Vaishnavi Sharma: 7 మ్యాచుల్లో 17 వికెట్లు.. టీ20 ప్రపంచకప్‌లో సత్తా చాటిన ఈ చంబల్ అమ్మాయి గురించి తెలుసా?

అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా నిలిచింది. భారత జట్టు ఈ టైటిల్‌ను మళ్లీ గెలవడంలో చంబల్ అమ్మాయి వైష్ణవి శర్మ కీలక పాత్ర పోషించింది. మొత్తం టోర్నీలో అత్యధికంగా 17 వికెట్లు పడగొట్టి రికార్డు సృష్టించింది.

Vaishnavi Sharma: 7 మ్యాచుల్లో 17 వికెట్లు.. టీ20 ప్రపంచకప్‌లో సత్తా చాటిన ఈ చంబల్ అమ్మాయి గురించి తెలుసా?
Vaishnavi Sharma
Follow us
Basha Shek

|

Updated on: Feb 03, 2025 | 1:03 PM

అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ 2025 టైటిల్‌ను భారత్ గెలుచుకుంది. ఈ టోర్నీలో టీమిండియా వరుసగా రెండోసారి చాంపియన్‌గా నిలిచింది. భారత జట్టు మళ్లీ ప్రపంచ ఛాంపియన్‌గా నిలవడంలో చంబల్‌కు చెందిన అమ్మాయి కీలక పాత్ర పోషించింది. ఈ అమ్మాయి పేరు వైష్ణవి శర్మ. ఫైనల్ మ్యాచ్‌లో ఆమె 4 ఓవర్లలో కేవలం 23 పరుగులిచ్చి 2 కీలక వికెట్లు పడగొటింది. ఓవరాల్ గా ఈ టోర్నీలో వైష్ణవి 7 మ్యాచ్‌లలో 17 వికెట్లు పడగొట్టింది. తద్వారా టీమండియాను వరల్డ్ ఛాంపియన్ గా నిలిపింది. అంతేకాదు వ్యక్తిగతంగానూ పలు రికార్డులు బద్దలు కొట్టింది. అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఒకే ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు తీసిన క్రీడాకారిణిగా వైష్ణవి రికార్డు సృష్టించింది. గతంలో ఈ రికార్డు ఆస్ట్రేలియాకు చెందిన మ్యాగీ క్లార్క్ పేరిట ఉండేది. అయితే వైష్ణవి 17వికెట్లతో ఈ రికార్డును బద్దలు కొట్టింది. ఇలా అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్‌లో తన బౌలింగ్‌తో సంచలనం సృష్టించిన 19 ఏళ్ల వైష్ణవి శర్మ మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లోని చంబల్ ప్రాంతంలో నివాసం ఉంటోంది. తొలిసారిగా ఈ ప్రాంతానికి చెందిన ఓ మహిళా ప్రపంచకప్ లాంటి ఈవెంట్‌లో భారత క్రికెట్ జట్టులో భాగమైంది. అయితే వైష్ణవి ఇక్కడి దాకా చేరుకోవడానికి చాలా కష్టపడింది.

వైష్ణవి విజయంలో ఆమె తల్లిదండ్రుల పాత్ర చాలా ఉంది. ఆమె తండ్రి నరేంద్ర శర్మ వృత్తిరీత్యా జ్యోతిష్కుడు. తండ్రి సహాయంతోే వైష్ణవి 5 సంవత్సరాల వయస్సు నుండి క్రికెట్ శిక్షణ తీసుకోవడం ప్రారంభించింది. దాదాపు 14 ఏళ్ల తర్వాత ఇప్పుడు తన కష్టానికి తగిన ఫలం దక్కింది. ప్రపంచకప్ లాంటి ట్రోఫీని గెల్చుకోవడంలో కీలక పాత్ర పోషించింది. అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్‌లో వైష్ణవి శర్మ రికార్డుతో అడుగుపెట్టింది. మలేషియాతో జరిగిన మొదటి మ్యాచ్‌లోనే హ్యాట్రిక్ సాధించి చరిత్ర సృష్టించింది. ఈ టోర్నీలో ఈ ఘనత సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా నిలిచింది. ఈ మ్యాచ్ లో వైష్ణవి 4 ఓవర్లలో కేవలం 5 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టింది.

ఇవి కూడా చదవండి

వైష్ణవి 2017లో మధ్యప్రదేశ్ అండర్-16 జట్టుతో దేశవాళీ క్రికెట్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత మధ్యప్రదేశ్ సీనియర్ జట్టులో కూడా ఆమెకు అవకాశం వచ్చింది. 2022లో దేశీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా వైష్ణవి నిలిచింది. ఆమె ప్రదర్శనను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ దాల్మియా అవార్డుతో సత్కరించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..