కొత్తరకం మోసాలు.. ఏఐతో ముఖం మార్చుకుని వీడియోకాల్.. ఫ్రెండ్ అనుకుని క్షణాల్లో రూ.40 వేలు మోసపోయాడు
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) క్రమంగా మన జీవన విధానంలో భాగమైపోతోంది. కొందరు ఏఐ టెక్నాలజీతో కెరీర్కు బాటలు వేసుకుంటుంటే, మరికొందరేమో మోసాలకు పాల్పడుతున్నాడు. ముఖ్యంగా సైబర్ నేరగాళ్లు ఏఐ టెక్నాలజీ సాయంతో..

తిరువనంతపురం, జులై 18: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) క్రమంగా మన జీవన విధానంలో భాగమైపోతోంది. కొందరు ఏఐ టెక్నాలజీతో కెరీర్కు బాటలు వేసుకుంటుంటే, మరికొందరేమో మోసాలకు పాల్పడుతున్నాడు. ముఖ్యంగా సైబర్ నేరగాళ్లు ఏఐ టెక్నాలజీ సాయంతో దొంగతనాల బాటపట్టారు. అందుకు ఏఐ ఆధారిత డీప్ఫేక్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. తాజాగా ఏఐతో ముఖం ముర్చుకున్న ఓ సైబర్ నేరగాడు కేరళలోని ఓ వ్యక్తి నుంచి భారీ మొత్తంలో డబ్బు వసూలు చేశాడు. మోసపోయానని గ్రహించిన బాధితుడు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు.
అసలేం జరిగిందంటే..
కేరళలోని కోజికోడ్కు చెందిన రాధాకృష్ణన్కు గుర్తు తెలియని నంబర్ నుంచి వీడియో కాల్ వచ్చింది. వీడియో కాల్ లిఫ్ట్ చేయగా ఆంధ్రప్రదేశ్లోని అతని మాజీ సహోద్యోగి ముఖం కనిపించింది. కొలీగ్ కావడంతో అతను కూడా మాటకలిపాడు. మాటల మధ్యలో తెలివిగా వారి కామన్ ఫ్రెండ్స్ పేర్లను కూడా ప్రస్తావించాడు నేరగాడు. వీడియో కాల్లో కనిపించిన వ్యక్తిని పూర్తిగా నమ్మిన రాధాకృష్ణన్ వీడియో కాల్ను కొనసాగించాడు. ఆసుపత్రిలో తన బంధువు ఒకరు చికిత్స పొందుతున్నారని, తనకు రూ.40 వేలు అవసరమని అభ్యర్థించాడు. దీంతో స్నేహితుడికి సహాయం చేయాలనే ఉద్దేశ్యంతో రాధాకృష్ణన్ ఆ మొత్తాన్ని ఆన్లైన్లో పంపాడు. కొద్దిసేపటి తర్వాత అదే వ్యక్తి మరో రూ.35 వేలు అడిగాడు. దీంతో అనుమానం వచ్చిన రాధా కృష్ణన్ క్రాస్ చెక్ చేయడానికి అసలైన వ్యక్తికి ఫోన్ చేశాడు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేయగా మహారాష్ట్రలోని ఓ ప్రైవేట్ బ్యాంక్కు నుంచి లావాదేవీలు జరిపినట్లు తేలింది. అనంతరం బ్యాంకు అధికారులు ఖాతాను నిలిపివేశారు. స్కామర్లు ఏఐతో నకిలీ వీడియో కాల్స్ చేస్తున్నారని, కేరళలో ఈ తరహా మోసం మొదటిదని తెలిపారు. సోషల్ మీడియాలో షేర్ చేసే ఫొటోలు, సమాచారం ఆధారంగా ఇటువంటి నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఎవరైనా ఫోన్ చేస్తే అది అసలైందో కాదో ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవల్సిందిగా సూచించారు. ఎవరైనా ఇటువంటి మోసాలకు పాల్పడితే హెల్ప్లైన్ నంబర్ 1930 ద్వారా పోలీసులను సంప్రదించాలని కోరారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.