Team India: 12 మ్యాచ్లు.. రూ. 100కోట్లు.. ఈ స్కెచ్ వెనుక పెద్ద ప్లాన్ ఉంది భయ్యో..!
India tour of New Zealand 2026: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన న్యూజిలాండ్ క్రికెట్ బోర్డును గట్టెక్కించేందుకు భారత జట్టు సిద్ధమవుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో భారీగా నష్టపోయిన కివీస్ బోర్డు, అక్టోబర్, నవంబర్ నెలల్లో జరగనున్న టీమ్ ఇండియా 12 మ్యాచ్ల పర్యటన ద్వారా దాదాపు రూ.100 కోట్ల ఆదాయం సమకూరుతుందని ఆశిస్తోంది.

India tour of New Zealand 2026: మైదానంలో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నప్పటికీ న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తీవ్ర నష్టాలను మూటగట్టుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో సుమారు 1.8 మిలియన్ డాలర్ల లోటు ఉంటుందని అంచనా వేయగా, అది కాస్తా ఏకంగా 7.3 మిలియన్ డాలర్లకు (దాదాపు రూ.70 కోట్లు) చేరింది. భారత్లో గేమింగ్ నిబంధనల సవరణ ప్రభావంతో స్పాన్సర్ డ్రీమ్ 11 భాగస్వామ్యంలో వచ్చిన మార్పులు తమకు భారీ నష్టాన్ని మిగిల్చినట్లు బోర్డు విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు భారత పర్యటనే తమకు ప్రధాన ఆదాయ వనరుగా భావిస్తోంది.
12 మ్యాచ్ల మెగా టూర్ షెడ్యూల్..
భారత్ ఈ పర్యటనలో భాగంగా 5 టీ20లు, 5 వన్డేలు, 2 టెస్టు మ్యాచ్లు ఆడనుంది.
టీ20 సిరీస్: అక్టోబర్ 22, 24 తేదీలలో క్రైస్ట్చర్చ్, అక్టోబర్ 27న వెల్లింగ్టన్, అక్టోబర్ 30న ఆక్లాండ్, నవంబర్ 1న హామిల్టన్.
వన్డే సిరీస్: నవంబర్ 4న ఆక్లాండ్, నవంబర్ 7న వెల్లింగ్టన్, నవంబర్ 10న హామిల్టన్, నవంబర్ 13, 15 తేదీలలో మౌంట్ మౌంగనుయ్.
టెస్టు సిరీస్: నవంబర్ 19న వెల్లింగ్టన్, నవంబర్ 27న క్రైస్ట్చర్చ్.
భారత్కు డబ్ల్యూటీసీ ఫైనల్ సవాలు..
ఈ పర్యటన న్యూజిలాండ్కు ఆర్థికంగా ఎంత కీలకమో, భారత జట్టుకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) ఫైనల్ చేరడానికి అంతకంటే కీలకం. స్వదేశంలో కివీస్ అత్యంత బలమైన జట్టు కావడంతో ఈ రెండు టెస్టుల సిరీస్ టీమ్ ఇండియాకు కఠినమైన పరీక్షగా మారనుంది. ఇందులో ప్రతికూల ఫలితాలు వస్తే భారత్ ఫైనల్ ఆశలు గల్లంతయ్యే ప్రమాదం ఉంది.
భారత పర్యటన ద్వారా భారీ ఆదాయాన్ని ఆర్జించాలని కివీస్ బోర్డు భావిస్తుండగా, క్లిష్టమైన పిచ్లపై సిరీస్లు నెగ్గి సత్తా చాటాలని టీమ్ ఇండియా పట్టుదలతో ఉంది. మైదానంలో ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు సాగడం ఖాయంగా కనిపిస్తోంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




