CM KCR – Amit Shah: రెండ్రోజులుగా హస్తినలో మకాం వేసిన సీఎం కేసీఆర్.. మరికాసేపట్లో హోంమంత్రి అమిత్ షాతో భేటీ
ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. రెండ్రోజులుగా హస్తినలోనే ఉన్న సీఎం..ఇవాళ కేంద్రహోంమంత్రి అమిత్షాను కలిసే అవకాశముంది. పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

CM KCR Meet Amit Shah: ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. రెండ్రోజులుగా హస్తినలోనే ఉన్న సీఎం..ఇవాళ కేంద్రహోంమంత్రి అమిత్షాను కలిసే అవకాశముంది. పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.
హస్తినలో సీఎం కేసీఆర్ పర్యటన కొనసాగుతున్నది. పర్యటనలో భాగంగా శుక్రవారం ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమయ్యారు.45 నిమిషాల పాటు వివిధ అంశాలపై కీలకంగా చర్చించారు. ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర జల్శక్తి మంత్రి షెకావత్ను కలువనున్నారు. అమిత్ షాతో ఈ మధ్యాహ్నం 3 గంటలకు భేటీ అవుతారని తెలుస్తోంది. ఈ సమావేశంలో అమిత్షాతో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై సీఎం చర్చించనున్నారు. పలు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించనున్నారు.
కాగా, సీఎం కేసీఆర్ శుక్రవారం ప్రధాని మోదీని కలిసి యాదాద్రి దేవస్థానం పునఃప్రారంభోత్సవ కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాకతీయ టెక్స్టైల్ పార్కుకు వెయ్యి కోట్లివ్వాలని, ప్రత్యేక గిరిజన వర్సిటీని నెలకొల్పాలని, కొత్తగా ఏర్పాటైన జిల్లాలకు జవహర్ నవోదయ స్కూళ్లు మంజూరు చేయాలని, రెండు పారిశ్రామికవాడలను మంజూరుచేయాలని, పీఎంజీఎస్వై కింద అదనపు నిధులు ఇవ్వాలని, విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని కోరుతూ ప్రధానికి వినతి పత్రాలు సమర్పించారు. అలాగే, ఐపిఎస్ క్యాడర్ రివ్యూ, హైదరాబాద్- నాగపూర్ పారిశ్రామిక కారిడార్, ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజనకు అదనపు నిధులు.. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం.. రాష్ట్రంలో గిరిజన విశ్వవిద్యాలయం.. కరీంనగర్ లో ట్రిపుల్ ఐటి.. హైదరాబాద్లో ఐఐఎం ఏర్పాటుపై లేఖలు అందజేశారు సీఎం కేసీఆర్.