మరో 48 గంటలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలిః ఈటెల
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత కొద్ది రోజుల నుంచి ఎడతెరుపు లేకుండా భారీ వర్షాలు కురుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి ఈటెల రాజేందర్ హుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట, ఇల్లందకుంట, కమలాపూర్ మండలాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించి..
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత కొద్ది రోజుల నుంచి ఎడతెరుపు లేకుండా భారీ వర్షాలు కురుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి ఈటెల రాజేందర్ హుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట, ఇల్లందకుంట, కమలాపూర్ మండలాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించి, రైతులను పరామర్మించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే ప్రజలకు కావాల్సిన సహాయ సహకారాలు ఏర్పాట్లు చేశామన్నారు. ఇక రాబోయే 48 గంటల్లో మరోమారు తీవ్రమైన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. కాబట్టి ప్రజలతో పాటు అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలి. అధికారులకు తోడుగా ప్రజా ప్రతినిధులు కూడా రంగంలోకి దిగి సహాయం అందించాలన్నారు.
పలు జిల్లాల్లో పెద్ద ఎత్తున వర్షాలు కురిశాయి. ఈ వర్షాలతో వాగులు, వంకలు పొండగమే కాకుండా చెరువులు నిండి ఉన్నాయి. చాలా గ్రామాలకు రవాణా సౌకర్యాలు బంద్ అయ్యాయి. ఇంత పెద్ద ఎత్తున, ఇంత తక్కువ కాలంలో వర్షం పడటం అరుదు. తెగిపోయిన చెరువులు, మునిగిపోయిన పంట పొలాలు, కూలిపోయిన ఇళ్ల విషయంలో ఇప్పటికే కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇరిగేషన్, వ్యవసాయ, రెవెన్యూ అధికారులు పర్యటించి నష్ట అంచనాలు వేయాలని ఆదేశించాను. జరిగిన సంఘటనలన్నింటినీ పరిశీలించి వరద తగ్గిన తర్వాత సహాయ చర్యలు, సహాయ సహకారాలు అందిస్తాం.
ఇప్పుడు వెంటనే ఇబ్బంది పడుతున్న ప్రజలందరికీ ఆహారాన్ని, కావాల్సిన సహాయకారాలు అందిస్తాము. రైతాంగానికి పంట నష్టంపై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుని ప్రకటిస్తారు. ఇక ఇప్పటికే రెండు కమాండ్ కంట్రోల్ సెంటర్లు ఏర్పాటు చేశాం. ప్రజలకు ఎలాంటి సహాయం కావాలన్నా ఆ కంట్రోల్ సెంటర్లకు ఫోన్ చేయవచ్చు. అలాగే అన్ని జిల్లా కలెక్టర్లతో మాట్లాడి ప్రత్యేక బృందాలను పంపిస్తున్నాం. అవసరం ఉన్న చోట ప్రజలను ప్రత్యేక షెల్టర్లకు తరలించి భోజన సదుపాయాలు కల్పించే ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈటెల వివరించారు.
Read More:
మళ్లీ పెరుగుతోన్న పెట్రోల్ ధరలు
బ్రేకింగ్ః ముంబైలోని క్రాఫోర్డ్ మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం
ఏపీఎస్ఆర్టీసీ సరికొత్త సేవలు.. బస్సుల్లో వైఎస్సార్ జనతా బజార్లు