ఎన్నికలు. కచ్చితంగా హిందుత్వ ఎజెండాతోనే బీజేపీ ముందుకెళ్తుందని భావిస్తోంది బీఆర్ఎస్. కర్నాటకలో జరిగింది చూశాక.. ముందునుంచే జాగ్రత్త పడాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే యాదాద్రి నిర్మాణం పూర్తాయిపోయింది. కొండగట్టు ఆలయ పనులనూ పూర్తిచేసి.. తిరుగులేని హిందుత్వ పార్టీగా ముద్రవేసుకుంటే అప్పుడు కమలనాథులను ఎదుర్కోవడం సులభం అవుతుందన్నది బీఆర్ఎస్ ప్లాన్‌గా తెలుస్తోంది. మొత్తానికి కర్నాటకను ఊపేసిన జై బజరంగభళి.. జై హనుమాన్‌.. నినాదాలు, వాదాలు తెలంగాణలోనూ కీలకం కాబోతున్నాయన్నది స్పష్టంగా తెలుస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..