AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మమతా బెనర్జీకి జైకొడుతున్న బీజేపీయేతర పార్టీలు

బీజేపీయేతర పార్టీలకు ఇప్పుడు మమతా బెనర్జీ పెద్ద దిక్కుగా కనిపిస్తున్నారు. భవిష్యత్తులో బీజేపీని గట్టిగా ఢీకొనే శక్తి సామర్థ్యాలు ఆమెకే ఎక్కువగా ఉన్నాయని విశ్వసిస్తున్నారు...

మమతా బెనర్జీకి  జైకొడుతున్న  బీజేపీయేతర పార్టీలు
Mamatha Sonia Gandhi
Anil kumar poka
|

Updated on: May 06, 2021 | 3:26 PM

Share

బీజేపీయేతర పార్టీలకు ఇప్పుడు మమతా బెనర్జీ పెద్ద దిక్కుగా కనిపిస్తున్నారు. భవిష్యత్తులో బీజేపీని గట్టిగా ఢీకొనే శక్తి సామర్థ్యాలు ఆమెకే ఎక్కువగా ఉన్నాయని విశ్వసిస్తున్నారు. ఇప్పుడామె బీజేపీయేతర పార్టీలకు అపర కాళికాదేవి! మమతా బెనర్జీని యూపీఎ ఛైర్‌పర్సన్‌గా ఎంపిక చేయాలంటూ డిమాండ్‌ కూడా చేస్తున్నాయి. ఛైర్‌పర్సన్‌ కాకపోతే కన్వీనర్‌ పదవినైనా అప్పగించాలంటూ కోరుతున్నాయి. కాంగ్రెస్‌లోని ఓ వర్గం నేతలు కూడా ఇదే మాట అంటున్నారు. నిజానికి మమతా బెనర్జీకి కాంగ్రెస్‌పార్టీ కొత్తేమీ కాదు.. ఆమె కూడా కాంగ్రెస్‌ పార్టీ నుంచి వచ్చినవారే! కమ్యూనిస్టులతో కాంగ్రెస్‌ దగ్గరవ్వడాన్ని భరించలేకే ఆమె కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చి తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ పెట్టుకున్నారు. ఇప్పుడు నేషనల్‌ లీడర్‌ అయ్యారు. ఒకానొకప్పుడు కాంగ్రెస్‌తో పొత్తు కూడా పెట్టుకుని అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లారు మమత బెనర్జీ. కాబట్టి యూపీఏ ఛైర్‌పర్సన్‌ పదవి ఆమెకు ఇవ్వడంలో తప్పేమీ లేదన్నది కొందరి వాదన.

మరోవైపు కాంగ్రెస్‌ ప్రదర్శన కూడా ఏమంతా గొప్పగా ఉండటం లేదు. నెమ్మదిగా తన ప్రాభవం కోల్పోతున్నది. కాంగ్రెస్‌కు ఉన్న ఓటు బ్యాంకు చూసి కొన్ని ప్రాంతీయ పార్టీలు పొత్తు పెట్టుకున్నా అది వర్క్‌ అవటవ్వడం లేదు. ఇందుకు ఉత్తరప్రదేశ్‌, బీహార్‌లు పెద్ద ఉదాహరణ. ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంది. ఆ పొత్తు ఫలించలేదు. కాంగ్రెస్‌ కారణంగానే తాము ఓడిపోవాల్సి వచ్చిందని స్వయంగా అఖిలేశ్‌ యాదవే అన్నారు. బీహార్‌లోనూ ఇదే జరిగింది. బీహార్‌లో మహాకూటమి పేరుతో ఆర్‌జేడీ, కాంగ్రెస్‌లు కలిసి పోటీ చేశాయి. అయినా ఎన్‌డీఏ చేతిలో ఓడిపోవాల్సి వచ్చింది. ఎన్నికల ఫలితాల తదనంతరం కాంగ్రెస్‌ అత్యాశే తమ కొంప ముంచిందని ఆర్‌జేడీ విమర్శించింది. కాంగ్రెస్‌ పక్షాన ఇంకా ప్రజలు ఉన్నారనే భావన ఆ పార్టీ అధినాయకత్వానికి ఉంది. ఆ నమ్మకంతోనే అప్పుడు తన బలానికి మించి సీట్లను డిమాండ్‌ చేసింది. ఆర్‌జేడీకి కూడా కాదనలేని పరిస్థితి. 70 స్థానాలను కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తే ఇచ్చి కూర్చుంది ఆర్‌జేడీ.. తీరా కాంగ్రెస్‌ గెలిచింది 19 స్థానాలలోనే! 51 స్థానాలలో ఓడిపోవడమే కాకుండా ఎన్‌డీఏ అభ్యర్థులు పరోక్షంగా గెలిచేట్టు చేసింది. ఫలితంగా ఆర్‌జేడీ చేతి వరకు వచ్చిన అధికారం చేజారిపోయింది. ఇలా చాలా మార్లు జరిగింది. బెంగాల్‌లో కూడా కమ్యూనిస్టులతో జత కలిసింది కాంగ్రెస్‌. ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. అందుకే ప్రాంతీయపార్టీలు బలంగా ఉన్న చోట కాంగ్రెస్‌ పాత్ర పరిమితంగా ఉండాలన్నది ఎన్‌సీపీ అధినేత శరద్‌పవార్‌ భావన.

