Bandi Sanjay: బీజేపీ అధ్యకుడిగా బండి సంజయ్‌కి రెండేళ్లు.. క‌లిసొచ్చిన అంశాలేమిటి..? ముందున్న స‌వాళ్లేంటి..?

Bandi Sanjay: తెలంగాణ (Telangana) క‌మ‌ళ‌ద‌ళ‌ప‌తిగా ప‌గ్గాలు చేప‌ట్టిన బండి సంజ‌య్... రెండేళ్ల ప‌ద‌వీకాలాన్ని పూర్తి చేసుకున్నారు. అధ్య‌క్షుడిగా మ‌రో ఏడాది కాలం మిగిలి ఉంది. గ‌డిచిన..

Bandi Sanjay: బీజేపీ అధ్యకుడిగా బండి సంజయ్‌కి రెండేళ్లు.. క‌లిసొచ్చిన అంశాలేమిటి..? ముందున్న స‌వాళ్లేంటి..?
Follow us

| Edited By: Subhash Goud

Updated on: Mar 11, 2022 | 2:59 PM

Bandi Sanjay: తెలంగాణ (Telangana) క‌మ‌ళ‌ద‌ళ‌ప‌తిగా ప‌గ్గాలు చేప‌ట్టిన బండి సంజ‌య్… రెండేళ్ల ప‌ద‌వీకాలాన్ని పూర్తి చేసుకున్నారు. అధ్య‌క్షుడిగా మ‌రో ఏడాది కాలం మిగిలి ఉంది. గ‌డిచిన రెండేళ్ల‌లో బీజేపీ (BJP) ర‌థ‌సార‌ధిగా సాధించిందేంటీ ? ఇప్ప‌టి వ‌ర‌కు అత‌నికి క‌లిసొచ్చిన అంశాలేంటీ? ముందున్న స‌వాళ్లేంటీ ? ముంద‌స్తు ఎన్నిక‌ల ప్ర‌చారం నేప‌థ్యంలో కాషాయ‌ద‌ళం వ్యూహ‌మేంటీ ? రాష్ట్ర రాజ‌కీయాల్లో త‌క్కువ స‌మ‌యంలోనే ఎదిగిన నేత బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌ (Bandi Sanjay). గ‌త పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో క‌రీంన‌గ‌ర్ ఎంపీగా గెలవ‌డం.. వెంట‌నే రాష్ట్ర సార‌థిగా ప‌గ్గాలు చేప‌ట్ట‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. దుబ్బాక ఉప ఎన్నిక‌లు, గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ ఎన్నిక‌లు, హుజురాబాద్ ఉప ఎన్నిక‌లు బండి సంజ‌య్‌కు మంచి మైలేజీ తెచ్చిపెట్టాయి. నాగార్జున‌సాగ‌ర్ ఉప ఎన్నిక‌లో కొత్త ప్ర‌యోగానికి వెళ్లి బొల్తాకొట్టారు. గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో స‌రైన వ్యూహం లేక‌పోవ‌డంతో దెబ్బ‌తిన్నారు. పార్టీ అంత‌ర్గ‌తంగా ఉన్న సమ‌స్య‌ల‌ను, స‌వాళ్ల‌ను ఎదుర్కొంటూనే మ‌రోవైపు ప్ర‌త్య‌ర్థి పార్టీల‌ను ఢీకొట్టారు. సంజ‌య్ పేల్చిన‌ డైలాగ్‌లు కొన్నిసార్లు సొంత‌పార్టీ నేత‌లను క‌ల‌వ‌ర‌పెట్టిన సంద‌ర్భాలున్నాయి.

సంజ‌య్ మాట‌ల తూటాలు రాజ‌కీయాల్లో ప్ర‌కంప‌న‌లు..

