Amit Shah: రాళ్లు రువ్విన చేతులతో కంప్యూటర్లు పడుతున్నారు.. జమ్మూకశ్మీర్ పర్యటనలో అమిత్ షా కీలక వ్యాఖ్యలు..
జమ్ముకశ్మీర్ టూర్లో ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా రిజర్వేషన్లపై కీలక ప్రకటన చేశారు. గుజ్జర్లు, బకర్వాల్లతో పాటు పహారీ సామాజిక వర్గానికి ఎస్టీ హోదా కల్పిస్థామని హామీ ఇచ్చారు.
ఒక వైపు ఉగ్రవాదుల టెన్షన్.. హై సెక్యూరిటీ మధ్య కేంద్ర హోం మంత్రి అమిత్ షా జమ్ముకశ్మీర్ టూర్ కొనసాగుతోంది. రెండవ రోజు.. అమిత్ షా కీలక ప్రకటన చేశారు. గుజ్జర్లు, బకర్వాల్లతో పాటు పహారీ సామాజిక వర్గానికీ ఎస్టీ హోదా కల్పించి.. త్వరలో విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. నవరాత్రుల సందర్భంగా రియాసి జిల్లాలోని త్రికూట కొండలపై ఉన్న మాతా వైష్ణో దేవి పుణ్యక్షేత్రాన్ని సందర్శించిన అమిత్ షా ప్రత్యేక పూజలు చేశారు. మూడు సామాజిక వర్గాల ప్రయోజనాలు పరిశీలించేందుకు లెఫ్టినెంట్ గవర్నర్ ఏర్పాటు చేసిన జస్టిస్ శర్మ కమిషన్ సిఫారసుల మేరకు కోటా అమలు చేయనున్నట్టు వెల్లడించారు. ఎస్టీ కోటాలో గుజ్జర్లు, బకర్వాల్లు, పహారీలకు ఎలాంటి తగ్గుదల ఉండదన్న ఆయన.. ప్రతి ఒక్కరూ తమ వాటాను పొందుతారని స్పష్టం చేశారు. ఆర్టికల్ 370 రద్దుతో జమ్ము కశ్మీర్లో అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు అందించేందుకు మార్గం సుగమమైందని అమిత్ షా అన్నారు. చట్టపరమైన ప్రక్రియ పూర్తి కాగానే ఆయా వర్గాల ప్రజలు రిజర్వేషన్ ప్రయోజనాలు అందిస్తామన్నారు.
కేంద్ర హోం మంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్షా జమ్ము-కశ్మీర్ టూర్ పొలిటికల్ కాక రేపుతోంది. మూడురోజుల టూర్ లోకల్ పార్టీల్లో టెన్షన్ పుట్టిస్తోంది. నిన్న జమ్మూకశ్మీర్లో అడుగుపెట్టిన అమిత్ షా.. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి మాట్లాడారు. ఆర్టికల్ 370 రద్దుతో జమ్ము కశ్మీర్లో మార్పులు చోటుచేసుకోవడంతోపాటు అభివృద్ధికి దోహదపడిందని అమిత్ షా తెలిపారు. జమ్మూ కాశ్మీర్లో ఇప్పుడు ఊరేగింపులు, రాళ్లదాడి ఘటనలు లేవని.. ఇవి తగ్గుముఖం పట్టడానికి ఆర్టికల్ 370 రద్దు కారణమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. యువతకు ఉపాధి లభించిందని.. గతంలో రాళ్లు రువ్విన చేతులతో ఇప్పుడు కంప్యూటర్లు పట్టుకుంటున్నారని తెలిపారు. అంతేకాకుండా వేలాది కుటుంబాలు ప్రభుత్వ ప్రయోజనాలను పొందతున్నాయన్నారు. ఉగ్రవాదులను ఎప్పుడు, ఎలా ఎదుర్కోవాలో భద్రతా సంస్థలకు తెలుసని తెలిపారు. ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగకపోవడానికి కుటుంబ రాజకీయాలే కారణమని అమిత్ షా వివరించారు.
కాగా.. అమిత్ షా పర్యటనలో ఉండగానే.. 1992 ఐపీఎస్ అధికారి, జమ్మూకశ్మీర్ జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ హేమంత కుమార్ లోహియా హత్య కలకలం రేపింది. ఈ కేసులో నిందితుడైన యాసిర్ అహ్మద్ను పోలీసులు పట్టుకుని విచారిస్తున్నారు. అమిత్ షా పర్యటన, మరోవైపు ఉగ్ర కుట్రల నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..