AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhadrachalam: భద్రాచలం పట్టణానికి రైలు మార్గం.. కొత్త లైన్ పై కేంద్రం ప్రత్యేక దృష్టి

ప్రముఖ పుణ్యక్షేత్రం, దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలానికి(Bhadrachalam) రైలు సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా కొత్త రైల్వే లైన్‌ నిర్మాణం కానుంది. ఒడిశాలోని మల్కన్‌గిరి నుంచి తెలంగాణలోని భద్రాచలం వరకు ఇది...

Bhadrachalam: భద్రాచలం పట్టణానికి రైలు మార్గం.. కొత్త లైన్ పై కేంద్రం ప్రత్యేక దృష్టి
Bhadrachalam
Ganesh Mudavath
|

Updated on: Apr 24, 2022 | 6:35 PM

Share

ప్రముఖ పుణ్యక్షేత్రం, దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలానికి(Bhadrachalam) రైలు సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా కొత్త రైల్వే లైన్‌ నిర్మాణం కానుంది. ఒడిశాలోని మల్కన్‌గిరి నుంచి తెలంగాణలోని భద్రాచలం వరకు ఇది ఏర్పాటు కానుంది. గిరిజన ప్రాంతాలకు రవాణా వసతిని మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టుపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రత్యేక దృష్టి సారించారు. ఒడిశాలోని మల్కన్‌గిరి(Malkan Giri) నుంచి తెలంగాణలోని భద్రాచలం వరకు మొత్తం 173 కిలోమీటర్లు దూరం ఉండే ఈ లైన్‌ నిర్మాణానికి రూ.2,800 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు. నదులు, వాగులు, వంకలు ఉన్నందున ఈ మార్గంలో ఏకంగా 213 వంతెనలు నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించారు. వీటిల్లో 48 భారీ వంతెనలు ఉన్నాయి. గోదావరి(Godavari) నదిపై భారీ వంతెన కూడా ఇందులో భాగంగా నిర్మించనున్నారు. ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టుకు గతేడాది సెప్టెంబర్‌లో రైల్వే బోర్డు పచ్చజెండా ఊపింది. ఇటీవలి బడ్జెట్‌లో ఫైనల్‌ లొకేషన్‌ సర్వే కోసం రూ.3 కోట్లు ప్రతిపాదించారు. ఈ మేరకు మొదలైన సర్వే జూన్‌ నాటికి పూర్తి కానుంది. సర్వే నివేదికను పరిశీలించి రైల్వే బోర్డు అనుమతి ఇవ్వగానే పనులు ప్రారంభించనున్నారు.

ఒడిశాలోని జేపూర్‌ నుంచి మల్కన్‌గిరికి గతంలో రైల్వే లైన్‌ మంజూరు కాగా, ప్రస్తుతం ఆ పనులు సాగుతున్నాయి. దాన్ని మరింత విస్తరించే క్రమంలో, ఈ కొత్త మార్గానికి ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే ప్రతిపాదనలు రూపొందించింది. కొత్త లైన్‌ ఒడిశాలోని మల్కన్‌గిరి, బదలి, కోవాసిగూడ, రాజన్‌గూడ, మహారాజ్‌పల్లి, లూనిమన్‌గూడల మీదుగా తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. కన్నాపురం, కుట్టుగుట్ట, పల్లు, నందిగామ, భద్రాచలం వరకు సాగుతుంది. ఇప్పటికే ఉన్న భద్రాచలం – పాండురంగాపురం లైన్‌తో దీనిని అనుసంధానించనున్నారు.

ఆదాయాన్ని పెంచుకునే క్రమంలో రైల్వేశాఖ కొంతకాలంగా సరుకు రవాణాకు ప్రాధాన్యం ఇస్తోంది. గిరిజన ప్రాంతంలో రూపురేఖల మార్పునకు అవకాశం కలిగిన భద్రాచలం రైల్వే లైనును కూడా సరుకుల రవాణాకే వినియోగిస్తారా? అంటే ప్రస్తుతానికి ఆ ఆలోచన లేదని, ప్రయాణికుల రైళ్ల కోసమే దీనిని నిర్మిస్తున్నట్లు రైల్వే వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో సింగరేణి సంస్థతోతో కలిసి సంయుక్తంగా భద్రాచలం–సత్తుపల్లి లైన్‌ను నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Also read:

PBKS vs CSK IPL 2022: పంజాబ్‌ ముందు చెన్నై రికార్డ్‌ ఎలా ఉందంటే..!

Follow Us