AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fever: వణికిస్తోన్న విష జ్వరాలు.. సీజనల్ వ్యాధులకు తోడు మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ ముప్పేటదాడి, జనం విలవిల

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను విష జ్వరాలు వణికిస్తున్నాయి. సీజనల్ వ్యాదులకు తోడు మలేరియా, డెంగ్యూ, టైపాయిడ్ ముప్పేటదాడి చేయడంతో జనం విలవిల్లాడిపోతున్నారు. కరోనాతో

Fever: వణికిస్తోన్న విష జ్వరాలు..  సీజనల్ వ్యాధులకు తోడు మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ ముప్పేటదాడి, జనం విలవిల
Telangana Health
Venkata Narayana
|

Updated on: Aug 13, 2021 | 7:41 PM

Share

Telangana Health – Fever – Adilabad: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను విష జ్వరాలు వణికిస్తున్నాయి. సీజనల్ వ్యాధులకు తోడు మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ ముప్పేటదాడి చేయడంతో జనం విలవిల్లాడిపోతున్నారు. కరోనాతో ఆస్పత్రుల పాలై ఇప్పటికే ఆర్థికంగా కుదేలైన జిల్లా వాసులు తాజాగా నమోదవుతున్న ఫీవర్ కేసులతో మరింత ఆందోళనకు గురవుతున్నారు. డెంగ్యూ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండటంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్ల కొరత ఏర్పాడుతోంది. ప్రైవేటు ఆస్పత్రుల్లోను అదే పరిస్థితి. డెంగ్యూతో మరణాలు సైతం నమోదవుతుండటం మరింత ఆందోళనకు గురి చేస్తోంది. అధికారిక లెక్కలు ఎలా ఉన్నా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అనధికారికంగా డెంగ్యూ కేసుల సంఖ్య 500 దాటింది. కరోనా కేసులను సైతం విష జ్వరాల ఖాతాలోనే వేస్తుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది.

నిర్మల్, మంచిర్యాల జిల్లా కేంద్రాలను ముంచెత్తిన‌ వరదల దెబ్బకు డెంగ్యూ, మలేరియా, టైపాయిడ్ కేసుల సంఖ్య జెట్ స్పీడ్‌తో పెరిగింది. నిర్మల్ లో ఏకంగా 375 డెంగ్యూ కేసులు నమోదవగా, మంచిర్యాలలో ఆ సంఖ్య మరింత ఎక్కువగా ఉంది. నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రి లో బెడ్ల కొరతతో తప్పని పరిస్థితుల్లో రోగులు ప్రైవేట్ ఆస్పత్రులకు క్యూ కట్టక తప్పడం లేదు. డెంగ్యూ కేసుగా నిర్దారించాల్సిన ఎల్లిసా టెస్టులు చేయకపోవడం ర్యాపిడ్ టెస్టులతోనే సరిపెట్టడంతో అధికారికంగా డెంగ్యూ కేసుల సంఖ్య తేలడం లేదు. మరో వైపు ఫ్లేట్ లెట్స్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. సమయానికి రోగికి సరిపోయే ప్లేట్ లెట్స్ లభించక హుటాహుటిన ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలిస్తున్నారు నిర్మల్ వైద్యులు. దీంతో వ్యాధి తీవ్రత ముదిరి ప్రాణాపాయ స్థితికి చేరుతున్నట్టు రిమ్స్ వైద్యులు చెబుతున్నారు.

మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా డెంగ్యూతో ఈ సీజన్‌లో ఇప్పటికే 10 మరణాలు సంభవించినట్టు అనధికారిక లెక్కలు చెపుతున్నాయి. అయితే వీరంతా ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందడంతో వైద్య ఆరోగ్యశాఖ అధికారిక లెక్కల్లోకి చేరనట్టు సమాచారం. నిర్మల్ లో 4, ఆదిలాబాద్ లో 7, ఆసిపాబాద్‌లో 12 డెంగ్యూ మరణాలు నమోదైనట్టు తెలుస్తున్నా ఇవేవి కూడా వైద్యరోగ్యశాఖ లెక్కల్లోకి చేరలేదు. సీజన్ ల వ్యాదుల సమయంలో మంచాన పట్టే ఏజెన్సీ ఏరియాల్లో ఈ ఏడాది కేసుల సంఖ్య గణనీయంగా తగ్గినా పట్టణ, అర్బన్ ప్రాంతాల్లో మాత్రం రెట్టింపు కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

జులైలో మెల్లిగా పెరిగిన కేసులు ఆగష్టు రెండవ వారంలో వందల సంఖ్యలో నమోదవడంతో అలర్ట్ అయిన ఉమ్మడి ఆదిలాబాద్ వైద్యారోగ్యశాఖ ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరిపడ బెడ్లను సిద్దం చేసింది. నిర్మల్ జిల్లాలో అయితే కొవిడ్ వార్డును సైతం డెంగ్యూ వార్డుగా మార్చాల్సిన స్థాయిలో కేసులు నమోదవడం కలవరపెడుతోంది. నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రి లో మొత్తం 100 పడకలను‌ గాను 90 పడకలు ఇప్పటికే డెంగ్యూ రోగులతోనే నిండి ఉన్నాయంటే ఏ స్థాయిలో తీవ్రత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ కేసులు కేవలం వారం రోజుల వ్యవధిలోనే పెరిగాయంటున్నారు నిర్మల్ వైద్యులు. దీనికి ఓపి పేషెంట్ల సంఖ్య అదనం.

ఇక, ప్రభుత్వ ఆస్పత్రిలో బెడ్లు దొరకక ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్‌లో, ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య మరికొంత. మంచిర్యాలలో సేమ్ సీన్.. ఈ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో కలుపుకుని 800 మంది పైగా డెంగ్యూతో చికిత్స పొందుతున్నట్టు రిపోర్ట్లు చెబుతున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రమాదమే అంటున్నారు వైద్యులు. అప్రమత్తంగా ఉంటూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని పౌష్టిక ఆహారం తీసుకోవాలని కోరుతున్నారు.

Read also: Lokesh: ‘అది ఇంటి గొడ్డలేన‌ని.. సొంతింటి వేట‌ కొడ‌వ‌లే వివేకాని వేటాడింద‌ని స్పష్టం అవుతోంది’: నారా లోకేష్

Follow Us