AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎంత కష్టమొచ్చిందో! కాడెద్దులుగా మారిన గ్రాడ్యుయేట్లు.. కన్నీరు పెట్టిస్తోన్న అన్నదమ్ముల వీడియో

కరోనా అందరిపైనా పగబట్టింది. సామాన్యుల నుంచి గ్రాడ్యుయేట్ల వరకు ఎవ్వరిని వదిలిపెట్టలేదు. ఉన్న కొలువులు కాస్తా ఊడిపోయాయి. సొంతూరు..

ఎంత కష్టమొచ్చిందో! కాడెద్దులుగా మారిన గ్రాడ్యుయేట్లు.. కన్నీరు పెట్టిస్తోన్న అన్నదమ్ముల వీడియో
Farming
Ravi Kiran
|

Updated on: Jul 06, 2021 | 11:32 AM

Share

కరోనా అందరిపైనా పగబట్టింది. సామాన్యుల నుంచి గ్రాడ్యుయేట్ల వరకు ఎవ్వరిని వదిలిపెట్టలేదు. ఉన్న కొలువులు కాస్తా ఊడిపోయాయి. సొంతూరు చేరుకొని వ్యవసాయం చేద్దామనుకుంటే కాడెడ్లు కరువయ్యాయి. దీంతో ఇద్దరు గ్రాడ్యుయేట్లు కాడెద్దులుగా మారారు. వారి భుజాలపై ఎత్తుకొని అరకదున్నుతూ సేద్యంలో తండ్రికి చేయూతగా నిలుస్తున్నారు. కరోనా కూల్చిన ఆ అభాగ్యుల జీవితాలను మీరే చూడండి.

ఇది, ములుగు జిల్లా మంగపేట మండలం దోమెడ గ్రామం. ఈ ఇద్దరు యువకుల పేర్లు నరేందర్, శ్రీనివాస్. ఇద్దరూ అన్నదమ్ములు. ఒకరు బీఎస్సీ, మరొకరు బీఈడీ పూర్తి చేశారు. ఉన్నత చదువులు చదువుకున్న ఈ అన్నదమ్ములు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఉద్యోగాలు చేసేవారు. కానీ కరోనా దెబ్బతో వీరి ఉద్యోగాలు పోయి జీవితాలు మారిపోయాయి. సొంత ఊరుకు చేరుకుని ఉపాధి హామీ పనులు, కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు.

ప్రస్తుతం వ్యవసాయ సీజన్ ఆరంభం కావడంతో తండ్రితో కలిసి పొలం పనులు చేయడానికి సిద్ధమయ్యారు. కానీ ట్రాక్టర్‌తో భూమిని దున్నించడానికి చేతిలో డబ్బులు లేవు. ఉన్న కాడెద్దులు కొద్ది రోజుల క్రితం చెరువులో పడి మృతి చెందాయి. దీంతో ఆ గ్రాడ్యుయేట్లు పొలం దున్నే నాగలికి రెండు వైపులా కాడెడ్లుగా మారారు.

నాగలి ఎత్తుకొని దుక్కి దున్ని, గొర్రుతో నారుమడిలో వడ్లు చల్లుకుంటున్నారు. ఉద్యోగం లేకపోయినా కడుపు నిండాలంటే నేలతల్లిని నమ్ముకోవాల్సిందే కాబట్టే ఇలా శ్రమిస్తున్నామంటున్నారు. దుక్కుటెద్దులు లేకపోవడంతో తండ్రికి సహాయంగా వ్యవసాయ పనిలో కాడెద్దులుగా మారి అరకతో పొలం దున్నుకున్నారు. కరోనాకు ముందు ఈ విద్యావంతులను చూసి గర్వంగా భావించిన ఈ మారుమూల గ్రామ ప్రజలంతా ఇప్పుడు అయ్యోపాపం అంటున్నారు.

Also Read: ఏపీ కర్ఫ్యూ సడలింపుల్లో మార్పులు.. ఆ రెండు జిల్లాల్లో మాత్రం.? ఎప్పటినుంచంటే.!