AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mohammed Siraj : అదరహో అనిపించిన సిరాజ్.. రెండు బంతుల్లో 2వికెట్స్.. వీడియో వైరల్

మహ్మద్ సిరాజ్ ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో జో రూట్, బెన్ స్టోక్స్‌లను వరుస బంతుల్లో ఔట్ చేసి సత్తా చాటాడు. హ్యాట్రిక్ మిస్ అయినా, అతని ప్రదర్శన భారత జట్టుకు కీలకమైన ఆధిక్యాన్ని ఇచ్చింది.దీంతో ప్రస్తుతం మ్యాచ్ ఇండియా వైపు మళ్లినట్లు అనిపిస్తుంది.

Mohammed Siraj : అదరహో అనిపించిన సిరాజ్.. రెండు బంతుల్లో 2వికెట్స్.. వీడియో వైరల్
Mohammed Siraj
Rakesh
|

Updated on: Jul 04, 2025 | 6:35 PM

Share

Mohammed Siraj : ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ మొదటి టెస్టులో పెద్దగా రాణించలేకపోయాడు. దీంతో సిరాజ్‌పై చాలా విమర్శలు వచ్చాయి. అభిమానులు సిరాజ్‌ను రెండో మ్యాచ్ నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. అయితే, భారత ప్రధాన బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ కారణంగా రెండో మ్యాచ్‌లో ఆడకపోవడంతో టీంఇండియా టెన్షన్ డబుల్ అయింది. ఇంగ్లాండ్ బ్యాటర్ల ముందు భారత బౌలర్లకు పెద్ద పరీక్ష ఎదురవుతుందని అంతా భావించారు. కానీ, ఆకాష్ దీప్ తర్వాత మహ్మద్ సిరాజ్ అద్భుత ప్రదర్శనతో అదరగొట్టాడు.

భారత్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 587 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన ఇంగ్లాండ్‌కు భారత బౌలర్లు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు తీసి షాక్ ఇచ్చారు. రెండో రోజును భారత్ తన పేరు మీద రాసుకుంది. ఆ తర్వాత మూడో రోజు కూడా సిరాజ్, ఆకాష్ దీప్ లాగే వరుసగా రెండు బంతుల్లో రెండు వికెట్లు తీసి భారత్‌కు అద్భుతమైన ఆరంభాన్ని అందించాడు.

ఆకాష్ దీప్ రెండో రోజు, ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో నాలుగో, ఐదో బంతికి బెన్ డకెట్, ఒలీ పోప్లను డకౌట్ చేశాడు. ఆ తర్వాత మహ్మద్ సిరాజ్ వేసిన బంతికి జాక్ క్రాలీ 19 పరుగుల వద్ద కరుణ్ నాయర్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. అనంతరం జో రూట్, హ్యారీ బ్రూక్ జోడీ ఆట ముగిసే సమయానికి వికెట్ పడకుండా జాగ్రత్త పడింది.

రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది. ఆ తర్వాత హ్యారీ బ్రూక్, జో రూట్ జోడీ మూడో రోజు ఆటను ప్రారంభించింది. అయితే, సిరాజ్ మూడో రోజు 22వ ఓవర్‌లో అద్భుతం చేశాడు.

సిరాజ్ మూడో బంతికి జో రూట్‌ను లెగ్ సైడ్ వైపు వెళ్తున్న బంతికి వికెట్ కీపర్ రిషబ్ పంత్ చేతికి క్యాచ్ ఇచ్చి ఔట్ చేశాడు. జో రూట్ 22 పరుగులు చేశాడు. రూట్ ఔటైన వెంటనే కెప్టెన్ బెన్ స్టోక్స్ బ్యాటింగ్‌కు వచ్చాడు. సిరాజ్ స్టోక్స్‌ను కూడా మొదటి బంతికే పంత్ చేతికి క్యాచ్ ఇచ్చి ఔట్ చేశాడు. దీంతో ఇంగ్లాండ్ ఐదో వికెట్‌ను కోల్పోయింది. సిరాజ్ హ్యాట్రిక్ వికెట్ తీసేందుకు ప్రయత్నించాడు. అభిమానులు సిరాజ్ హ్యాట్రిక్ సాధిస్తాడని ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ, జేమీ స్మిత్ సిరాజ్ బంతికి ఫోర్ కొట్టి హ్యాట్రిక్‌ను బ్రేక్ చేశాడు. అయినప్పటికీ, సిరాజ్ రెండు కీలక వికెట్లు తీసి మ్యాచ్‌ను భారత్ వైపు మలిచాడు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..