సంజ‌య్‌ పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టే నాటికి బీజేపీ అధికారంలోకి వ‌స్తుంద‌న్న అంశాన్ని ప‌క్క‌న పెడితే ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా లేని ప‌రిస్థితి. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో నాలుగు స్థానాలు సాధించినా… ఆ త‌రువాత జ‌రిగిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో పార్టీ ఎలాంటి ప్రభావం చూప‌లేక పోయింది. ఆ త‌ర్వాత బండి సంజ‌య్‌కు పార్టీ అధిష్టానం ప‌గ్గాలు అప్ప‌గించింది. అధ‌క్ష బాధ్య‌త‌లు చేప‌ట్టే నాటికి బీజేపీకి ఆశించిన స్థాయిలో అనుకూల ప‌రిస్థితులు లేవు. ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించిన ప‌దిరోజుల‌కే క‌రోనా ఫ‌స్ట్ వేవ్ తో రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రారంభం అయ్యింది. గ‌డిచిన రెండేళ్ల‌లో దాదాపు ఏడాది కాలం పాటు లాక్ డౌన్ లేదా క‌రోనా ఆంక్ష‌లతోనే సగం రోజులు గ‌డిచి పోయాయి. ఉన్న కాస్తో కూస్తో కాలాన్ని పార్టీ పటిష్ట‌త‌త‌కు వాడుకున్నాడు బండి సంజ‌య్. క‌రోనా మొద‌టి వేవ్ కాస్తా త‌గ్గ‌గానే ఉద్య‌మ‌ కార్యాచ‌ర‌ణ‌కు ప‌దును పెట్టారు. సెప్టెంబ‌ర్ 17ను అధికారికంగా నిర్వ‌హించాలంటూ అసెంబ్లీ ముట్ట‌డి చేసి రాష్ట్ర ప్ర‌జల దృష్టిని ఆక‌ర్శించాడు బండి సంజయ్. ఆ త‌రువాత అనుకోకుండా వ‌చ్చిన దుబ్బాక ఉప ఎన్నిక ఆయ‌న నాయ‌క‌త్వ ప‌టిష్ట‌త‌కు మ‌రింత ఉప‌యోగ ప‌డింది. జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఆయ‌న పేల్చిన మాట తూటాలు ఇప్పటికి రాజ‌కీయ వేడిని రాజేస్తూనే ఉన్నాయి. ఓల్డ్ సిటీపై స‌ర్జిక‌ల్ స్ట్రైక్‌ చేస్తాం అంటూ చేసిన కామెంట్స్ సొంత‌పార్టీలోనే కాక‌రేపింది. జీహెచ్ఎంసీలో ఊహించిన స్థాయిలో గెలుపు త‌రువాత అదే ఊపుతో ఎమ్మెల్సీ ఎన్నిక‌లకు వెళ్ళిన‌ప్ప‌టికీ రెండు ఎమ్మెల్సీ స్థానాల‌ను కోల్పోయారు. ఆ త‌రువాత నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక‌ల్లోనూ కొత్త ప్ర‌యోగాల‌కు వెళ్ళి బోల్తాప‌డ్డారు. ఆ త‌రువాత జ‌రిగిన హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లు బీజేపీ దశాదిశ‌ను మార్చేసాయి.

ఈటెల‌ను పార్టీలోకి తీసుకురావ‌డంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన బండి

