Telangana: ఈడీ లేదంటే ఐటీ.. టీఆర్ఎస్ నేతలే టార్గెట్గా వరుసగా దాడులు, సోదాలు
మంగళవారం ఉదయం నుంచి మల్లారెడ్డి నివాసం, కాలేజీల్లో నాన్స్టాప్గా తనిఖీలు జరుగుతున్నాయి. ప్రధానంగా విద్యాసంస్థల లావాదేవీలపై ఐటీ నజర్ వేసింది. మెడికల్ సీట్ల కేటాయింపుల్లో ప్రైవేట్ వ్యక్తులకు సీట్లు అమ్ముకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మల్లారెడ్డికి చెందిన 4 మెడికల్ కాలేజీల్లో బ్యాంక్ లావాదేవీలను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు.
అయితే ఈడీ లేదంటే ఐటీ.. ఈ రెండు దర్యాప్తు సంస్థలు టీఆర్ఎస్ నేతలే టార్గెట్గా వరుసగా దాడులు చేస్తూనే ఉన్నాయి. లేటెస్ట్గా మంత్రి మల్లారెడ్డికి చెందిన విద్యాసంస్థల్లో ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. 50 టీమ్స్ ఉదయం నుంచి మల్లారెడ్డి నివాసాల్లో ఆయన బంధువుల ఇళ్లల్లో సోదాలు చేస్తున్నారు. మంగళవారం ఉదయం నుంచి మల్లారెడ్డి నివాసం, కాలేజీల్లో నాన్స్టాప్గా తనిఖీలు జరుగుతున్నాయి. ప్రధానంగా విద్యాసంస్థల లావాదేవీలపై ఐటీ నజర్ వేసింది. మెడికల్ సీట్ల కేటాయింపుల్లో ప్రైవేట్ వ్యక్తులకు సీట్లు అమ్ముకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మల్లారెడ్డికి చెందిన 4 మెడికల్ కాలేజీల్లో బ్యాంక్ లావాదేవీలను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు. అంతకుముందు మరో టీఆర్ఎస్ మంత్రి గంగుల కమలాకర్ టార్గెట్గా ఆయన ఇళ్లు, కార్యాలయాలపై ఏకకాలంలో ఐటీ, ఈడీ సోదాలు జరిపింది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన గ్రానైట్ వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాలపై మెరుపు దాడులు చేశారు. గ్రానైట్ ఎగుమతుల్లో భాగంగా ఆయా సంస్థలు అక్రమాలకు పాల్పడుతున్నాయన్న ఆరోపణలతో 8 సంస్థలకు నోటీసులు జారీ చేశాయి. ఆ తర్వాత ఎటాక్ చేశాయి. మునుగోడు ఉప ఎన్నిక ముగిసిన వెంటనే దాడులు జరగడం పెద్ద చర్చకు దారితీసింది.
తలసాని సోదరులకు కూడా..
మరో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరులు, ఆయన పీఏను ఈడీ విచారణకు పిలిచింది. చికోటి ప్రవీణ్ క్యాసినో కేసుకి సంబంధించి వారికి నోటీసులు జారీ చేసి విచారించింది. క్యాసినో ఆడేందుకు వెళ్లిన సమయంలో మనీలాండరింగ్ జరిగిందన్న ఆరోపణలపై ఈడీ ఆరాతీసింది. అలాగే నగదు డిపాజిట్లకు సంబంధించిన విషయాలపైనా పలు ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తోంది. ఇక టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర్రావు నివాసం, కంపెనీల్లోనూ ఈడీ సోదాలు చేసింది. మధుకాన్ కంపెనీ, రాంచీ ఎక్స్ప్రెస్ వే లిమిటెడ్ డైరెక్టర్ల ఇళ్లతో సహా ఆరు చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేపట్టింది. కొన్ని కీలకమైన పత్రాలు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది. జార్ఖండ్లో మధుకాన్ కంపెనీ చేపట్టిన నేషనల్ హైవే ప్రాజెక్టు కోసం తీసుకున్న బ్యాంకు రుణాలను పక్కదారి పట్టించారన్న ఆరోపణలపై ఈడీ ఈ తనిఖీలు చేపట్టింది. దీనిపై 2019లోనే సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసి, 2020లో చార్జిషీటు దాఖలు చేసింది. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను విదేశాలకు మళ్లించారని అందులో పేర్కొంది.
అంతకుముందు మరో టీఆర్ఎస్ ఎంపీ గాయత్రి రవికి చెందిన ఆఫీసుల్లోనూ ఈడీ తనిఖీలు చేపట్టింది. దాదాపు 11 గంటలకు పైగా సోదాలు జరిగాయి. అంతకుముందు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిలు టార్గెట్గా ఈడీ దాడులు జరగడం.. టీఆర్ఎస్ శ్రేణుల్లో కలవరం మొదలైంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..