Bharatiya Janata Party: హిమాచల్ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న బీజేపీ అధినాయకత్వం.. కీలక నేతలకు ఉద్వాసన.. ద్విముఖ వ్యూహంతో చర్యలు
హిమాచల్ ప్రదేశ్ బీజేపీ మూడు వర్గాలుగా విడిపోయినట్లు కనిపిస్తోంది. ఒకవైపు సిట్టింగ్ సీఎం జయరాం ఠాకూర్, ఇంకోవైపు జేపీ నడ్డా, మరోవైపు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్...
గుజరాత్ ఎన్నికల్లో లభించిన ఘనవిజయం సంగతేమో గానీ హిమాచల్ ప్రదేశ్ ఓటమే భారతీయ జనతా పార్టీలో భారీ కుదుపునకు దారితీసేలా కనిపిస్తోంది. త్వరలోనే సమూల మార్పులకు బీజేపీ అధినేతలు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్. అక్కడ వరుసగా రెండోసారి విజయం సాధించడం ద్వారా బీజేపీ అధినేతగా రెండో విడత ఎక్స్టెన్షన్ పొందాలని అనుకున్న నడ్డాకు అక్కడి ఓటమి అశనిపాతమైంది. 2024 సార్వత్రిక ఎన్నికలు కూడా తన సారథ్యంలోనే బీజేపీ ఎదుర్కోవాలని భావించిన నడ్డాకు ఇపుడు పదవీ వియోగం తప్పేలా లేదు. అందుకు కారణం హిమాచల్ ప్రదేశ్ ఓటమికి కారణమైన రెబల్స్ నడ్డా వల్లే పుట్టుకు వచ్చారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా భావిస్తూ వుండడమేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గుజరాత్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో అవలంభించిన వ్యూహానికి భిన్నంగా హిమాచల్ ప్రదేశ్ బీజేపీ అధినాయకత్వం వ్యవహరించింది. గుజరాత్లో ఏడాది ముందు, ఉత్తరాఖండ్లో ఆరు నెలల ముందు ముఖ్యమంత్రులను మార్చడం ద్వారా అక్కడ సానుకూల ఫలితాలను బీజేపీ పొందగలిగింది. కానీ హిమాచల్ ప్రదేశ్లో మాత్రం సీఎంను మార్చకుండానే ఆయనపై విశ్వాసంతో ఎన్నికలను ఎదుర్కొంది.
రెబల్స్ పుణ్యం ఆయనదే
నిజానికి జేపీ నడ్డా పదవీకాలం 2023 జనవరి నెలతో ముగియవలసి ఉన్నది. కానీ, ఆయనకు రెండో విడత అవకాశం ఇవ్వడం ద్వారా వచ్చే సార్వత్రిక ఎన్నికలను ఆయన సారధ్యంలోనే ఎదుర్కోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా గతంలో భావించారు. కానీ జేపీ నడ్డా హిమాచల్ ప్రదేశ్ విషయంలో అనుసరించిన స్వార్థ విధానాలతో ఇప్పుడు ఆయన పదవీకాలం జనవరితో ముగియడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. తాను రాష్ట్రస్థాయి రాజకీయాలలో ఉన్నప్పుడు పార్టీలో తనకు ప్రత్యర్థిగా భావించిన మాజీ ముఖ్యమంత్రి ప్రేమ్ కుమార్ ధుమాల్ వర్గాన్ని తాజా ఎన్నికలలో ఉద్దేశపూర్వకంగానే నడ్డా పక్కన పెట్టినట్లు బిజెపి అధినేతలు గుర్తించారు. ప్రేమ్ కుమార్ ధుమాల్ వర్గాన్ని పక్కన పెట్టడం వల్లనే దాదాపు 21 మంది బిజెపి టికెట్లు ఆశించి భంగపడిన వారు రెబెల్స్ గా బరిలోకి దిగడం బిజెపి ఓటమికి కారణమైందని మోదీ, అమిత్ షా అనుమానిస్తున్నారు. ఈ కారణంగానే నడ్డాకు రెండో విడత అధ్యక్ష బాధ్యతలను కట్టబెట్టే ఆలోచన నుంచి విరమించుకున్నట్లు తెలుస్తోంది. జనవరి 2023లో నడ్డా పదవీకాలం ముగియగానే బిజెపి జాతీయ అధ్యక్ష బాధ్యతలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అత్యంత సన్నిహితుడని భావిస్తున్న హర్యానా ముఖ్యమంత్రి మనోహర్లాల్ ఖట్టర్ కు అప్పగించనున్నట్లు బిజెపి శ్రేణుల్లో పెద్ద ఎత్తున చర్చలు మొదలయ్యాయి. 2023 జనవరి 20వ తేదీన జేపీ నడ్డా తన మూడేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకోబోతున్నారు. అయితే పదవీకాలం పూర్తయిన తర్వాతనా? లేక తక్షణమే హిమాచల్ ప్రదేశ్ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పదవి నుంచి తప్పుకోవాల్సిందిగా నడ్డాను కోరతారా అన్నది తేలాల్సి ఉంది. జాతీయ అధ్యక్షుని హోదాలో పెద్దన్న పాత్ర పోషించాల్సిన నడ్డా తన చిరకాల ప్రత్యర్థి పట్ల వివక్షతతో కూడిన వ్యవహార శైలిని అవలంబించి, ఆయన వర్గానికి టికెట్లు నిరాకరించడం వల్లనే హిమాచల్ ప్రదేశ్లో ఓటమి చెందామని మోదీ భావిస్తున్నారు. 