చాలా మంది ప్రాంతీయ పార్టీల అధినేతలకు తృతీయ ఫ్రంట్‌ రావాలన్న ఆకాంక్ష బలంగా ఉన్నా, కాంగ్రెస్‌ పడనివ్వడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. జాతీయ రాజకీయాలలో తన పాత్ర ఎక్కడ తగ్గిపోతుందేమోనన్న భయం కాంగ్రెస్‌ది! ఇప్పటి వరకు ఆ భయంతోనే ఉండింది. కానీ బెంగాల్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌లోనూ మార్పు కనిపిస్తోంది. బెంగాల్‌లో కాంగ్రెస్‌కు ఉన్న ఓటు బ్యాంకు మొత్తం తృణమూల్‌ కాంగ్రెస్‌కు షిఫ్టయ్యింది. రాహుల్‌గాంధీ ఎంతగా శ్రమిస్తున్నా ఫలితం దక్కడం లేదు. ప్రజలు ఏం కోరుకుంటున్నారో, వారికి చేరువ అవ్వడం ఎలాగో రాహుల్‌కు అర్థం కావడం లేదు. సోనియాగాంధీకేమో వయసు మీద పడింది. పార్టీ సారథ్యబాధ్యతలను మోసే స్టేజ్‌లో ఆమె లేరు. మొన్నటి వరకు రాహుల్‌గాంధీకి కాకుండా మరొకరికి పార్టీ బాధ్యతలను అప్పగించాలని డిమాండ్‌ చేసిన కాంగ్రెస్‌ పెద్దలు ఇప్పుడు తమ మనసు మార్చుకున్నారు. రాహుల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులైతే తమకు అభ్యంతరం లేదు కానీ, యూపీఏ ఛైర్‌పర్సన్‌ పదవిని సోనియాగాంధీ వదులుకుంటే మంచిదని అంటున్నారు. ఆ పదవిని కాంగ్రెసేతర పార్టీ నేతకు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఛైర్‌పర్సన్‌ పదవినివదలుకోవడం సోనియాకు ఇష్టం లేకపోతే కనీసం కన్వీనర్‌ పదవి అయినా కాంగ్రెసేతర పార్టీ నేతలకు ఇవ్వాలని అంటున్నారు. ఇంతకు ముందు కూడా ఇలాంటి డిమాండ్‌లు వచ్చాయి. యూపీఏ సారథ్య బాధ్యతలను శరద్‌పవార్‌కు అప్పగించాలని కొందరు అన్నారు. ఇప్పుడు బెంగాల్‌లో మమతాబెనర్జీ సాధించిన ఘన విజయం తర్వాత అందరూ ఆమెకు జై కొడుతున్నారు. యూపీఎ ఛైర్‌పర్సన్‌ పదవి కానీ కన్వీనర్‌ పదవి కాని మమతకు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. యూపీఏను ముందుకు నడిపించే శక్తి సామర్థ్యాలు ఆమెకే ఉన్నాయని అంటున్నారు. పైగా బీజేపీయేతర పార్టీలతో మమతకు మంచి సంబంధాలు ఉన్నాయి. డీఎంకే అధినేత స్టాలిన్‌, ఆర్డేడీ అధినేత లాలూ ప్రసాద్‌, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌యాదవ్‌, ఆమ్‌ ఆద్మీపార్టీ అధినేత కేజ్రీవాల్‌లకు మమత అంటే ఎంతో అభిమానం. యూపీఎ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీ అభిమతమేమిటో! మమతకు ఆమె చోటిస్తారో లేదో చూడాలి.

మరిన్ని చదవండి ఇక్కడ :  ఐడియా అదుర్స్‌ రైతన్న వినూత్న ప్రయోగం వైరల్ అవుతున్న వీడియో ..: Farmer Creative Viral Video.

Follow Us