గ్లోబల్ సిటీ వైపు గ్రేటర్ అడుగులు.. పేదలకు అన్యాయం జరగనివ్వం.. మూసీ కాలుష్యాన్ని వదిలిపెట్టం: సీఎం రేవంత్
మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిపాలనను మరింత సులభతరం చేసేందుకు ఉప్పల్ భగాయత్ ఫేజ్-3 లోని 10 ఎకరాల విస్తీర్ణంలో రూ.98 కోట్లతో నిర్మించనున్న నూతన మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ భవనానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. వీటితో పాటు రూ.960 కోట్లతో ఏఓసీ (AOC) సెంటర్లో ప్రత్యామ్నాయ రహదారుల నిర్మాణం, రూ.416 కోట్లతో టీకేఆర్ కాలేజ్ జంక్షన్లో 6 వరుసల ఫ్లైఓవర్ నిర్మాణం, రూ.37.50 కోట్లతో 100 పడకల మల్కాజిగిరి జిల్లా ఆసుపత్రి భవన నిర్మాణ పనులకు ఆయన శ్రీకారం చుట్టారు.

హైదరాబాద్ మహానగరాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలో రూ.1,511 కోట్ల విలువైన భారీ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఉప్పల్ భగాయత్ లేఅవుట్లో జరిగిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ సహా ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్రజల సౌకర్యార్థం కామన్ యూనిఫైడ్ బిల్లింగ్ అండ్ కలెక్షన్ సిస్టమ్ (CURE 1- Initiative) ‘క్యూర్-1’ యాప్ను కూడా సీఎం ఈ సందర్భంగా ప్రారంభించారు.
మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిపాలనను మరింత సులభతరం చేసేందుకు ఉప్పల్ భగాయత్ ఫేజ్-3 లోని 10 ఎకరాల విస్తీర్ణంలో రూ.98 కోట్లతో నిర్మించనున్న నూతన మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ భవనానికి సీఎం శంకుస్థాపన చేశారు. వీటితో పాటు రూ.960 కోట్లతో ఏఓసీ (AOC) సెంటర్లో ప్రత్యామ్నాయ రహదారుల నిర్మాణం, రూ.416 కోట్లతో టీకేఆర్ కాలేజ్ జంక్షన్లో 6 వరుసల ఫ్లైఓవర్ నిర్మాణం, రూ.37.50 కోట్లతో 100 పడకల మల్కాజిగిరి జిల్లా ఆసుపత్రి భవన నిర్మాణ పనులకు ఆయన శ్రీకారం చుట్టారు.
నాగోల్ నుంచి గౌరెల్లి వరకు మూసీ నది ప్రక్షాళన ఫేజ్-2 పనులను రాబోయే వంద రోజుల్లోనే ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దేశంలోని సబర్మతి, యమునా, గంగా నదుల తరహాలోనే మూసీని కూడా ప్రక్షాళన చేసి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలు పడుతున్న కాలుష్య బాధలను, నల్గొండ జిల్లాపై పడుతున్న దుష్ప్రభావాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ క్రమంలో ఏ పేదవాడికీ అన్యాయం జరగనివ్వమని, ఇళ్లు కోల్పోయే బాధితులకు ప్రత్యామ్నాయ గృహ వసతితో పాటు వారి పిల్లలకు మంచి చదువులు చెప్పించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు.
ఔటర్ రింగ్ రోడ్ (ORR) లోపల ఉన్న 2100 చదరపు కిలోమీటర్ల పరిధిని ‘క్యూర్’ (కోర్ అర్బన్ రీజినల్ ఎకానమీ) ప్రాంతంగా గుర్తించి, పరిపాలనా సౌలభ్యం కోసం హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి అనే మూడు కార్పొరేషన్లుగా వికేంద్రీకరించినట్లు సీఎం తెలిపారు. నగర రవాణాను మెరుగుపరిచేందుకు 122 కిలోమీటర్ల మేర మెట్రో రైలును విస్తరించనున్నట్లు చెప్పారు. ముఖ్యంగా నాగోల్ నుంచి ఎల్బీనగర్, ఓవైసీ హాస్పిటల్ మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు, అలాగే ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ వరకు మెట్రోను విస్తరిస్తామన్నారు. ఈ అభివృద్ధి పనులకు కేంద్ర మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు రాజకీయాలకు అతీతంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
గతంలో తాను మల్కాజిగిరి ఎంపీగా ఉన్నప్పుడు ఆశించిన స్థాయిలో పనులు చేయలేకపోయానని గుర్తుచేసుకున్న సీఎం, ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఈ ప్రాంత అభివృద్ధికి ఎన్ని నిధులైనా ఇచ్చే బాధ్యతను తానే స్వయంగా తీసుకుంటానని ప్రకటించారు. అలాగే, ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్కు బండారి రాజిరెడ్డి పేరు పెడతామని, చౌరస్తాలో వారి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని సీఎం రేవంత్ రెడ్డి సభలో హామీ ఇచ్చారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