68 మంది సభ్యులున్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో ఇద్దర, ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ మారితేనే ప్రభుత్వాలు పడిపోయే అవకాశాలుంటాయి. అలాంటి పరిస్థితిలో ఏకంగా 21 మంది నేతలకు టిక్కెట్లు నిరాకరించడం, వారంతా రెబల్స్గా బరిలోకి దిగడం నష్టం చేకూర్చిందని బీజేపీ అధినాయకత్వం భావిస్తోంది.
హిమాచల్ బీజేపీ మూడుముక్కలు!
రెబెల్స్గా బరిలోకి దిగిన వారిలో ఎక్కువ శాతం ప్రేమ్ కుమార్ ధమాల్ వర్గానికి చెందినవారు. తన వర్గం వారిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్న సందేశాన్ని ప్రేమ్ కుమార్ బిజెపి అగ్ర నాయకత్వానికి, ఆర్ఎస్ఎస్ అధినాయకత్వానికి చేరవేయడమే ఇప్పుడు నడ్డా పదవి వియోగానికి దారితీస్తున్నట్లు తెలుస్తుంది. నడ్డా అనుసరించిన విధానాల కారణంగా అటు ఆయన వర్గం, ఇటు ఆయన ప్రత్యర్థి ప్రేమ్ కుమార్ ధుమాల్ వర్గం మధ్య వైరం పెరిగిపోయింది ఒకరి వర్గాన్ని మరొకరు ఓడించేందుకు చాపకింద నీరులా ప్రయత్నాలు చేయడమే హిమాచల్ ప్రదేశ్ లో పార్టీ ఓటమికి కారణమని బిజెపి అగ్ర నేతలు భావిస్తున్నారు. నడ్డా సొంత ప్రాంతం అయినా బిలాస్పూర్లో బిజెపి చావుతప్పి కన్ను లొట్టబోయినట్లు కేవలం 3 సీట్లలో అత్యంత స్వల్ప మెజారిటీతో గట్టెక్కింది. ఇంకోవైపు ధూమల్ తనయుడు, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రాతినిథ్యం వహిస్తున్న హమీర్పూర్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని మొత్తం 17 అసెంబ్లీ స్థానాలలో బిజెపి కేవలం నాలుగు చోట్ల మాత్రమే విజయం సాధించింది. 13 స్థానాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతో పాటు బిజెపి రెబల్స్ విజయం సాధించారు. హిమాచల్ ప్రదేశ్ బీజేపీ మూడు వర్గాలుగా విడిపోయినట్లు కనిపిస్తోంది. ఒకవైపు సిట్టింగ్ సీఎం జయరాం ఠాకూర్, ఇంకోవైపు నడ్డా, మరోవైపు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ (ప్రేమ్ కుమార్ ధుమాల్) ఎవరికి వారు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం పనిచేయడం పార్టీకి పెద్ద ఎత్తున నష్టం చేకూర్చిందని బిజెపి పెద్దలు అంచనాకు వచ్చారు. బిజెపి టికెట్ ఆశించి భంగపడిన వారు బరిలోకి దిగడమే బిజెపి ఓట్లను గణనీయంగా చీల్చిందని వారు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వంలో అంతర్మధనం మొదలయ్యింది. ఇలాంటి వర్గ విభేదాలను ఆదిలోనే తుంచి వేయకపోతే అది 2024 సార్వత్రిక ఎన్నికల నాటికి మరింత ముదిరి పార్టీ ప్రయోజనాలను విపరీత స్థాయిలో దెబ్బ కొడుతుందని వారంతా భయపడుతున్నారు. ఈ వర్గ విభేదాలను ఆదిలోనే తుంచి వేయాలంటే నడ్డాపై చర్య తీసుకోవడం ద్వారా పార్టీ శ్రేణులకు నాయకులకు ఒక క్లియర్ కట్ సందేశాన్ని పంపాలని మోదీ, అమిత్ షా భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే నడ్డాను జాతీయ అధ్యక్ష పదవి నుంచి తప్పించి ఆయన స్థానంలో హర్యానా ముఖ్యమంత్రి, మోదీకి అత్యంత సన్నిహితుడు అయిన మనోహర్ లాల్ ఖట్టర్ను జాతీయ అధ్యక్షుడిగా నియమించాలని దాదాపు తుది నిర్ణయానికి వచ్చినట్లు బిజెపి విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
ఎవరి మనోహర్ లాల్ ఖట్టర్?
