AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karnataka: కాంగ్రెస్ సర్కారుకు అగ్నిపరీక్షే.. 5 ఉచిత పథకాల అమలుకు ఎన్ని కోట్లు కావాలంటే..?

కర్ణాటకలో కాంగ్రెస్ విజయానికి పలు అంశాలు దోహదపడ్డాయి. అయితే మేనిఫెస్టోలో ప్రకటించిన ఐదు ఉచిత పథకాలు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ వైపు ఓటర్లను ఆకర్షితులు చేసింది. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత కరెంటు, ప్రతి కుటుంబంలోని ఒక మహిళలకు నెలకు రూ.2 వేలు..

Karnataka: కాంగ్రెస్ సర్కారుకు అగ్నిపరీక్షే.. 5 ఉచిత పథకాల అమలుకు ఎన్ని కోట్లు కావాలంటే..?
Karnataka Congress Manifesto
Janardhan Veluru
|

Updated on: May 16, 2023 | 12:04 PM

Share

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి మెజార్టీ సాధించిన కాంగ్రెస్.. అక్కడ కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సన్నద్ధమవుతోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై క్లారిటీ వస్తే మే 18న అక్కడ కొత్త ప్రభుత్వం కొలువుదీరే అవకాశముంది. కర్ణాటకలో కాంగ్రెస్ విజయానికి పలు అంశాలు దోహదపడ్డాయి. అయితే మేనిఫెస్టోలో ప్రకటించిన ఐదు ఉచిత పథకాలు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ వైపు ఓటర్లను ఆకర్షితులు చేసింది. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత కరెంటు, ప్రతి కుటుంబంలోని ఒక మహిళలకు నెలకు రూ.2 వేలు, బీపీఎల్ కుటుంబానికి చెందిన సభ్యులకు ఉచితంగా పది కిలోల బియ్యం, డిగ్రీ వరకు చదివిన నిరుద్యోగులకు రూ.3 వేల భృతి/డిప్లమో వరకు చదివిన నిరుద్యోగులకు రూ.1,500 భృతి, మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం వంటి హామీలు ఇచ్చింది కాంగ్రెస్.

కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఐదు ఉచిత పథకాలను అమలు చేసేందుకు భారీ మొత్తాన్ని ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ ఐదు ఉచిత పథకాలను నెరవేర్చేందుకు ఏటా దాదాపు రూ.40వేల కోట్లు వ్యయం అవుతుందని అంచనావేస్తున్నారు. దీంతో పాటు మత్స్యకారులకు ఉచితంగా 500 లీటర్ల డీజిల్ వంటి మరిన్ని ఉచిత పథకాలను కాంగ్రెస్ ప్రకటింది. వీటిని కూడా కలుపుకుంటే ప్రతి యేటా రూ.61,000 కోట్లకు పైగా వ్యయం కావొచ్చని అంచనావేస్తున్నారు.

కర్ణాటకలో ప్రస్తుతం 1.17 కోట్ల మంది బీపీఎల్ రేషన్ కార్డుదారులు ఉన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 10 కేజీల ఉచిత బియ్యం హామీని నెరవేర్చాలంటే ఇప్పుడు చేస్తున్న వ్యయానికి అదనంగా ఏటా రూ.21,450 కోట్లు వెచ్చించాల్సి వస్తుంది. అలాగే ప్రస్తుతం కర్ణాటకలో 1.8 కోట్ల కుటుంబాలు 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వాడుతున్నారు. ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేసేందుకు ఏటా రూ.7,000 – రూ.8,000 కోట్ల వరకు వ్యయం చేయాల్సి ఉంటుందని అంచనావేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

అలాగే గ్రాడ్యుయేట్, డిప్లమో చదివిన నిరుద్యోగులకు భృతి ఇచ్చేందుకు మొదటి సంవత్సరం రూ.1000 కోట్లు, రెండో సంవత్సరం నుంచి రూ.2000 కోట్లు వ్యయం చేయాల్సి ఉంటుంది. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తే దాదాపు రూ.800 కోట్ల ఆదాయాన్ని ఆర్టీసీ కోల్పోవాల్సి ఉంటుంది. ఈ సబ్సిడీ మొత్తాన్ని ఆర్టీసీకి ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించాల్సి ఉంటుంది. కర్ణాటకలో ప్రస్తుతం 1.3 కోట్ల కుటుంబాలు ఉండగా.. ప్రతి కుటుంబంలోని ఓ మహిళకు రూ.2 వేల చెల్లిస్తే ఏటా రూ. 32 వేల కోట్లు వ్యయం కావొచ్చని అంచనావేస్తున్నారు.

మిగిలిన ఉచితాలను కూడా కలుపుకుని వీటి కోసం ప్రభుత్వం మొత్తం రూ.61,000 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. మరి అక్కడ ఏర్పాటుకానున్న కొత్త ప్రభుత్వం ఉచిత పథకాల అమలుకు అవసరమైన నిధులను సమకూర్చుకోవడం పెద్ద సవాలుగా మారనుంది. ఇప్పటికే ఆ రాష్ట్రంలో పన్నులు గరిష్ఠ స్థాయిలో ఉన్నాయి. కొత్త నిధుల కోసం ప్రభుత్వం ఏం చేయబోతుందన్నది ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నే.

మరిన్ని జాతీయ వార్తలు చదవండి..