India vs New Zealand Final : అహ్మదాబాద్ లో క్రైమ్ బ్రాంచ్ యాక్షన్.. బ్లాక్ లో టీ20 వరల్డ్ కప్ ఫైనల్ టికెట్ల దందా బట్టబయలు
India vs New Zealand Final : టీ20 వరల్డ్ కప్ ఫైనల్ టికెట్లను బ్లాక్ లో అమ్ముతున్న ఇద్దరిని అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ నేపథ్యంలో టికెట్లకు భారీ డిమాండ్ నెలకొంది. ఈ క్రమంలో టికెట్ల కోసం అభిమానుల మధ్య విపరీతమైన పోటీ నెలకొంది.

India vs New Zealand Final : టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్ సమరానికి సమయం ఆసన్నమైంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనున్న ఈ మహా సంగ్రామం కోసం యావత్ దేశం కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో టికెట్ల కోసం అభిమానుల మధ్య విపరీతమైన పోటీ నెలకొంది. అధికారికంగా టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోవడంతో, క్రికెట్ ప్రేమికుల వీక్నెస్ను ఆసరాగా చేసుకుని బ్లాక్ మార్కెట్ దందాను నడిపిస్తున్న కేటుగాళ్లపై అహ్మదాబాద్ సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఉక్కుపాదం మోపారు.
క్రైమ్ బ్రాంచ్ మెరుపు దాడి
రహస్య సమాచారం అందుకున్న అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు, ఉస్మాన్పురా ఏరియాలోని గుజరాత్ విద్యాపీఠ్ బస్ స్టాండ్ సమీపంలో నిఘా పెట్టారు. అక్కడ అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా, వారి వద్ద ఎనిమిది ఫైనల్ మ్యాచ్ టికెట్లు లభ్యమయ్యాయి. ఆన్లైన్లో ముందే బుక్ చేసుకున్న ఈ టికెట్లను వారు అసలు ధర కంటే మూడు రెట్లు ఎక్కువ ధరకు, అంటే ఒక్కో టికెట్ను రూ.10,000కు విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి, టికెట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు వారిపై కఠిన చర్యలు చేపట్టారు.
నయా చరిత్రకు నాంది
మరోవైపు ఈ రోజు రాత్రి 7 గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్పై భారీ అంచనాలు ఉన్నాయి. టీమిండియా ఈ మ్యాచ్ గెలిస్తే, మూడవసారి టీ20 ప్రపంచకప్ను ముద్దాడటమే కాకుండా.. వరుసగా రెండుసార్లు టైటిల్ను నిలబెట్టుకున్న తొలి జట్టుగా చరిత్ర సృష్టిస్తుంది. అటు న్యూజిలాండ్ జట్టు కూడా ఇప్పటివరకు ఒక్కసారి కూడా టీ20 వరల్డ్ కప్ గెలవలేదు. ఈసారి ఎలాగైనా తొలి ట్రోఫీని సాధించి తమ చిరకాల వాంఛను నెరవేర్చుకోవాలని కివీస్ పట్టుదలతో ఉంది. ఏ జట్టు గెలిచినా క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలు కావడం ఖాయం.
అహ్మదాబాద్లో పండుగ వాతావరణం
మ్యాచ్ చూడటానికి కేవలం గుజరాత్ నుంచే కాకుండా దేశంలోని ప్రతి మూల నుంచి అభిమానులు అహ్మదాబాద్ చేరుకుంటున్నారు. స్టేడియం వెలుపల టికెట్ల కోసం జనం ఇంకా క్యూ కడుతున్నారు. హోటళ్లు, విమాన ఛార్జీలు ఆకాశాన్ని తాకుతున్నా క్రికెట్ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టును ఎంకరేజ్ చేసేందుకు మునుపెన్నడూ లేనంతగా జనసందోహం తరలివస్తోంది. మరి ఈ హోరాహోరీ పోరులో జగజ్జేతగా నిలిచేది ఎవరో చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
