Hyderabad: హైదరాబాదీలకు గుడ్న్యూస్.. ఇక కలుషిత నీటి సమస్యే ఉండదు..! ఎలా అంటే?
హైదరాబాద్ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించే లక్ష్యంతో జలమండలి ప్రత్యేక కార్యచరణ రూపొందించింది. కలుషిత నీటి సరఫరాను అరికట్టడానికి కాలం చెల్లిన పైప్లైన్లను గుర్తించి, రెండు నెలల్లో మార్చాలని ఎండీ అశోక్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రోబోటిక్ టెక్నాలజీతో లీకేజీలు, కలుషితాన్ని గుర్తించి, హైదరాబాద్ను వాటర్ పొల్యూషన్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దాలని ఆయన అన్నారు.

హైదరాబాద్ ప్రజలకు తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, స్వచ్చమైన నీటిని అందించే లక్ష్యంతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేట్టారు జలమండలి అధికారులు. కలుషిత నీరు సరఫరాతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా హైదరాబాద్ను వాటర్ పొల్యూషన్ ఫ్రీ సిటీగా తీర్చి దిద్దడానికి ప్రత్యేక యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేశారు. కలుషిత నీరు ఫిర్యాదులను ‘జీరో’కు తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఎండీ అశోక్ రెడ్డి సంబంధిత అధికారులతో శనివారం ఖైరతాబాద్ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎండీ మాట్లాడుతూ.. వివిధ కారణాలతో ప్రతినిత్యం కలుషిత నీరు ఫిర్యాదులు నమోదు అవుతాయని, వెంటనే అధికారులు స్పందించి.. ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. అయితే, ఎంసీసీకి అందే కలుషిత నీరు ఫిర్యాదులు ఏయే ప్రాంతాల నుంచి అధికంగా వస్తున్నాయో వివరాలను సేకరించి.. సమస్య మూలాలను విశ్లేషించాలని అధికారులను ఆయన సూచించారు. అలాగే.. డివిజన్ వారీగా కాలం చెల్లిన పైపు లైన్ల వివరాలు, కలుషిత నీరు నమోదయ్యే ఫిర్యాదుల ఆధారంగా, ఒకటి కంటే ఎక్కువ సార్లు ఫిర్యాదులు అందే ప్రాంతాల్లో పైపు లైన్ల వివరాలను సేకరించాలని తెలిపారు. ఆ ప్రాంతాల్లో పైపు లైన్ల పటిష్టతను అంచనా వేసి మార్చడానికి ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని సూచించారు.
ఇది కూడా చదవండి: డయాబెటీస్ రోగులు ఎగిరిగంతేసే టిప్.. రైస్ ఇలా వండితే.. అన్నం తిన్నా షుగర్ కంట్రోల్లో ఉంచుకోవచ్చు!
వీటితోపాటు, కాలం చెల్లిన పైపు లైన్ల స్థానంలో కొత్త పైపు లైన్ల నిర్మాణం చేయడానికి ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ పనులు పూర్తి చేయడానికి సరైన కార్యాచరణ వెంటనే సమర్పించాలన్నారు. రానున్న రెండు నెలల్లో పైప్ లైన్ పునర్నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారులను కోరారు. దానికి సంబంచిన కొత్త పైప్ లైన్ నిర్మాణ పనుల అంచనాలు వెంటనే సమర్పించి ఆమోదం పొందాలని సూచించారు.
కలుషిత నీటిని గుర్తించి, లీకేజీలు అరికట్టడానికి సరికొత్త రోబోటిక్ టెక్నాలజీతో పనిచేసే పొల్యూషన్స్ ఐడెంటిఫికేషన్ మెషిన్ ను ఇప్పటికే జంలమండలి అందుబాటులోకి తీసుకొచ్చిన విషయాన్ని ఈ సందర్బంగా ఎండీ వివరించారు. దీన్ని పైప్ ఇన్ స్పెక్షన్ కెమెరా సిస్టం అని కూడా అంటారని.. దీని ద్వారా కలుషిత నీటి సరఫరా, లీకేజీలను త్వరగా గుర్తించి సమస్యలను పరిష్కరించ వచ్చని తెలిపారు. దీని వల్ల ఇక హైదరాబాద్ నగరంలో కలుషిత నీటి సమస్య ఉండదని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి:అల్లం వాడేటప్పుడు పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి..! లేదంటే తిన్నా వేస్టే!
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
