AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

700 ఏళ్ల చరిత్ర ఉన్న అద్భుతమైన దేవాలయం.. మౌంట్ బ్రోమో గణపతి విగ్రహ రహస్యం మీకోసం..!

ఇండోనేషియాలోని మౌంట్ బ్రోమో అగ్నిపర్వతం అంచున గణేశ విగ్రహం ఒక విశిష్టతను కలిగి ఉంది. టెంగర్ తెగ ప్రజలు ఈ విగ్రహాన్ని 700 ఏళ్లుగా భక్తితో పూజిస్తున్నారు. భక్తి, చరిత్ర, ప్రకృతి అందాలు కలిసిన ఈ ప్రదేశం గణేశ చతుర్థి వేడుకల సమయంలో మరింత ప్రత్యేకంగా మారుతుంది.

700 ఏళ్ల చరిత్ర ఉన్న అద్భుతమైన దేవాలయం.. మౌంట్ బ్రోమో గణపతి విగ్రహ రహస్యం మీకోసం..!
Mount Bromo Ganesha
Prashanthi V
|

Updated on: Aug 31, 2025 | 8:51 PM

Share

ప్రపంచంలోనే చాలా ప్రత్యేకమైన గణేశ విగ్రహం ఒకటి ఇండోనేషియాలో ఉంది. మౌంట్ బ్రోమో అనే అగ్నిపర్వతం అంచున ఉన్న ఈ విగ్రహాన్ని టెంగర్ తెగ ప్రజలు 700 సంవత్సరాలుగా పూజిస్తున్నారు. ఈ ప్రాంతం భక్తి, సంప్రదాయాలు, ప్రకృతి అందాలతో కలిసి ఒక ప్రత్యేకమైన ప్రదేశంగా నిలిచింది. ఇక్కడి ప్రజలు తమ గ్రామాలు అగ్నిపర్వతం నుంచి వచ్చే ప్రమాదాల నుంచి సురక్షితంగా ఉండాలని ఈ విగ్రహాన్ని పూజిస్తారు.

గణేశ చతుర్థి వేడుకలు

గణేశ చతుర్థి రోజున ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు, యాత్రికులు ఈ ప్రదేశానికి వస్తుంటారు. సోషల్ మీడియాలో కూడా ఈ విగ్రహం ఫోటోలు, వీడియోలు చాలా వైరల్ అవుతాయి. ఈ విగ్రహానికి మతపరమైన ప్రాముఖ్యత మాత్రమే కాదు.. ఎన్నో చారిత్రక, సాంస్కృతిక విశేషాలు కూడా ఉన్నాయి. ఇక్కడి స్థానికులు ఈనాటికీ పువ్వులు, పండ్లు, ధూపం సమర్పిస్తూ పూజలు చేస్తుంటారు.

ఈ విగ్రహం విశిష్టత

ఇండోనేషియాలో ఎప్పటి నుంచో హిందూ సంప్రదాయాలు కొనసాగుతున్నాయి. ఈ గణేశ విగ్రహం ఒక అగ్నిపర్వతం అంచున ఉండటం అనేది చాలా అరుదైన విషయం. స్థానికుల నమ్మకం ప్రకారం.. ఈ విగ్రహానికి దైవిక శక్తి ఉంది. ఇది చుట్టుపక్కల గ్రామాలను ప్రకృతి విపత్తుల నుంచి కాపాడుతుంది. అందుకే వారు ఈ విగ్రహాన్ని తమ సంరక్షకుడిగా భావించి పూజిస్తారు.

చారిత్రక విశేషాలు

ఈ విగ్రహాన్ని టెంగర్ తెగ ప్రజలు సుమారు 700 ఏళ్ల క్రితం ప్రతిష్టించారు. అగ్నిపర్వతం దగ్గర నివసించే వీరు తమ రక్షణ కోసం గణేశుడిని పూజించడం తమ సంప్రదాయంగా భావిస్తారు. ఒకవేళ పువ్వులు, పండ్లు, ధూపం సమర్పించకపోతే అగ్నిపర్వతం కోపిస్తుందని వారు నమ్ముతారు. ఈ నమ్మకాలన్నీ వారి భక్తి, జానపద కథలు, సంస్కృతి, ప్రకృతి పట్ల గౌరవం కలయికతో ఏర్పడ్డాయి.

మౌంట్ బ్రోమో..

ఇండోనేషియాలో 141 అగ్నిపర్వతాలు ఉన్నాయి. వాటిలో 130 ఇప్పటికీ చురుగ్గా ఉన్నాయి. వాటిలో మౌంట్ బ్రోమో చాలా ప్రత్యేకమైనది. దీని పేరు హిందూ దేవుడు బ్రహ్మ పేరు నుంచి వచ్చింది. ఈ పర్వతం 2,392 మీటర్ల ఎత్తులో ఉంటుంది. దాని చుట్టూ ఉండే అద్భుతమైన అందాలు, ప్రకృతి దృశ్యాలు టూరిస్టులను ఆకర్షిస్తాయి.

ఈ పవిత్ర స్థలాన్ని చూడాలనుకుంటే సురబయలో ఉన్న జువాండా అంతర్జాతీయ విమానాశ్రయం వరకు వెళ్లాలి. అక్కడి నుంచి కారులో మౌంట్ బ్రోమోకు 2 నుంచి 3 గంటల ప్రయాణం ఉంటుంది. అక్కడ ఉదయం అద్భుతమైన సూర్యోదయం, అగ్నిపర్వత దృశ్యాలను చూడవచ్చు. అలాగే ఈ చారిత్రక గణేశ విగ్రహాన్ని కూడా దర్శించుకోవచ్చు. మౌంట్ బ్రోమో గణేశ విగ్రహం.. ఒక గొప్ప సాంస్కృతిక వారసత్వం, నమ్మకం, ప్రకృతి పట్ల గౌరవం లాంటి వాటికి ప్రతీక.