Goa Gang Rape: గ్యాంగ్ రేప్ ఘటనపై నోరు జారిన గోవా సీఎం.. రాజీనామాకు విపక్షాల డిమాండ్
గోవాలో ఇద్దరు మైనర్ బాలికలపై గ్యాంగ్ రేప్ ఘటనపై సీఎం ప్రమోద్ సావంత్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర అసెంబ్లీలో తీవ్ర దుమారం రేపాయి.
గోవాలో ఇద్దరు మైనర్ బాలికలపై గ్యాంగ్ రేప్ ఘటనపై సీఎం ప్రమోద్ సావంత్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర అసెంబ్లీలో తీవ్ర దుమారం రేపాయి. పనాజీకి 30 కి.మీ. దూరంలో బీచ్ వద్ద గత వారం 14 ఏళ్ళ బాలికలపై గ్యాంగ్ రేప్ , ఇద్దరు మైనర్ బాలురపై దాడి ఘటనలు నిన్న సభను కుదిపివేశాయి. మొదట ఈ అంశంపై మాట్లాడిన సీఎం ప్రమోద్ సావంత్.. రాత్రివేళల్లో తమ అడ పిల్లలను తలిదండ్రులు పంపడం సమంజసమా అని ప్రశ్నించారు. మొత్తం రాత్రంతా వారు ఇంటికి రాకుండా ఉంటే తెలుసుకోవలసిన బాధ్యత వారికీ లేదా అన్నారు. తమ పిల్లలను పట్టించుకోకుండా పేరెంట్స్ ఏం చేస్తున్నారు.. వారికి ఏమైనా జరిగితే ప్రభుత్వాన్ని, పోలీసులను మాత్రం ప్రశ్నిస్తారు అని ఆయన వ్యాఖ్యానించారు. ఇందుకు మొదట బాధ్యత వహించాల్సింది ఎవరన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్, ఇతర విపక్ష సభ్యులు మండిపడ్డారు. శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన ముఖ్యమంత్రే ఇలా ఎలా మాట్లాడుతారని వారన్నారు., ఈ బీజేపీ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, ఈ సీఎం రాజీనామా చేయాలనీ కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జేవాలా డిమాండ్ చేశారు. క్రిమినల్స్ జైల్లో ఉండాలని..అంతేగానీ సాధారణ ప్రజలు బయట రాత్రులు తిరగడానికి ఎందుకు భయపడాలని గోవా కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆల్టోనా డీనోస్టా ప్రశ్నించారు.
ఇంకా శివసేన, గోవా ఫార్వర్డ్ బ్లాక్ వంటి ప్రతిపక్ష సభ్యులు కూడా మొదట రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సజావుగా ఉండేట్టు చూడాలని కోరారు. గతవారం పానాజీకి దూరంగా ఉన్న బీచ్ వద్ద ఇద్దరు మైనర్ బాలికలపై ఓ ప్రభుత్వ ఉద్యోగి సహా నలుగురు గ్యాంగ్ రేప్ కి పాల్పడ్డారని, ఇద్దరు మైనర్ బాలురపై దాడికి దిగారని వార్తలు వచ్చాయి.
మరిన్ని ఇక్కడ చూడండి: Minister KTR: ఏడేళ్లలో రాష్ట్రంలో 15 వేల పరిశ్రమలు.. భవిష్యత్కు అనుగుణంగా సౌర, పవన విద్యుత్కు ప్రాధాన్యత కేటీఆర్