Hyderabad: ప్రాణ దాత.. మరణించి మరో ఐదు ప్రాణాలు నిలిబెట్టి.. స్వరీనా నీవు చిరంజీవివే తల్లీ..!
డిసెంబరు 15న తాను నివశిస్తున్న అపార్ట్మెంట్లోని నాల్గవ అంతస్తు నుంచి ప్రమాదవశాత్తూ పడిపోయిన 10వ తరగతి విద్యార్థిణి స్వరీనకు తీవ్ర గాయాలయ్యాయి.

తను చదువులో ఎప్పుడూ ముందుంటుంది. ఫ్రెండ్స్తో, తోటి విద్యార్థులతో ఇట్టే కలిసిపోతుంది. కల్చరల్ యాక్టివిటీస్లో కూడా ఎంతో జోష్తో పార్టిసిపేట్ చేస్తుంది. పేరెంట్స్తో ఎంతో ప్రేమతో మెలుగుతుంది. తను ఎక్కడుంటే.. అక్కడ సందడే. పెద్దయ్యాక డాక్టర్ అయ్యి ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టాలనుకుంది. కానీ విధి 14 ఏళ్లకే తనని బలి తీసుకుంది. అయినప్పటికీ.. అవయవదానంతో ఐదుగురుకి ప్రాణం పోసి.. తన కోరికను కొంతమేర నెరవేర్చుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. మణికొండ పరిధిలోని నెక్నంపూర్కు చెందిన బుస చంద్రశేఖర్, రాగ దంపతుల కుమార్తె స్వరీన(14) ఓ ప్రైవేట్ స్కూల్లో టెన్త్ క్లాస్ చదువుతుంది. ఈనెల 15న ఆమె నివశిస్తున్న బిల్డింగ్ ఫోర్త్ ఫ్లోర్ నుంచి ప్రమాదవశాత్తూ కిందపడింది. తీవ్ర గాయాలపాలైన ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు ఐసీయూలో ఉంచి అత్యవసర చికిత్స అందించారు. అయినప్పటికీ స్వరీన మృత్యువును ఓడించలేకపోయింది. నాలుగు రోజుల అనంతరం ఆమె బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు గుర్తించారు.
విషయం తెలుసుకున్న జీవన్దాన్ ప్రతినిధులు.. ఆస్పత్రికి వెళ్లి.. స్వరీన పేరెంట్స్కు అవయవదానం ఆవశ్యకతను వివరించారు. వారు అంగీకారం తెలపడంతో.. 2 కిడ్నీలు, కాలేయం, రెండు లంగ్స్ సేకరించి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులకు అమర్చారు. డాక్టర్ కాకపోయినప్పటికీ.. అవయవ దానం ద్వారా ప్రాణాలు నిలిపి.. ఐదుగురికి పునర్జన్మనిచ్చింది స్వరీన.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..