ఆందోళనలో రెండు కోట్ల మంది విద్యార్థులు.. అండగా ఉంటామన్న సీఎం రేవంత్ రెడ్డి!
నీట్-యూజీ 2026 పరీక్షను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఏకపక్ష, నిరంకుశ నిర్ణయంపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం తీసుకున్న ఈ అనాలోచిత నిర్ణయం దేశవ్యాప్తంగా రెండు కోట్ల మంది విద్యార్థుల భవితవ్యాన్ని అంధకారంలోకి నెట్టేసిందని ఆయన మండిపడ్డారు.

నీట్-యూజీ 2026 పరీక్షను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఏకపక్ష, నిరంకుశ నిర్ణయంపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం తీసుకున్న ఈ అనాలోచిత నిర్ణయం దేశవ్యాప్తంగా రెండు కోట్ల మంది విద్యార్థుల భవితవ్యాన్ని అంధకారంలోకి నెట్టేసిందని ఆయన మండిపడ్డారు. ఈ రద్దు నిర్ణయం గతంలో దేశ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన పెద్ద నోట్ల రద్దు (డిమోనిటైజేషన్) వంటిదేనని సీఎం అభివర్ణించారు. వ్యవస్థీకృత పేపర్ లీక్లు, ప్రభుత్వ వైఫల్యాల వల్ల దేశ యువత ప్రస్తుతం తీవ్ర అనిశ్చితి, నిరాశలోకి కూరుకుపోయిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
గత పదేండ్లుగా ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో దేశంలో పరీక్షల వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని రేవంత్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన “ది పేపర్ లీక్ డెకేడ్” శ్వేతపత్రాన్ని ప్రస్తావిస్తూ.. 2014 మే నెలలో మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి కేంద్ర, రాష్ట్ర పరీక్షలలో ఏకంగా 93 పేపర్ లీక్ ఘటనలు జరిగాయని మండిపడ్డారు. లక్షలాది మంది భవితవ్యం గల్లంతు అయ్యిందన్నారు. 2024లోనే కేవలం ఎనిమిది వారాల వ్యవధిలో నీట్-యూజీ, యూజీసీ-నెట్, సీఎస్ఐఆర్-నెట్, నీట్-పీజీ వంటి నాలుగు ప్రధాన జాతీయ పరీక్షలు రద్దయ్యాయని సీఎం రేవంత్ గుర్తు చేశారు.
అటు ఉత్తరప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ పరీక్ష రద్దుతో 48 లక్షల మంది అభ్యర్థులు నష్టపోయారు. 2019 నుండి 15 రాష్ట్రాల్లో ప్రధాన నియామక పరీక్షల పేపర్లు లీక్ అవ్వగా, వీటికి బీజేపీ పాలిత రాష్ట్రాలే ప్రధాన కేంద్రాలుగా మారాయని ఆరోపించారు. ప్రధాని సొంత రాష్ట్రమైన గుజరాత్లోనే 14 లీక్లు జరిగాయని, యూపీ, మధ్యప్రదేశ్, హర్యానా రాష్ట్రాలు కూడా ఈ కుంభకోణాల జాబితాలో ఉన్నాయని స్పష్టం చేశారు. “సంవత్సరాల తరబడి కష్టపడి చదువుకున్న విద్యార్థుల కలలు మోదీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కల్లలయ్యాయి. ఎంతోమంది తల్లిదండ్రులు అప్పులు చేసి, నగలు అమ్మి తమ పిల్లలను చదివించారు. వారి ఆశలన్నీ కేంద్రం నిర్ణయంతో గల్లంతయ్యాయి.” అని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
ఇంత పెద్ద ఎత్తున కుంభకోణాలు జరుగుతున్నా, కనీసం సంబంధిత కేంద్ర మంత్రిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, ఏ ఒక్కరూ రాజీనామా చేయకపోవడం కేంద్ర ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని సీఎం దుయ్యబట్టారు. ప్రభుత్వం 2024 ఫిబ్రవరిలోనే ‘పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టం’ను ఆమోదించినప్పటికీ, పెద్ద కుంభకోణాలు వెలుగు చూసే వరకు, అంటే జూన్ 2024 వరకు దాని నోటిఫికేషన్ను కేంద్రం ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేసిందని ఆరోపించారు.
నీట్ రద్దు నేపథ్యంలో తెలంగాణలోని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎవరూ అధైర్యపడవద్దని, ఆందోళన చెందవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక హామీ ఇచ్చారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం, వారి హక్కుల కోసం తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని, ప్రతి కుటుంబానికి భరోసానిస్తుందని సీఎం స్పష్టం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
