NIMS: ప్రభుత్వ దవాఖాన అంటే ఇట్లా ఉండాలే..10 నెలల్లోనే 101 కిడ్నీ మార్పిడి సర్జరీలు

నిమ్స్‌ హాస్పిటల్‌ అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. 10 నెలల్లోనే 101 కిడ్నీ మార్పిడి సర్జరీలు చేసింది. ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీలు చేసిన నిమ్స్ డాక్టర్లు, సిబ్బందిని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా అభినందించారు. నిమ్స్‌తో పాటు, గాంధీ, ఉస్మానియా హాస్పిటల్స్‌లోనూ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీలు చేసేందుకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు.

NIMS: ప్రభుత్వ దవాఖాన అంటే ఇట్లా ఉండాలే..10 నెలల్లోనే 101 కిడ్నీ మార్పిడి సర్జరీలు
Nims Doctors
Follow us

|

Updated on: Oct 17, 2024 | 4:41 PM

10 నెలల్లోనే వందకుపైగా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీలు చేసిన ప్రభుత్వ ఆసుపత్రిగా నిమ్స్‌ హాస్పిటల్‌ అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ 15వ తేదీ వరకూ 101 కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీలు చేశామని నిమ్స్ డైరెక్టర్, డాక్టర్ బీరప్ప వెల్లడించారు. ఇందులో 55 కిడ్నీలను బాధిత పేషెంట్ల కుటుంబసభ్యులు డొనేట్ చేయగా, ఇంకో 46 కిడ్నీలను బ్రెయిన్ డెత్ కేసుల నుంచి సేకరించి పేషెంట్లకు అమర్చామని ఆయన తెలిపారు. ఇవిగాకుండా 4 లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీలు, ఒక హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీ కూడా చేశామని ఆయన వెల్లడించారు. ఈ సర్జరీలు అన్నీ ఆరోగ్యశ్రీ కింద పూర్తి ఉచితంగా చేశామన్నారు. పేషెంట్లకు అవసరమైన మెడిసిన్ కూడా ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు. ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీలకు అవసరమైన అన్ని సౌకర్యాలను ప్రభుత్వం కల్పించిందన్నారు. ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా పూర్తి సహకారంతో తాము ఈ ఘనత సాధించగలిగామన్నారు. ఆరోగ్యశ్రీ కింద ట్రాన్స్‌ప్లాంటేషన్ ప్యాకేజీల ధరలను కూడా సవరించడంతో, పేషెంట్లకు అవసరమైన అన్ని రకాల సదుపాయాలను కల్పించగలుగుతున్నామని ఆయన తెలిపారు.

ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీలు చేసిన నిమ్స్ డాక్టర్లు, సిబ్బందిని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా అభినందించారు. నిమ్స్‌తో పాటు, గాంధీ, ఉస్మానియా హాస్పిటల్స్‌లోనూ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీలు చేసేందుకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. అవసరమైన పేషెంట్లకు ప్రభుత్వ దవాఖాన్లలో ఉచితంగా అవయవమార్పిడి సర్జరీలు చేయిస్తున్నామన్నారు. ఆరోగ్యశ్రీ ప్యాకేజీలను సవరించి, ట్రాన్స్‌ప్లాంటేషన్ పేషెంట్లకు జీవితకాలం అవసరమైన మెడిసిన్‌ను ఉచితంగా అందజేస్తున్నామని మంత్రి గుర్తు చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి