PM Modi: తొలిసారిగా ఉక్రెయిన్కు ప్రధాని మోదీ.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపు కోసమేనా..?
వచ్చే నెల అంటే ఆగస్టులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉక్రెయిన్లో పర్యటించనున్నారు. 2022లో రష్యా ఉక్రెయిన్పై దాడి చేసిన తర్వాత ప్రధాని మోదీ పర్యటన ఇదే తొలిసారి. అంతకుముందు ఇటలీలో జరిగిన జీ7 సదస్సులో ప్రధాని మోదీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ భేటీ అయ్యారు.
![PM Modi: తొలిసారిగా ఉక్రెయిన్కు ప్రధాని మోదీ.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపు కోసమేనా..?](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/volodymyr-zelensky-narendra-modi.jpg?w=1280)
వచ్చే నెల అంటే ఆగస్టులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉక్రెయిన్లో పర్యటించనున్నారు. 2022లో రష్యా ఉక్రెయిన్పై దాడి చేసిన తర్వాత ప్రధాని మోదీ పర్యటన ఇదే తొలిసారి. అంతకుముందు ఇటలీలో జరిగిన జీ7 సదస్సులో ప్రధాని మోదీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ భేటీ అయ్యారు. అనంతరం ఇరువురు నేతలూ ఒకరికొకరు ఆలింగనం చేసుకుని ఘనంగా స్వాగతం పలికారు. 2024 లోక్సభ ఎన్నికల్లో గెలుపొందిన మోదీకి జెలెన్స్కీ కూడా అభినందనలు తెలిపారు. ఆగస్టు 23న మోదీ ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నారు.
సెప్టెంబరు 2022లో ఉజ్బెక్లోని సమర్కండ్ నగరంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో యుద్ధం ఆపాలంటూ ప్రధాని మోదీ సూచించారు. రష్యా నాయకుడు ఉక్రెయిన్ వివాదాన్ని ముగించాలని కోరారు. మోదీ నిర్ణయం ప్రపంచ నాయకుల నుండి కూడా ప్రశంసలు అందుకుంది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి, చర్చలు, దౌత్యం ద్వారా మాత్రమే దీనిని పరిష్కరించగలమని భారతదేశం మొదటి నుంచి చెబుతోంది. ఎలాంటి శాంతి ప్రయత్నాలకైనా సహకరించేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలోనే 2022లో ఉక్రెయిన్పై రష్యా దాడులు మొదలుపెట్టిన తర్వాత రెండు సందర్భాల్లో ఇద్దరు నేతలు కలుసుకున్నారు. గత ఏడాది జపాన్లో నిర్వహించిన G-7 సదస్సులో తొలిసారి కలుసుకున్నారు. జూన్లో ఇటలీలో నిర్వహించిన G-7 సదస్సులో ఈ ఇద్దరు నేతలు రెండోసారి కలుసుకున్నారు. ఉక్రెయిన్లో యుద్ధ స్థితిగతులపై వీరిద్దరూ చర్చించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగిసిపోవాలంటే శాంతియుత చర్చలే మార్గమని ప్రధాని మోదీ చెబుతున్నారు. ఆగస్ట్ నెల రెండో వారంలోనే మోదీ రెండు రోజులు రష్యాలో పర్యటించారు. నెలరోజుల వ్యవధిలో మోదీ ఉక్రెయిన్కు వెళుతుండటం ఆసక్తిగా మారింది. ఆగస్ట్ 24వ తేదీ ఉక్రెయిన్ స్వాతంత్ర్య దినోత్సవం. ఈ సందర్భంగా మోదీ ఉక్రెయిన్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ పర్యటన చర్చల దశలో ఉంది. ఇంకా అధికారికంగా ఖరారు కావల్సి ఉంది.
ఇదిలావుంటే, రష్యాలో, రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించడంలో అసాధారణమైన సేవలకు పుతిన్చే రష్యా అత్యున్నత పౌర గౌరవం ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్ను కూడా ప్రధాని మోదీ అందుకున్నారు. 22వ ఇండియా-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశానికి పుతిన్ ఆహ్వానం మేరకు జులై 8, 2024 నుండి ప్రారంభమయ్యే రెండు రోజుల పర్యటన కోసం ప్రధాని నరేంద్ర మోదీ మాస్కోను సందర్శించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…