AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Madhya Pradesh: బస్‌ కోసం ఎదురుచూస్తుండగా దూసుకొచ్చిన ట్రక్కు.. అక్కడికక్కడే ఆరుగురు మృతి..

ఈ ప్రమాదంలో ఐదేళ్ల బాలిక కూడా మృతి చెందినట్లు ప్రత్యక్ష సాక్షి తెలిపారు. మృతుల్లో ఇప్పటి వరకు నలుగురిని గుర్తించారు. మిగిలిన వారి ఆచూకీ తెలియాల్సి ఉంది. 

Madhya Pradesh: బస్‌ కోసం ఎదురుచూస్తుండగా దూసుకొచ్చిన ట్రక్కు.. అక్కడికక్కడే ఆరుగురు మృతి..
Truck Rams
Jyothi Gadda
|

Updated on: Dec 05, 2022 | 10:47 AM

Share

బస్సు కోసం ఎదురు చూస్తున్న వారిని ఊహించని విధంగా మృత్యువు కబళించింది. ట్రక్కు రూపంలో వచ్చిన మృత్యువు ఆరుగురిని బలితీసుకుంది. రోడ్డుపై నిలబడి ఉన్న వారికి మీదకు అతివేగంగా ట్రక్కు దూసుకురావడంతో అక్కడికక్కడే ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో పదిమందికి పైగా గాయపడ్డారు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లోని రత్లామ్‌లో చోటు చేసుకుంది. ఆదివారం సాయంత్రం రత్లాం జిల్లాలోని రోడ్డు పక్కన ఉన్న బస్టాండ్ వద్ద పలువురు ప్రయాణికులు బస్సు కోసం వేచి ఉన్నారు. ఆ సమయంలో వేగంగా వచ్చిన ట్రక్కు అదుపు తప్పి ఇద్దరు మహిళలతో సహా ఆరుగురిని ఢీకొట్టింది. గాయపడిన వారిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రక్‌ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన ఆదివారం సాయంతం జరిగిందని పోలీసులు తెలిపారు. ట్రక్కు అతి వేగంతో వచ్చిందని పోలీసులు తెలిపారు. అంతలోనే ట్రక్‌ టైర్ ఒకటి పగిలింది. డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. అందుకే ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించారు.. రత్లాం జిల్లా కేంద్రానికి కేవలం 30 కిలోమీటర్ల దూరంలోని రత్లాం లెబాద్ రోడ్డులోని సత్రుండా గ్రామ సమీపంలోని ట్రాఫిక్ జంక్షన్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.

ఈ ఘటనలో 6 మంది మృతి చెందగా, 10 మంది గాయపడ్డారని జిల్లా కలెక్టర్ నరేంద్ర కుమార్ సూర్యవంశీ తెలిపారు. ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉంది. ట్రక్కును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు సూపరింటెండెంట్ అభిషేక్ తివారీ తెలిపారు. పారిపోయిన డ్రైవర్‌ని అదుపులోకి తీసుకున్నారు. వేగంగా వచ్చిన ట్రక్కు అనంత్‌ 20 మందిని ఢీకొట్టిందని, గాయపడిన ప్రయాణికుడు విశాల్‌ తెలిపారు. ట్రక్కు అతివేగంతో వచ్చి నిలబడి ఉన్న ప్రయాణికులను ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మృతదేహాలు రోడ్డుపై పడి ఉన్నాయి. స్థానికులు ముందుగా సహాయక చర్యలు చేపట్టారు. రోడ్డుపై మృతదేహాలు ఛిద్రంగా పడి ఉన్నాయని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. ఈ ప్రమాదంలో ఐదేళ్ల బాలిక కూడా మృతి చెందినట్లు ప్రత్యక్ష సాక్షి తెలిపారు. మృతుల్లో ఇప్పటి వరకు నలుగురిని గుర్తించారు. మిగిలిన వారి ఆచూకీ తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

సమాచారం అందుకున్న కలెక్టర్‌, ఎస్పీ సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్షతగాత్రులను రత్లాం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి