Hyderabad: కాచిగూడ రైల్వే స్టేషన్కు కొత్తందాలు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదగా నేడే ప్రారంభం
భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ రూ.2.23 కోట్ల వ్యయంతో కాచిగూడ రైల్వే స్టేషన్ లైటింగ్ సిస్టమ్ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన సంగతి తెలిసిందే. 100 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ రైల్వే స్టేషన్కు విజువల్ హైలైట్గా, వారసత్వ చిహ్నంగా మార్చేందుకు కేంద్ర సర్కార్ చేపట్టిన అద్భుత ప్రయోగం ఇది. సోమవారం సాయంత్రం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదగా ప్రారంభించడానికి అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు..

హైదరాబాద్, జూన్ 9: కాచిగూడ రైల్వే స్టేషన్లో సోమవారం (జూన్ 9) లైటింగ్ సిస్టమ్ ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. నేటి సాయంత్రం 5.30 గంటలకు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి చేతుల మీదగా దీనిని ప్రారంభించనున్నారు. భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ రూ.2.23 కోట్ల వ్యయంతో కాచిగూడ రైల్వే స్టేషన్ లైటింగ్ సిస్టమ్ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన సంగతి తెలిసిందే. 100 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ రైల్వే స్టేషన్కు విజువల్ హైలైట్గా, వారసత్వ చిహ్నంగా మార్చేందుకు జాతీయతను ప్రతిబింబించే థీమ్తో కేంద్ర సర్కార్ చేపట్టిన అద్భుత ప్రయోగం ఇది. ప్రయాణీకులకు సకల సౌకర్యాలతో కూడిన ఈ స్టేషన్ నుంచి రోజుకు సగటున 103 రైళ్లు 45 వేల మంది ప్రయాణికులను గమ్య స్థానాలకు చేర్చుతుంది.
కాచీగూడ ముఖభాగం లైటింగ్ సిస్టం ద్వారా మన వారసత్వ నిర్మాణాల సౌందర్యాన్ని వెలికితీసేందుకు, వాటి సాంస్కృతిక – చారిత్రక ప్రాముఖ్యతను ప్రజలు గుర్తించేలా వాటిని మరింత దృశ్యమానంగా మార్చడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 1916లో నిజాం పాలనలో గోతిక్ నిర్మాణ శైలిలో నిర్మించిన కాచిగూడ రైల్వే స్టేషన్ను.. ఇటీవల దాదాపు 785 లైటింగ్ ఫిక్చర్లతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. ఈ లైట్లు రాత్రి సమయంలో రైల్వే స్టేషన్లోని వాస్తుశిల్పం, వారసత్వ ఆకర్షణను మరింత హైలెట్ చేస్తాయి.
హైదరాబాద్ నగరంలోని ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడంలో ఎంతో కీలకంగా ఉన్న నాంపల్లి రైల్వే స్టేషన్.. ఇప్పుడు సాంస్కృతిక దృశ్య ఆకర్షణగా కూడా నిలుస్తుంది. ఈ రైల్వే స్టేషన్ చారిత్రాత్మక ప్రాముఖ్యత, వారసత్వ విలువలను అవగతం చేసుకోవడానికి, అభినందించడానికి లైటింగ్ వ్యవస్థ సహాయపడుతుంది. కాచిగూడ రైల్వే స్టేషన్ కూడా గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నమూనాకు చెందినదే. గ్రీన్ ఎనర్జీ వాడకం ద్వారా పర్యావరణ హితానికి తోడ్పాటునందించేందుకు ఏర్పాటు చేశారు. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (IGBC).. దీనికి ఏకంగా ప్లాటినం రేటింగ్ ఇచ్చింది. అంతేకాకుండా ఈ స్టేషన్ ఇండియన్ రైల్వేస్ ఎనర్జీ-ఎఫిషియంట్ స్టేషన్గా కూడా గుర్తింపు పొందింది. పైగా డిజిటల్ చెల్లింపు సిస్టమ్ను ప్రవేశపెట్టిన దేశంలోని రైల్వేలలో మొదటి స్టేషన్ కూడా ఇదే కావడం గమనార్హం. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఈ స్టేషన్ పునరాభివృద్ధికి రూ.421.66 కోట్ల బడ్జెట్ను సైతం కేటాయించారు. ఫలితంగా కాచీగూడ రైల్వే స్టేషన్ ప్రయాణీకుల సౌకర్యాలను మరింత మెరుగుపరచడంతోపాటు ఐకానిక్ వారసత్వాన్ని నిలుపుకునేందుకు దోహదపడనుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.