మనోహర్ లాల్ ఖట్టర్ హర్యానాలో కీలకమైన బిజెపి నేత. గత ఎనిమిది సంవత్సరాలుగా ఆయన హర్యానా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఆర్ఎస్ఎస్ ప్రచారక్గా ఉన్నప్పటి నుంచి నరేంద్ర మోదీకి అత్యంత విశ్వసనీయమైన మిత్రునిగా మనోహర్ లాల్ ఖట్టర్కు పేరుంది. ఇద్దరూ ఆర్ఎస్ఎస్ ప్రచారకులుగా ఒకే సమయంలో పనిచేయడం వారిద్దరి మధ్య సాన్నిహిత్యానికి కారణమని బిజెపి శ్రేణులు చెప్పుకుంటారు. అయితే ఆయనకు బిజెపి జాతీయ అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం వెనుక మరొక వ్యూహం కూడా ఉన్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఉత్తరాఖండ్, గుజరాత్ రాష్ట్రాలలో మాదిరిగానే హర్యానా ముఖ్యమంత్రిపై ఎంతో కొంత అసంతృప్తి ఉంటే అది వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పెను ప్రభావం చూపించే ప్రమాదం ఉందన్న ఉద్దేశంతో మనోహర్ లాల్ కు జాతీయ బాధ్యతలు అప్పగించడం పేరిట అక్కడ ముఖ్యమంత్రిని మార్చవచ్చని మోదీ, షా వ్యూహరచన చేసినట్లు తెలుస్తోంది. అంటే ఒక నిర్ణయంతో రెండు ప్రయోజనాలను నెరవేర్చుకునే సంకల్పాన్ని మోదీ, అమిత్ షా చేపట్టినట్లు భావించవచ్చు. హర్యానాలో ముఖ్యమంత్రిని మార్చడం ద్వారా వచ్చే ఎన్నికలలో పార్టీ విజయవకాశాలను మెరుగుపరుచుకోవడం ఒక ప్రయోజనం అయితే, వర్గ విభేదాలను పెంచి పోషించిన నడ్డాను పంపించడం ద్వారా అలాంటి కార్యకలాపాలను బిజెపి అధినాయకత్వం ఎంత మాత్రం సహించదు అన్న సందేశాన్ని పార్టీ శ్రేణులకు పంపించడం రెండో ప్రయోజనం. హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 20 నెలల సమయం ఉన్నప్పటికీ ఇప్పటినుంచే ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించేందుకు మనోహర్ లాల్ ఖట్టర్ను తప్పించి కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేయడం అత్యంత అవసరమని మోదీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి 2019 అక్టోబర్ నెలలో జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 90 స్థానాలకుగాను బిజెపి 41 స్థానాలు మాత్రమే గెలిచింది. మెజారిటీ మేజిక్ మార్కుకు కాస్త దూరంలోనే ఉండిపోయింది. ఈ సమయంలో దివంగత రాజకీయ దిగ్గజం ఓం ప్రకాష్ చౌతలా తనయుడు దుష్యంత్ చౌతాలా సారథ్యంలోని జననాయక్ జనతా పార్టీతో కలిసి ఖట్టర్ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఖట్టర్ సారధ్యంలో బిజెపి పూర్తి మెజారిటీ సాధించలేకపోయినప్పటికీ, ప్రధాని మోదీకి అత్యంత సన్నిహితుడైనందునే ఆయనకు రెండోసారి ముఖ్యమంత్రి పదవి దక్కినట్లు బిజెపి శ్రేణులు చెప్పుకుంటున్నాయి. రెండు ప్రయోజనాలను సాధించే ఉద్దేశంతో పాటు 2024 నాటికి బిజెపి అవకాశాలను మెరుగుపరుచుకునే వ్యూహంతో నడ్డా పై వేటు మనోహర్ లాల్ ఖట్టర్కు అవకాశం లభించనున్నట్లు తెలుస్తోంది.