Hyderabad: సీబీఐ అంటూ కాల్ చేశారు.. కట్ చేస్తే వృద్ధుడి అకౌంట్ నుంచి రూ.కోటి మాయం.. చివరకు ఎలా చిక్కారంటే..?
మీ ఫోన్కి ముంబై పోలీసుల పేరుతో వీడియో కాల్ వచ్చిందా..? మీరు అక్రమ లావాదేవీలు చేస్తున్నారని అరెస్ట్ చేస్తామని బెదిరిస్తున్నారా..? అయితే జాగ్రత్త.. మీరు డిజిటల్ అరెస్ట్ ఉచ్చులో పడే ప్రమాదం ఉంది. తాజాగా హైదరాబాద్లో ఒక వృద్ధుడిని భయపెట్టి ఏకంగా రూ.1.07 కోట్లు కాజేసిన అంతర్రాష్ట్ర ముఠాను సైబర్ క్రైమ్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.

హైదరాబాద్లో డిజిటల్ అరెస్ట్ మోసాన్ని సైబర్ క్రైమ్ పోలీసులు ఛేదించారు. రూ.1.07 కోట్ల సైబర్ మోసం కేసులో కీలక నిందితులైన గుర్దీప్ సింగ్ అలియాస్ లక్కీ నారంగ్, హర్ప్రీత్ సింగ్ అలియాస్ విరాజ్, కుమార్ మోహిత్లను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డిజిటల్ అరెస్ట్ తరహా మోసాల్లో ఒకటిగా పోలీసులు తెలిపారు. నిందితులు ముంబై క్రైమ్ బ్రాంచ్, సీబీఐ అధికారులుగా నటిస్తూ 62 ఏళ్ల వృద్ధుడిని బెదిరించారు. అక్రమ కార్యకలాపాల్లో అతని పేరు ఉందని, తక్షణమే చర్యలు తీసుకుంటామని భయపెట్టి డిజిటల్ అరెస్ట్ పేరిట భారీ మొత్తంలో డబ్బులు కట్టించారు. ఈ విధంగా బాధితుడి నుంచి మొత్తం రూ.1.07 కోట్లను వివిధ బ్యాంక్ ఖాతాల ద్వారా వసూలు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. కేసు దర్యాప్తులో భాగంగా నిందితుల వద్ద నుంచి కీలక బ్యాంక్ ఖాతాల వివరాలు, మొబైల్ ఫోన్లు, ఇతర డిజిటల్ ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ పరికరాల ద్వారా సైబర్ మోసాలకు సంబంధించిన కీలక సమాచారం లభించిందని అధికారులు తెలిపారు.
ఇదే తరహా సైబర్ నేరాల్లో దేశవ్యాప్తంగా పలుచోట్ల ఈ నిందితుల పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బాధితులను భయపెట్టి డబ్బులు వసూలు చేసే డిజిటల్ అరెస్ట్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద కాల్స్ లేదా వీడియో కాల్స్ వస్తే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సూచించారు. పోలీసుల దర్యాప్తులో నిందితులు ప్రత్యేకంగా వృద్ధులు, ఒంటరిగా నివసించే వారిని లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడైంది. నకిలీ అధికారిక ఐడీలు, ఫేక్ వీడియో కాల్స్, అధికార భాషను ఉపయోగిస్తూ బాధితులను మానసికంగా ఒత్తిడికి గురిచేసి డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. డబ్బును వివిధ బ్యాంక్ ఖాతాల్లోకి మళ్లించి, వెంటనే విత్డ్రా చేయడం లేదా ఇతర ఖాతాలకు ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా ఆనవాళ్లు లేకుండా చేయడానికి ప్రయత్నించినట్లు దర్యాప్తులో తేలింది.
ఈ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని, నిందితుల నెట్వర్క్కు సంబంధించిన మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ఇలాంటి సైబర్ మోసాలపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజలు అప్రమత్తంగా ఉండి పోలీస్ లేదా సీబీఐ అధికారులు అని చెప్పుకుంటూ వచ్చే కాల్స్ను నమ్మవద్దని సూచించారు. అనుమానాస్పద కాల్స్ వచ్చిన వెంటనే 1930 హెల్ప్లైన్ లేదా స్థానిక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కోరారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..
