Hyderabad: అమ్యామ్యా తీసుకుంటూ అడ్డంగా బుక్కైన కూకట్పల్లి టాక్స్ సీనియర్ ఆఫీసర్.. వీడియో
జీహెచ్ఎంసీ 23 మూసాపేట్ సర్కిల్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారుల దాడులు చేశారు. ట్యాక్స్ విభాగంలో ఓ అధికారి లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. సదరు అధికారిని టాక్స్ సీనియర్ అసిస్టెంట్ సునీతగా గుర్తించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఈ కింద చెక్ చేయవచ్చు..
కూకట్పల్లి, జులై 1: లంచం తీసుకుంటూ ఓ ప్రభుత్వ అధికారి అవినీతి నిరోధక శాఖ చేతికి చిక్కిన ఘటన కూకట్పల్లి జోనల్ పరిధిలోని మూసాపేట సర్కిల్లో చోటు చేసుకుంది. ఏసిబి అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ వ్యక్తి తన ఆస్తి మ్యుటేషన్ నిమిత్తం మూసాపేట సర్కిల్ ఆస్తి పన్ను విభాగంలోని సీనియర్ అసిస్టెంట్ సునీతను సంప్రదించాడు. ఆమె ఆస్తి మ్యుటేషన్ పత్రాలు ఇచ్చేందుకు బాధితుడి నుండి 80 వేల రూపాయలు లంచం డిమాండ్ చేయగా, అతను ఆమెను బ్రతిమిలాడటంతో 30 వేల రూపాయలకు తగ్గేది లేదని తెగేసి చెప్పింది. ఆమె వేధింపులు తట్టుకోలేక బాధితుడు అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించగా, ఈ రోజు మధ్యాహ్నం సునీతకు బాధితుడు డబ్బులు ఇస్తుండగా రెడ్ హ్యాండెండ్ గా పట్టుకున్నారు. ఆమె నుంచి 30 వేల రూపాయలు, బాధితుడి ఫైల్ స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంపై ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారని అవినీతి నిరోధక శాఖ డిఎస్పీ శ్రీధర్ తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.




