Nipah virus: కేరళలో నిఫా వైరస్ కలకలం.. 12 ఏళ్ల బాలుడు మృతి.. అప్రమత్తమైన ప్రభుత్వం..
Kerala boy dies due to nipah virus: కేరళలో ఓ వైపు కరోనావైరస్ విజృంభిస్తుండగా.. మరోవైపు నిఫా వైరస్ కలకలం సృష్టిస్తోంది. తాజాగా కోజికోడ్ జిల్లాలో నిఫా వైరస్ బారిన పడి 12 ఏళ్ల బాలుడు
Kerala boy dies due to nipah virus: కేరళలో ఓ వైపు కరోనావైరస్ విజృంభిస్తుండగా.. మరోవైపు నిఫా వైరస్ కలకలం సృష్టిస్తోంది. తాజాగా కోజికోడ్ జిల్లాలో నిఫా వైరస్ బారిన పడి 12 ఏళ్ల బాలుడు మరణించినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ ఆదివారం ప్రకటించారు. నిఫాతో శనివారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురైన బాలుడికి చికిత్స అందిస్తుండగా.. ఆదివారం ఉదయం 5 గంటల సమయంలో ప్రాణాలు కోల్పోయినట్లు ఆమె వివరించారు.
కాగా.. బాలుడి నమూనాలను ముందే పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్కి పంపారు. వాటిని పరిశీలించిన నిపుణులు.. ఆ బాలుడి శరీరంలో నిఫా వైరస్ ఉన్నట్లు గుర్తించారు. అయితే.. బాలుడితో కాంటాక్ట్ ఉన్న వారందరినీ గుర్తించే ప్రక్రియను గత రాత్రే ప్రారంభించామని మంత్రి పేర్కొన్నారు. వారందరినీ ఐసోలేషన్లోకి పంపేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నామని మీడియాకు వివరించారు. 30 మందిని ఇప్పటివరకు అబ్జర్వేషన్లో ఉంచినట్లు తెలిపారు.
ఇదిలాఉంటే.. నిఫా వైరస్ కలకలంతో కేంద్ర ప్రభుత్వంఅప్రమత్తమైంది. కేరళ ఆరోగ్య శాఖకు సహకారంగా కేంద్రం తరఫున ప్రత్యేక బృందాన్ని రాష్ట్రానికి పంపింది. ప్రస్తుతం ప్రత్యేక బృందం ఆధ్వర్యంలో పరిశీలన జరుగుతున్నట్లు వైద్య అధికారులు తెలిపారు. కాగా.. కేరళలో 2018 జూన్లో తొలిసారిగా నిఫా వైరస్ వెలుగులోకి వచ్చింది. మొత్తం 23 కేసులను నిర్ధారించారు. వీరిలో కేవలం ఇద్దరు మాత్రమే కోలుకున్నట్లు అధికారులు తెలిపారు.
2019లో ఒకరిలో నిఫా వైరస్ మరోసారి నిర్ధారణ అయ్యింది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం పటిష్ఠ చర్యలు తీసుకోవడంతో ఈ వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట పడింది. తాజాగా నిఫా వైరస్తో బాలుడు మరణించడంతో ప్రభుత్వం అప్రమత్తమై చర్యలు ప్రారంభించింది.
Also Read: