PMUY 2021: పేదలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు.. నేడు ‘ఉజ్వల’ పథకాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ
PM Narendra Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో పథకానికి నేడు శ్రీకారం చుట్టబోతున్నారు. ఉజ్వల 2.0 పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రారంభించనున్నారు. ఉత్తరప్రదేశ్లోని

Pradhan Mantri Ujjwala Yojana: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో పథకానికి నేడు శ్రీకారం చుట్టబోతున్నారు. ఉజ్వల 2.0 పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రారంభించనున్నారు. ఉత్తరప్రదేశ్లోని మహోబా జిల్లాలో జరిగే ఈ కార్యక్రమాన్ని ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొననున్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో ప్రధాని సంభాషించనున్నారు. దీంతోపాటు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. పేదలకు, అల్పాదాయ వర్గాలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు అందించడం కోసం ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఉజ్వల స్కీమ్ను 2016లో ప్రారంభించింది. దాదాపు ఐదు కోట్ల బీపీఎల్ కుటుంబాలకు చెందిన మహిళలకు గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అనంతరం 2018లో పథకాన్ని మరో ఏడు వర్గాలకు వర్తింపజేస్తూ ఈ లక్ష్యాన్ని ఎనిమిది కోట్లకు సవరించారు. షెడ్యూల్ చేసిన తేదీకి ఏడు నెలల ముందుగానే అంటే 2019 ఆగస్టులో ఈ లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం అధిగమించింది.
కాగా.. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్లో పీఎంయూవై పథకం కింద అదనంగా కోటి గ్యాస్ కనెక్షన్లను కేంద్రం ప్రకటించింది. తొలి దశలో ఎల్పీజీ అందుకోలేకపోయిన పేద కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లు అందించాలని కేంద్రం నిర్ణయించింది. ఉజ్వల 2.0 కింద ఉచిత ఎల్పీజీ కనెక్షన్తో పాటు లబ్ధిదారులకు మొదటి రీఫిల్, హాట్ప్లేట్ అందించనున్నట్లు కేంద్రం పేర్కొంది. కాగా.. ఉజ్వల స్కీమ్లో రిజిస్ట్రేషన్ కోసం కనీస ప్రతాలు అవసరం కాగా.. ఉజ్వల 2.0లో వలసదారులు రేషన్కార్డు, నివాస ధ్రువీకరణ పత్రాలు లేకుండానే గ్యాస్ కనెక్షన్లు అందించనున్నట్లు కేంద్రం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ అదనపు గ్యాస్ కనెక్షన్లను మొదటి దశ కింద కవర్ చేయలేని తక్కువ ఆదాయ కుటుంబాలకు అందించడానికి కేంద్రం ప్రణాళికలు రూపొందించింది.
Also Read:
