AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆరోగ్యానికి వరం నేరేడు.. ఆయుర్వేదం చెప్పిన అద్భుత గుణాలు తెలుసుకోండి

వర్షాకాలంలో లభించే నేరేడు చెట్టు పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పండ్లే కాదు ఈ చెట్టు విత్తనాలు, ఆకులు, బెరడు, వేర్ల వరకు ప్రతి భాగం ఔషధ గుణాలతో నిండి ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం నేరేడు పండు శరీరానికి చల్లదనాన్ని అందించడమే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది..

ఆరోగ్యానికి వరం నేరేడు.. ఆయుర్వేదం చెప్పిన అద్భుత గుణాలు తెలుసుకోండి
Jamun
Srilakshmi C
|

Updated on: Jun 07, 2026 | 9:11 PM

Share

మధుమేహం నియంత్రణలో నేరేడు పండు, దాని విత్తనాలకు ప్రత్యేక స్థానం ఉంది. ఎండబెట్టిన నేరేడు గింజల పొడిని పరిమిత మోతాదులో తీసుకోవడం రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. నేరేడు పండులో సమృద్ధిగా ఉండే ఇనుము, విటమిన్ సి వంటి పోషకాలు రక్తహీనతను తగ్గించడంలో దోహదపడతాయి. రక్తాన్ని శుద్ధి చేయడంతో పాటు శరీరానికి అవసరమైన రక్త ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. అజీర్ణం, కడుపు ఉబ్బరం, విరేచనాలు వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగించడంలో కూడా ఈ పండు ఉపయోగకరంగా ఉంటుంది. భోజనం అనంతరం కొద్దిపాటి నేరేడు పండ్లు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

నేరేడు గింజలు, బెరడు కూడా ఆరోగ్య ప్రయోజనాల పరంగా ఎంతో విలువైనవి. గింజలతో తయారు చేసిన కషాయం మూత్రనాళాల ఇన్ఫెక్షన్లు, మూత్రపిండాల సమస్యలు, మూత్ర సంబంధిత వ్యాధుల నివారణలో సహాయపడుతుందని భావిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో నేరేడు చెట్టు బెరడును దంతాల శుభ్రత కోసం ఉపయోగించే సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. ఇది చిగుళ్లను బలపరచడంలో, రక్తస్రావాన్ని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. నేరేడు ఆకులు కూడా ప్రత్యేక ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. తాజా ఆకులను నమలడం వల్ల నోటి దుర్వాసన తగ్గి చిగుళ్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. చిన్న గాయాలపై ఆకుల రసాన్ని లేదా పేస్ట్‌ను రాయడం వల్ల అవి త్వరగా మానడానికి సహాయపడుతుందని గ్రామీణ వైద్య పద్ధతులు చెబుతున్నాయి.

అయితే నేరేడు పండ్లను మితంగా మాత్రమే తీసుకోవాలి. ఇప్పటికే మధుమేహ మందులు వాడుతున్నవారు నేరేడు గింజల పొడిని అధికంగా తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు ప్రమాదకరంగా తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే ఖాళీ కడుపుతో తినడం వల్ల ఎసిడిటీ, కడుపు నొప్పి, వికారం వంటి సమస్యలు తలెత్తవచ్చు. పండు తిన్న వెంటనే పాలు లేదా పెరుగు తీసుకోవడం కూడా మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. నేరేడు పండ్లను కొద్దిగా ఉప్పుతో తినే సంప్రదాయం భారతదేశంలో చాలా కాలంగా ఉంది. ఇలా తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందని చెబుతారు. అయితే అధిక రక్తపోటు లేదా మధుమేహం ఉన్నవారు ఉప్పు లేకుండా తీసుకోవడం మంచిది.

ఇవి కూడా చదవండి

ప్రాచీన భారతీయ సంస్కృతిలో కూడా నేరేడు పండుకు విశిష్ట స్థానం ఉంది. పురాణాల ప్రకారం నేరేడు చెట్లు విస్తారంగా ఉండటం వల్లే భారతదేశాన్ని ఒకప్పుడు ‘జంబుద్వీపం’ అని పిలిచేవారని చెబుతారు. అందువల్ల నేరేడు పండు కేవలం ఆరోగ్యానికి మేలు చేసే ఆహారం మాత్రమే కాదు, మన సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక కూడా. ప్రకృతి అందించిన ఈ అమూల్యమైన పండును మితంగా ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

Follow Us