Hyderabad: బెట్టింగ్ రాయుళ్లకు అలెర్ట్.. ఆ బ్యాంక్ అకౌంట్లు అన్నీ సీజ్
అసలే ఐపీఎల్ సీజన్. రోజుకో మ్యాచ్. అప్పుడప్పుడూ అంతర్జాతీయ సిరీస్లు. దీంతో బెట్టింగ్ బంగార్రాజులు ఆన్లైన్లో రెచ్చిపోతున్నారు. లేటెస్ట్గా సైబరాబాద్ పోలీసులు.. బిగ్ ఆపరేషన్ చేపట్టి, బిగ్ బెట్టింగ్ టీమ్ని బోల్తా కొట్టించారు. షాకింగ్ అమౌంట్ని సీజ్ చేశారు.
ఐపీఎల్ సీజన్ కావడంతో ఆల్లైన్లో కాయ్..రాజా..కాయ్ అంటూ చెలరేగిపోతున్నారు బెట్టింగ్ బాబులు. కోట్లు వెనకేద్దామనుకున్న ఆశతో బెట్టింగ్లోకి దిగి… ఇప్పుడు జైల్లో ఊసలు లెక్కబెడుతున్నారు. శంషాబాద్, బాలనగర్, మాదాపూర్లో భారీ ఆపరేషన్ చేపట్టిన పోలీసులు… 15 మంది బెట్టింగ్రాయుళ్లకు బేడీలేశారు. వారి నుంచి లక్షో రెండు లక్షలో కాదు… ఏకంగా 2.41 కోట్ల రూపాయల షాకింగ్ ఎమౌంట్ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పెద్ద ఎత్తున ల్యాప్ట్యాప్లు, సెల్ఫోన్లను సీజ్ చేశారు. ఒకొక్కరి బ్యాంక్ అకౌంట్లో 2 కోట్లకు పైగా డబ్బు ఉన్నట్లు చెప్పారు. ఈ బెట్టింగ్ టీమ్లో నరసారావుపేటకు చెందిన రామాంజనేయులు అనే వ్యక్తిని సూత్రధారిగా తేల్చారు. పలు ఆన్లైన్ యాప్స్లో గత నెలరోజుల్లో కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు. అలాగే బెట్టింగ్ డబ్బులు డిపాజిట్ చేసిన 57 బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేయించారు పోలీసులు. ఆయా ఖాతాల్లోని డబ్బును ఫ్రీజ్ చేశారు.
ఇక ఈ బెట్టింగ్ రాయుళ్ల వలలో చిక్కుకుని జేబులు గుల్ల చేసుకుంటున్నారు సామాన్యులు. వీరిలో అత్యధికంగా చిరు వ్యాపారులు, విద్యార్థులు ఉండటం ఆందోళన కలిగించే విషయం. తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చనే అత్యాశతో వారు చితికిపోతున్నారు. బెట్టింగ్ ఊబిలో కూరుకుపోయి బయటకు రాలేక ఉక్కిరిబిక్కిరి అవుతన్నారని పోలీసులు చెబుతున్నారు.అందుకే బెట్టింగ్ కు దూరంగా ఉండాలి. కాలక్షేపానికి మ్యాచ్ లు చూడటం మంచిదే. కానీ బెట్టింగ్ మోజులో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని హెచ్చరిస్తున్నారు పోలీసులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…