ఘనంగా లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి బోనాలు.. పోటెత్తిన జనసందోహం..
హైదరాబాద్ భక్తి మయంగా మారింది. ఆదివారం తెల్లవారుజామున లాల్దర్వాజ బోనాల జాతర ఘనంగా ప్రారంభమైంది. అమ్మవారి సన్నిధికి భక్తులు..
హైదరాబాద్ భక్తి మయంగా మారింది. ఆదివారం తెల్లవారుజామున లాల్దర్వాజ బోనాల జాతర ఘనంగా ప్రారంభమైంది. అమ్మవారి సన్నిధికి భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో సందడి వాతావరణం నెలకొంది. ఎక్కడా కూడా అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేలా అధికారులు ఇప్పటికే భక్తుల కోసం అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు.
లాల్ దర్వాజలోని సింహవాహిని మహంకాళి, అక్కన్న మాదన్న ఆలయాలతో పాటు ఆలయాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే సీసీ కెమెరాలు కూడా పెట్టి పరిసర ప్రాంతాలను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. సౌత్ జోన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఏకంగా 400 సీసీ కెమెరాలతో నిఘా ఉంచారు. బోనాలు జరగనున్న ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కూడా అమలు చేశారు.
అయితే సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారి దర్శనానికి భక్తులు తెల్లవారుజాము నుంచే క్యూ కట్టారు. అమ్మవారికి ఆలయ అధికారులు బంగారు బోనం సమర్పించారు. ఇక తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా వచ్చిన ఆయన బోనం సమర్పించారు. అలాగే ప్రభుత్వం తరుపును పలువురు ప్రజాప్రతినిధులు సైతం అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. మరోవైపు ఆలయానికి వేసిన రంగులు, అమ్మవారి అలంకరణ, దేవాలయానికి వేసిన విద్యుత్ దీపాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి




