Indian Student Missing in US: మైగాడ్.. అమెరికాలో మరో భారత సంతతి విద్యార్ధి అదృశ్యం! అసలేం జరుగుతోందక్కడ..?
గత కొంతకాలంగా అమెరికాలో భారత సంతతి విద్యార్థులు వరుసగా ప్రమాదాలకు గురవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ తెలుగు విద్యార్థి షికాగోలో అదృశ్యమయ్యాడు. గత వారం రోజులుగా కనిపించకుండా పోయినట్లు ఆ దేశ భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. భారత దేశంలోని తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్కు చెందిన విద్యార్థి రూపేశ్ చంద్ర చింతకింది (26) మే 2వ తేదీ నుంచి కన్పించకుండా పోయాడు..
చికాగో, మే 9: గత కొంతకాలంగా అమెరికాలో భారత సంతతి విద్యార్థులు వరుసగా ప్రమాదాలకు గురవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ తెలుగు విద్యార్థి షికాగోలో అదృశ్యమయ్యాడు. గత వారం రోజులుగా కనిపించకుండా పోయినట్లు ఆ దేశ భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. భారత దేశంలోని తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్కు చెందిన విద్యార్థి రూపేశ్ చంద్ర చింతకింది (26) మే 2వ తేదీ నుంచి కన్పించకుండా పోయాడు. రూపేశ్ చివరిసారిగా మే 2వ తేదీన తన తండ్రితో ఫోన్లో మాట్లాడాడు. టెక్సాస్లోని తన స్నేహితుడిని కలిసేందుకు వెళ్తున్నానని రూమ్మెట్స్కి చెప్పి బయటికి వెళ్లిన వాడు తిరిగి రాలేదు. అయితే అతడు ఎవరిని కలవడానికి పోయాడు అనే విషయం మాత్రం తమకు తెలియదని రూపేశ్ రూంమెట్స్ చెబుతున్నారు. చికాగోలోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా (CGI) ఈ మేరకు భారత విద్యార్ధి అదృశ్యమైన సంఘటనను ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించింది.
హైదరాబాద్లోని అతని కుటుంబ సభ్యులకు కాన్సులేట్ సమాచారం అందించింది. రూపేశ్ ఆచూకీ కోసం అక్కడి పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. కాగా విస్కాన్సిన్లోని కాంకోర్డియా యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నాడు. గత కొంతకాలంగా అమెరికాలో ఇండియన్ విద్యార్ధుల అదృశ్యం సంఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో తాజా సంఘటన కలకలం రేపుతోంది. మరోవైపు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రూపేశ్ కుటుంబం అతడి అదృశ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. తమ కుమారుడి ఆచూకీ కనుగొనాలంటూ భారత విదేశాంగ మంత్రిత్వ శాఖకు రూపేశ్ తండ్రి బుధవారం (మే 8) లేఖ రాశారు. అటు అమెరికా (USA) ఎంబసీని కూడా అభ్యర్ధిస్తున్నారు.
ఈ ఏడాది ఆరంభం నుంచి అగ్రరాజ్యంలో వరుసగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. గత నెలలో ఓహియోకు చెందిన మహ్మద్ అబ్దుల్ అర్ఫత్ అనే విద్యార్థి నెలపాటు కనిపించకుండా పోయాడు. ఆ తర్వాత ఓ చోట శవమై కనిపించాడు. ఇది జరిగిన వారం రోజుల తర్వాత ఉమా సత్య సాయి గద్దె అనే మరో భారతీయ విద్యార్థి ఒహియోలో శవమై కనిపించాడు. ఇలా దాడులు, కిడ్నాప్లు, హత్యలు వంటి వరుస ఘటనల్లో ఇప్పటికే పలువురు భారత సంతతి విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్ధులు కూడా ఉన్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.