Meghalaya: షిల్లాంగ్ హనీమూన్కి వెళ్లి మిస్సైన దంపతుల కేసులో సంచలనం – స్కెచ్ అంతా మేడమ్దే
కొత్తగా పెళ్లయిన జంట. మేఘాల్లో తేలిపోతూ మేఘాలయలో వాలిపోయింది. కలల రెక్కలు తొడిగి ప్రకృతి ఒడిలో పరవశించిపోయింది. జీవితకాల బంధానికి ఆ జ్ఞాపకాన్ని పదిలంగా దాచుకోవాలనుకుంది. కానీ అందాల జంట ఆ లోయలో అదృశ్యమైపోయింది. దారితప్పారేమోనని వెతుకుతుంటే.. హత్యకు గురైన భర్త మృతదేహం దొరికింది. నవవధువు జాడలేదు. తాజాగా ఈ కేసు గురించి సంచలన ప్రకటన చేశారు పోలీసులు.

మే11 వివాహం, 20న హనీమూన్… షిల్లాంగ్ పర్యటనలో అదృశ్యం. దేశాన్ని కుదిపేసింది ఈశాన్య రాష్ట్రంలోని మర్డర్ అండ్ మిస్సింగ్ మిస్టరీ. మేఘాలయలో ఇండోర్ జంట అదృశ్యం మిస్టరీ రాష్ట్ర ప్రభుత్వానికి సవాలుగా మారింది. దర్యాప్తు సంస్థలకు చిక్కుముడిలా మారిందీ కేసు. ఎట్టకేలకు కేసును చేధించారు పోలీసులు. భయానక నిజాలను వెల్లడించారు. భర్త రాజా రఘువంశీని భార్య సోనమ్ చంపించినట్లు పోలీసుల ప్రకటించారు. భార్య సోనమ్తోపాటు హత్యకు సహకరించిన మరో నలుగుర్ని యూపీలోని ఘాజీపూర్లో అరెస్ట్ చేశారు. భర్త హత్య కోసం భార్య సుపారీ ఇచ్చినట్లు మేఘాలయ పోలీసులు తేల్చారు. మర్డర్ మాస్టర్మైండ్ సోనమ్ అని పోలీసులు పక్కా ఆధారాలతో కనుగొన్నారు.
రాజా రఘువంశీ కుటుంబం మధ్యప్రదేశ్ ఇండోర్లో ట్రాన్స్పోర్టు వ్యాపారం చేస్తోంది. మే 11న సోనమ్తో అతని వివాహం జరిగింది. 20న హనీమూన్ కోసం నవ దంపతులు మేఘాలయకు వెళ్లారు. మే 22న ఓ టూవీలర్ అద్దెకు తీసుకొని మౌలాకియాత్ గ్రామానికి చేరుకున్నారు. అక్కడ ద్విచక్ర వాహనాన్ని పార్క్ చేసి లివింగ్ రూట్ వంతెనని చూసేందుకు వెళ్లారని తెలిపారు. రాత్రి అక్కడ బస చేసి.. మర్నాడు ఉదయం బయటికెళ్లారు. ఆ తర్వాత వీరిద్దరూ అదృశ్యమయ్యారు. 11 రోజుల తర్వాత సోహ్రాలోని ఓ వాటర్పాల్ సమీపంలోని లోతైన లోయలో రఘువంశీ మృతదేహాన్ని గుర్తించారు. దీంతో ఆ జంట మేఘాలయ చేరుకున్నాక ఎక్కడెక్కడ తిరిగారో టైమ్లైన్తో ఎంక్వయిరీ చేస్తున్నారు పోలీసులు.
మే 21.. సాయంత్రం 6 గంటలు: రఘువంశీ, సోనమ్ మేఘాలయ రాజధాని షిల్లాంగ్లోని బాలాజీ గెస్ట్ హౌస్కు చేరుకుని బసచేశారు.
