Hyderabad: నగరంలో కేటీఆర్ ఆకస్మిక పర్యటన.. బ్రిడ్జ్ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి.
తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కే తారకక రామరావు శనివారం నగరంలో ఆకస్మిక పర్యటన చేపట్టారు. ప్రభుత్వం నిర్మిస్తున్న వీఎస్టీ-ఇందిరా పార్క్ స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలను ఆకస్మికంగా..

తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కే తారకక రామరావు శనివారం నగరంలో ఆకస్మిక పర్యటన చేపట్టారు. ప్రభుత్వం నిర్మిస్తున్న వీఎస్టీ-ఇందిరా పార్క్ స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ఇందిరాపార్క్ వద్ద కొనసాగుతున్న స్టీల్ బ్రిడ్జి పనుల వరకు చేరుకున్న మంత్రి.. స్టీల్ బ్రిడ్జ్ పురోగతిని జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. స్టీల్ బ్రిడ్జి పనుల పురోగతిని తెలుసుకున్న అనంతరం అధికారులకు పలు సూచనలు చేశారు. మరో మూడు నెలలలోగా బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
ఇందుకు అవసరమైన ట్రాఫిక్ మళ్లింపు వంటి అంశాలలో నగర ట్రాఫిక్ పోలీస్ విభాగంతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఎట్టి పరిస్థితులలో మూడు నెలల్లోగా నిర్మాణం పూర్తి చేసేందుకు అవసరమైతే అదనపు బృందాలను ఏర్పాటు చేసి, నిర్మాణ పనులను వేగవంతం చేయాలని వర్కింగ్ ఏజెన్సీని కేటీఆర్ ఆదేశించారు. నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో అటు కార్మికులకు, నగర పౌరులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా కట్టుదిట్టమైన రక్షణ చర్యలను కూడా తీసుకోవాలని సూచించారు. ఈ స్టీల్ బ్రిడ్జి అద్భుత నిర్మాణంగా మారబోతోందని మంత్రి అభిప్రాయపడ్డారు. 2.62 కిలోమీటర్ల పొడవైన నాలుగు వరుసల స్టీల్ బ్రిడ్జి కోసం దాదాపు 426 కోట్ల రూపాయలను జిహెచ్ఎంసి ఖర్చు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.
ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద ట్రాఫిక్ ని తగ్గించి, ముషీరాబాద్, ఖైరతాబాద్, అంబర్పేట్ ప్రజల సౌకర్యార్థం ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని సత్వరంగా పూర్తి చేయాలన్న లక్ష్యంతోనే సాధారణ కాంక్రీట్ నిర్మాణం కాకుండా స్టీల్ బ్రిడ్జి మార్గంలో బ్రిడ్జి నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం రానున్న 3 నెలల్లో పూర్తి అవుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసిన కేటీఆర్, ఈ నిర్మాణం ద్వారా నగర పౌరులకు ట్రాఫిక్ రద్దీ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించిన తర్వాత ఎస్ ఎన్ డి పి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పలు మాలిక సదుపాయాల కార్యక్రమాలను మంత్రి కేటీఆర్ పరిశీలించారు. హుస్సేన్ సాగర్ సర్ప్లస్ నాలా లో చేపడుతున్న పనులను సమీక్షించారు. అశోక్ నగర్ వద్ద కొనసాగుతున్న రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఇప్పటికే ఎస్ ఎన్ డి పి కార్యక్రమంలో భాగంగా వరద ముంపు ఉన్న ప్రాంతాలను గుర్తించి, వరద ప్రమాదాన్ని తగ్గించే విధంగా అనేక కార్యక్రమాలను చేపట్టినట్లు కేటీఆర్ తెలిపారు. హుస్సేన్ సాగర్ వరద నీటి ద్వారా లోతట్టు ప్రాంతాల ప్రజలకు భవిష్యత్తులో ముంపు ఇబ్బందులు రాకుండా ఉండేందుకు హుస్సేన్ సాగర్ సర్ప్లస్ నాలకు భారీ ఎత్తున నిధులు కేటాయించి రిటైనింగ్ వాల్ వంటి పనుల నిర్మాణం కొనసాగిస్తున్నట్లు తెలిపారు. వర్షాకాలం ప్రారంభం నాటికి ఈ పనులన్నీ పూర్తి అయ్యేలా స్థానిక ఎమ్మెల్యేతో పాటు ఇతర ప్రజా ప్రతినిధుల సహకారంతో వేగంగా ముందుకు పోవాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ జిహెచ్ఎంసి అధికారులకు సూచించారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..