టీఆర్ఎస్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చిన ఈటెల రాజేంద‌ర్‌ను పార్టీలోకి తీసుకు రావ‌డంలో కూడా బండి సంజ‌య్ కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. హుజూరాబాద్ లో ఈట‌ల గెలుపు బీజేపీకి మంచి బూస్టింగ్ ఇచ్చింది. కేవలం న‌గ‌రాలకే ప‌రిమిత‌మైన పార్టీగా పేరున్న బీజేపీని గ్రామీణ స్థాయి వ‌ర‌కు తీసుకువెళ్లే ల‌క్ష్యంతో ప్రారంభించిన ప్ర‌జా సంగ్రామ యాత్ర‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది. చార్మినార్ భాగ్య‌ల‌క్ష్మి ఆల‌యం నుండి అట్ట‌హాసంగా ప్రాంర‌భ‌మైన ప్రజాసంగ్రామ యాత్ర మొద‌టి విడ‌త 36 రోజుల పాటు సాగింది. హుజూరాబాద్ ఉప ఎన్నిక నిబంధ‌న‌ల‌ కార‌ణంగా హుస్నాబాద్ లో మొద‌టివిడ‌త పాద‌యాత్ర‌ను ముగించారు. కార్య‌క‌ర్త‌ల‌ను ఉత్సాహ ప‌రుస్తూనే మ‌రోవైపు రాష్ట్ర ప్ర‌భుత్వ వైఫ్యల్యాల‌ను ఎండ‌గ‌ట్టేందుకు మోర్చాలతో ఉద్య‌మ కార్యాచ‌ర‌ణ అమ‌లు చేశారు బండి సంజ‌య్. నిరుద్యోగుల స‌మ‌స్య‌ల‌పై దృష్టి సారించారు. ఉద్యోగాల‌ను భ‌ర్తిచేయాలంటూ భారీ ఉద్య‌మానికి కార్యాచ‌ర‌ణ సిద్దం చేసారు. 317 జీవో స‌వ‌రించాలంటూ బండి సంజ‌య్ చేప‌ట్టిన దీక్షఅడ్డుకోవ‌డం, అరెస్ట్ చేయ‌డంతో పెద్ద‌దుమారం రేగింది. బండి సంజ‌య్ అరెస్ట్ నేప‌థ్యంలో జాతీయ నేత‌లంతా తెలంగాణ‌కు క్యూక‌ట్టారు. ఏకంగా బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు న‌డ్డాతో స‌హ ఇద్ద‌రు సీఎంలు శివ‌రాజ్ సింగ్ చౌహాన్, హిమంత్ బిష్ శ‌ర్మ‌ల‌తో పాటు ఇద్ద‌రు మాజీ సీఎంలు ర‌మ‌ణ్ సింగ్ , ఫ‌డ్న‌వీస్ లు తెలంగాణ‌లో ప‌ర్య‌టించారు. సంజ‌య్ అరెస్ట్‌పై తీవ్రంగా స్పందించారు. జాతీయ నాయ‌క‌త్వం అండ‌దండ‌లు పుష్క‌లంగా ఉండ‌టంతో సంజ‌య్ దూకుడు మ‌రింత పెంచారు. పార్టీలో అంత‌ర్గ‌త స‌మ‌స్య‌ల‌ను, అస‌మ్మ‌తిని దాటుకొని వెళ్లారు.

ముంద‌స్తు ఎన్నిక‌ల ప్ర‌చారంపై స్పీడ్ పెంచిన బండి

ముంద‌స్తు ఎన్నిక‌ల ప్ర‌చారం ఊపందుకున్న నేప‌థ్యంలో బండి స్పీడ్ పెంచారు. రెండో విడ‌త పాద‌యాత్ర‌కు సిద్ద‌మ‌వుతున్నారు. గ‌తంలో చేసిన పొర‌పాట్ల‌ను దిద్దుకోని ముందుకు వెళ్ల‌డానికి స‌న్న‌ద్ద‌మ‌య్యారు. రాష్ట్ర అధ్య‌క్షుడిగా రెండేళ్ల కాలం ఒక ఎత్త‌యితే.. వ‌చ్చేది ఎన్నిక‌ల సంవ‌త్స‌రం బండి సంజ‌య్ రాజ‌కీయ ఎదుగుద‌ల‌కు మ‌రింత కీల‌క‌మైన‌ద‌ని చెప్ప‌వ‌చ్చు. పార్టీని ఇక నుండి నడపడం కత్తి మీద సాములాంటిది. అయితే బండి ఢిల్లీలో వచ్చిన గ్రిప్ చూసుకొని రెచ్చిపోతున్నారు అని అనే వాళ్లు ఉన్నారు. అయిన మీద సీనియర్లు కొంత మంది గుర్రుగా కూడా ఉన్నారు. కొంత మంది అసమత్తి నేతలతో చర్చలు జరిపిన ఇంకా అది పూర్తి స్థాయిలో సద్దుమ‌న‌గ‌లేదు. ఇలా సొంత పార్టీ లో కొంత ఇబ్బందులు ఉన్నాయని చెప్పుకోవాలి. ఇక బండి తరువాత ఏ గేర్ లో వెళ్తుందని చూడాలి.

ఇవి కూడా చదవండి:

Congress Party: గట్టెక్కే దారేది దేవుడా.. కనుమరుగవుతోన్న కాంగ్రెస్‌.. నాయకత్వ లేమితో ప్రాభవం కోల్పోతోన్న జాతీయ పార్టీ..

Rajasthan Minister: మా రాష్ట్రంలో పురుషులు ఎక్కువ.. అందుకే అత్యాచారాలు అధికం.. మంత్రి షాకింగ్ కామెంట్స్