Hyderabad: ఎర్లీ బర్డ్ ఆఫర్ జీహెచ్‌ఎంసీపై కాసుల వర్షం.. ఎగబడి మరీ ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించిన జనం

ఎర్లీ బర్డ్ ఆఫర్ జీహెచ్‌ఎంసీపై కాసుల వర్షం కురిపించింది. ఒక్క నెలలోనే ఖజానా నింపింది. ఈ ఆఫర్‌ ఉండటంతో ఎగబడి మరీ ట్యాక్స్‌ పే చేశారు హైదరాబాద్‌ ప్రజలు.

Hyderabad: ఎర్లీ బర్డ్ ఆఫర్ జీహెచ్‌ఎంసీపై కాసుల వర్షం.. ఎగబడి మరీ ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించిన జనం
Ghmc
Follow us

|

Updated on: May 01, 2022 | 11:48 AM

GHMC Early Bird Offer: ఎర్లీ బర్డ్ ఆఫర్ జీహెచ్‌ఎంసీపై కాసుల వర్షం కురిపించింది. ఒక్క నెలలోనే ఖజానా నింపింది. ఈ ఆఫర్‌ ఉండటంతో ఎగబడి మరీ ట్యాక్స్‌ పే చేశారు హైదరాబాద్‌ ప్రజలు. రికార్డు స్థాయిలో అనుకున్న టార్గెట్ చేరుకోవడం పట్ల గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్ మహానగరం పరిధిలో ప్రభుత్వం ఆస్తిపన్ను చెల్లింపుదారుల కోసం తీసుకువచ్చిన 5 శాతం రాయితీ పథకం ముగిసింది. ఎర్లీ బర్డ్ ఆఫర్‌తో జీహెచ్ఎంసీకి కాసులపంట పండింది. ఈ ఆఫర్‌ కారణంగా ప్రాపర్టీ ట్యాక్స్ భారీగా వసూలైంది. నెల రోజుల్లోనే 742 కోట్ల రూపాయల ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు అయ్యింది. ఏప్రిల్‌ నెలలో ట్యాక్స్ పే చేసిన వారికి 5 శాతం రిబెట్ ఉంటుందని అధికారులు ప్రకటించగా, ఎగబడి మరీ ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించారు హైదరాబాద్‌ ప్రజలు.

గతేడాది మొత్తం 1495 కోట్ల రూపాయలే వసూలు అయ్యాయి. కానీ, ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే రికార్డు స్థాయిలో వసూలు అయినట్టు చెబుతున్నారు బల్దియా అధికారులు. గతేడాది మొత్తం వసూళ్లలో దాదాపు సగం కలెక్షన్ ఒక్క ఏప్రిల్ నెలలోనే వసూలు అయ్యింది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఏప్రిల్ 30 అర్ధరాత్రితో ఎర్లీ బర్డ్ ఆఫర్ ముగిసింది. దీంతో మళ్లీ మామూలుగానే పన్నులు కట్టాల్సి ఉంటుంది. అయితే, ఈ ఆఫర్‌ను పొడిగిస్తారని అంతా భావించారు. కానీ, పొడిగింపు లేదని స్పష్టం చేశారు జీహెచ్‌ఎంసీ అధికారులు.

జీహెచ్‌ఎంసీ యాక్ట్‌ 1955 సవరణలో భాగంగా 2013 నుంచి ఎర్లీ బర్డ్‌ ఆఫర్‌ ప్రకటిస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన 5 శాతం పన్ను రాయితీని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని, అధికారులు విస్తృతంగా అవగాహన కల్పించారు. సకాలంలో పన్నులు చెల్లిస్తే చెల్లించిన వారికి, ప్రభుత్వానికి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. అటు సిబ్బంది, అధికారులు అందుబాటులో ఉండటం, ఆన్‌లైన్‌లో కూడా చెల్లించే అవకాశం ఉండటంతో భారీగా పన్నులు వసూలు అయ్యాయి. మొత్తానికి ఈ ఆఫర్, అటు జీహెచ్‌ఎంసీకి, ఇటు ప్రజలకు ఉపయోగకరంగా ఉందనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.

Read Also…  Eluru Murder Case: గంజి ప్రసాద్‌ హత్యకేసులో కీలక మలుపు.. ఎమ్మెల్యేపై కుటుంబసభ్యుల సంచలన ఆరోపణలు!