AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vishwa Mangalya Sabha: జూలై 23-24 తేదీల్లో ‘విశ్వ మాంగల్య సభ’ ఉత్తర భారత సదస్సు.. ముఖ్య అతిథిగా మోహన్ భాగవత్!

Vishwa Mangalya Sabha: ఈ సభకు ఢిల్లీ, ఉత్తర భారత రాష్ట్రాల నుంచి 700 నుండి 800 మంది మహిళా ప్రతినిధులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. అలాగే హైదరాబాద్‌లో జరిగే దక్షిణ భారత సదస్సుకు సుమారు 1,300 మంది హాజరుకానున్నారు. జూలై 24న..

Vishwa Mangalya Sabha: జూలై 23-24 తేదీల్లో 'విశ్వ మాంగల్య సభ' ఉత్తర భారత సదస్సు.. ముఖ్య అతిథిగా మోహన్ భాగవత్!
Mohan Bhagwat
Subhash Goud
|

Updated on: Jul 15, 2026 | 7:29 PM

Share

Vishwa Mangalya Sabha: మహిళా సాధికారత, కుటుంబ, సామాజిక చైతన్యమే ధ్యేయంగా గత 16 ఏళ్లుగా సేవలందిస్తోన్న ‘విశ్వ మాంగల్య సభ’ ప్రతిష్టాత్మక ఉత్తర భారత ప్రాంతీయ అవగాహన సదస్సును జూలై 23, 24 తేదీల్లో దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించనుంది. “నా మాతుః పరం దైవతం” (తల్లిని మించిన దైవం లేదు) అనే నినాదంతో పనిచేస్తోన్న ఈ సంస్థ ప్రతినిధులు ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా విశ్వ మాంగల్య సభ జాతీయ పటిష్ట కార్యదర్శి వృషాలీ జోషి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. మహారాష్ట్ర అమరావతి జిల్లా అంజన్‌గావ్ సూర్జికి చెందిన దేవనాథ్ పీఠాధిపతి పూజ్య ఆచార్య స్వామి శ్రీ జితేంద్రనాథ్ జీ మహారాజ్ ఈ సంస్థను స్థాపించారని తెలిపారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ ఈ సంస్థకు మార్గదర్శిగా వ్యవహరిస్తూ, ప్రతిఏటా సంస్థ వ్యూహాత్మక ప్రణాళికల కోసం సమయాన్ని కేటాయిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. అయితే, విశ్వ మాంగల్య సభ అనేది ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ సంస్థ కాదని, మహిళల సామాజిక, సాంస్కృతిక ప్రగతి కోసం స్వతంత్రంగా పనిచేసే సంస్థ అని స్పష్టం చేశారు.

ఈ ఏడాది సదస్సు ప్రత్యేకతలేంటి?

మహిళల్లో ‘సమకాలీన మాతృత్వం’ అనే భావనను బలోపేతం చేసే లక్ష్యంతో రాబోయే రోజుల్లో సంస్థ పనిచేయనుందని వృషాలీ జోషి తెలిపారు. దీనికోసం దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ ప్రసిద్ధ మహిళా మేధావులతో ప్రత్యేకంగా సంభాషించనున్నారు. ఢిల్లీలోని ప్రతిష్టాత్మక ‘డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్’ లో ఒక ఉపన్యాసం, అలాగే దక్షిణ భారతదేశంలోని హైదరాబాద్‌లో ఉన్న ‘సేవాలాల్ బంజారా భవన్’ లో మరో ఉపన్యాసం ఇవ్వనున్నారు.

ఉత్తర భారత అవగాహన సదస్సును న్యూఢిల్లీ చాణక్యపురిలోని ‘విశ్వ యువక్ కేంద్ర’ లో జూలై 23, 24 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ సదస్సులో జమ్మూ, బారాముల్లా, అనంతనాగ్, లేహ్-లడఖ్, పశ్చిమ బెంగాల్ సరిహద్దు ప్రాంతాలతో పాటు అవధ్, మాల్వా, బీహార్, ఒడిశా, హిమాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి సుమారు 280 మంది మహిళా ప్రతినిధులు పాల్గొననున్నారు.

Vishwa Mangalya Sabh

Vishwa Mangalya Sabh

జూలై 24న అంబేద్కర్‌ భవన్‌లో ప్రత్యేక కార్యక్రమం:

జూలై 24 ఉదయం విశ్వ యువక్ కేంద్రంలో వాలంటీర్లతో సమావేశం ముగిసిన అనంతరం సాయంత్రం 5:00 గంటలకు న్యూఢిల్లీ జనపథ్‌లోని అంబేద్కర్ భవన్‌లో దేశంలోని ప్రముఖ మహిళా మేధావులతో ఆర్‌ఎస్‌ఎస్ అధినేత డాక్టర్ మోహన్ భాగవత్ ముఖాముఖి చర్చా కార్యక్రమం (టాక్ షో) నిర్వహించనున్నారు. ‘హై-టీ’ తో ప్రారంభమయ్యే ఈ ప్రత్యేక సమావేశం సుమారు రెండు నుండి రెండున్నర గంటల పాటు కొనసాగనుంది. ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాల వేళ ఈ కార్యక్రమానికి చారిత్రక ప్రాధాన్యత సంతరించుకుంది. సంఘ్ చరిత్రలో ఒక సర్ సంఘచాలక్ మహిళా మేధావులతో నేరుగా మాతృత్వం అనే అంశంపై సుదీర్ఘంగా చర్చించడం, వారి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం ఇదే తొలిసారి.

ఈ కార్యక్రమానికి ఢిల్లీ, ఉత్తర భారత రాష్ట్రాల నుంచి 700 నుండి 800 మంది మహిళా ప్రతినిధులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. అలాగే హైదరాబాద్‌లో జరిగే దక్షిణ భారత సదస్సుకు సుమారు 1,300 మంది హాజరుకానున్నారు. జూలై 24న జరిగే ముగింపు సమావేశం అనంతరం సంస్థ వార్షిక కార్యాచరణ ప్రణాళికను, సదస్సు తీర్మానాలను మీడియాకు వెల్లడిస్తామని విశ్వ మాంగల్య సభ ప్రతినిధులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us