మే 22 ఉదయం రఘువంశీ, సోనమ్ కీటింగ్ రోడ్లో స్కూటీని అద్దెకు తీసుకుని బాలాజీ గెస్ట్ హౌస్కు తిరిగొచ్చారు. టిఫిన్ కూడా చేయకుండానే చెక్ అవుట్ చేశారు. మే 25కు తిరిగొస్తామని, రూమ్ అవసరమైతే ఫోన్ చేస్తామని మేనేజర్కు చెప్పారు. షిల్లాంగ్ నుంచి స్కూటీపై చిరపుంజికి రెండు లగేజీలతో బయలుదేరారు.
మే 22 సాయంత్రం తూర్పు ఖాసీ హిల్స్లోని మౌలాఖియాట్ గ్రామానికి చేరుకున్నారు రఘువంశీ, సోనమ్. టూరిస్టుల కోసం కేటాయించిన పార్కింగ్ ప్లేస్లో స్కూటీని పార్క్ చేశారు. నోంగ్రియాట్ గ్రామంలోని షిపారా హోమ్స్టేకు ట్రెక్కింగ్ చేసేందుకు స్థానిక గైడ్ని ఏర్పాటు చేసుకున్నారు.
మే 23 ఉదయం రఘువంశీ, సోనమ్లు షిపారా హోమ్స్టే నుంచి చెకవుట్ చేసి గైడ్ లేకుండానే మావ్లాఖియాట్ గ్రామానికి వెళ్లారు. అదే రోజు మావ్లాఖియాట్ నుంచి బయలుదేరి అదృశ్యమయ్యారు. దీంతో గైడ్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు పరిసరాల్లో గాలించారు.
మే 24 సోహ్రారిమ్ గ్రామం తూర్పు ఖాసీ హిల్స్లోని సోహ్రారిమ్ గ్రామ పెద్ద తమ గ్రామంలో అనుమానాస్పదంగా ఒక స్కూటీని చూసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మే 25 సోహ్రారిమ్ గ్రామం పోలీసులు స్కూటీ యజమానిని గుర్తించారు. అతను సోహ్రా పోలీస్ స్టేషన్కు వచ్చి మధ్యప్రదేశ్ జంట ద్విచక్ర వాహనాన్ని అద్దెకు తీసుకున్నట్లు నిర్ధారించాడు. దీంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
జూన్ 2 వీ సావ్డాంగ్ జలపాతం పోలీసు డ్రోన్ వీ సావ్డాంగ్ జలపాతం కింద లోయలో ఒక మృతదేహాన్ని గుర్తించింది. పాక్షికంగా కుళ్ళిపోయిన ఆ మృతదేహం రాజా రఘువంశీదేనని మృతుని కుటుంబ సభ్యులు తెలిపారు.
ఈ జంట అదృశ్యమైన రోజు వారి వెంట మరో ముగ్గురు పురుషులు ఉన్నట్లు ఒక టూరిస్ట్ గైడ్ ఇచ్చిన సమాచారం కేసులో కీలక మలుపుగా మారింది. రాజా రఘువంశీ, ఆయన భార్య సోనమ్ మే 23న ఉదయం 10 గంటల సమయంలో నాన్గ్రియాట్ నుంచి మావ్లాఖియాట్ వైపు మెట్లు ఎక్కుతుండగా ఆ గైడ్ చూశాడు. నలుగురు పురుషులు ముందు నడుస్తుండగా, మహిళ వారిని అనుసరిస్తోందని.. ఆ నలుగురూ హిందీలో మాట్లాడుకుంటున్నారని గైడ్ వెల్లడించటంతో.. కేసు చిక్కుముడి వీడింది. అతను ఇచ్చిన సమాచారంతో ఒక్కో లీడ్ పట్టుకుని విచారణ చేస్తే చివరికి సోనమ్ను దోషిగా తేల్చారు..
మేఘాలయ చరిత్రలోనే ఎప్పుడూ ఇలాంటి సంఘటన జరగలేదంటున్న ప్రభుత్వం.. కేసుని సీరియస్గా తీసుకుంది. హత్య -అదృశ్యం మిస్టరీని ఛేదించడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. మొత్తానికి లోయలో జరిగిన క్రైమ్ థ్రిల్లర్ మూవీని తలపించిన.. ఈ క్రైమ్కు కేసును సాల్వ్ చేసింది పోలీస్ టీమ్.