Hardik Pandya: మూడో టీ20 కోసం పెద్ద ప్లానే వేసిన హార్దిక్.. అసలు విషయం చెప్పేసిన టీమిండియా కెప్టెన్..
కివీస్తో జరుగుతున్న టీ20 సిరీస్ 1-1 సమంగా ఉన్న తరుణంలో.. బుధవారం కీలకమైన మూడో టీ20 మ్యాచ్లో 168 పరుగుల తేడాతో విజయాన్ని..

కొత్త ఏడాదిలో టీమిండియా వరుస సిరీస్ విజయాలతో దూసుకెళుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఏడాది ప్రారంభంలోనే ముందుగా శ్రీలంకపై వన్డే, టీ20 సిరీస్లు గెలిచిన భారత్.. న్యూజిలాండ్పై కూడా వన్డే, టీ20 సిరీస్లను తన కైవసం చేసుకుంది. కివీస్తో జరుగుతున్న టీ20 సిరీస్ 1-1 సమంగా ఉన్న తరుణంలో.. బుధవారం కీలకమైన మూడో టీ20 మ్యాచ్లో 168 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది భారత్. ఫలితంగా న్యూజిలాండ్పై మూడు టీ20ల సిరీస్ను కూడా తన ఖాతాలో వేసుకుంది. ఇక ఈ మ్యాచ్లో భారత్ తరఫున శుభ్మన్ గిల్ (126), హార్దిక్ పాండ్యా (4/16) రాణించడంతో మూడో టీ20 మ్యాచ్లో టీమిండియా సునాయాస విజయం అందుకుంది.
అయితే మ్యాచ్ అనంతరం టీమిండియా టీ20 తాత్కలిక కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ..‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలుచుకోవడం గురించి నేను ఆలోచించలేదు. అయితే పెద్ద స్టేడియంలో విజయం సాధించడం ఆనందంగా ఉంది. మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డుతో పాటు ట్రోఫీని సొంతం చేసుకోవడంలో సహాయక సిబ్బంది(బెంచ్ ప్లేయర్లు) పాత్ర ఎంతో ఉంది. మైదానం వెలుపల వారి సహకారం ఎనలేనిది. ఇలాంటి మ్యాచ్ ఆడటం నాకెంతో ఇష్టం. అభిమానులకు ధన్యవాదాలు. మైదానం చాలా బాగుంద’ని అన్నాడు. ఇంకా మాట్లాడుతూ ‘నేను ముందస్తు ఆలోచనలు చేయను. విజయానికి ఏమి అవసరమో వాటిని మాత్రం అర్థం చేసుకుంటా. ఒక కెప్టెన్గా నా టీమ్ ఆటగాళ్లకు మద్దతుగా ఉండాలని ప్రయత్నిస్తా. దూకుడుగా ఉండేందుకు చూస్తాను. సవాళ్లను స్వీకరించడం గురించి ఎప్పుడూ మాట్లాడుకుంటాం. ఇక ఇదే మైదనంలో ఐపీఎల్ ఫైనల్ ఆడాను. అప్పుడు రెండో ఇన్నింగ్స్ సమయంలో కఠిన సవాల్ ఎదురైంది. ఈ నేపథ్యంలోనే ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా చాలా సింపుల్గా ఆడాలని భావించాం. అందుకే తొలుత బ్యాటింగ్ చేశాం. మా వాళ్లు అద్భుతంగా ఆడారు. భవిష్యత్తులో ఇదే ప్రదర్శనను కొనసాగిస్తామ’ని హార్దిక్ పాండ్యా తెలిపాడు.
కాగా ఆహ్మదాబాద్ వేదికగా బుధవారం జరిగిన మూడో టీ20 విజయంతో భారత్.. టీ20లలో అతిపెద్ద విజయం సాధించింది. ఇంతకుముందు అతిపెద్ద విజయం కూడా భారత్ పేరిటే ఉంది. 2018లో 143 పరుగుల తేడాతో ఐర్లాండ్పై విజయం సాధించిన భారత్ తాజాగా న్యూజిలాండ్పై 168 తేడాతో విజయం నమోదు చేసింది. మరోవైపు న్యూజిలాండ్కు ఇది మూడో అత్యల్ప స్కోరు ఇది. గతంలో శ్రీలంక, బంగ్లాదేశ్ మీద 60 పరుగులే ఆలౌటయింది కివీస్ జట్టు. ఇక అంతర్జాతీయ టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాటర్గా గిల్ (126 నాటౌట్) రికార్డు సాధించడంతో పాటు.. కోహ్లీ (122 నాటౌట్)ని వెనక్కు నెట్టాడు.




మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..




