Viral: మందెక్కువై పామును కసా కసా కొరికి తినేశాడు.. ఆ తర్వాత..
ఉత్తరప్రదేశ్లోని బండా జిల్లాలో ఓ యువకుడు మద్యం మత్తులో పామును నోటితో కొరికి తినేశాడు. హర్దౌలి గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికులను షాక్కు గురి చేసింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా... అతని పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు.

ఉత్తరప్రదేశ్లోని బండా జిల్లాలో ఆశ్చర్యం కలిగించే ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఓ యువకుడు పామును కొరికి తినేశాడు. ఈ ఘటన బాబేరు పోలీస్ స్టేషన్ పరిధిలోని హర్దౌలి గ్రామంలో జరిగింది. స్థానికంగా నివసించే 35 ఏళ్ల అశోక్ మద్యం సేవించి ఇంట్లో ఉన్న సమయంలో అకస్మాత్తుగా ఇంట్లోకి వచ్చిన పామును చూసాడు. అప్పటికే మత్తులో ఉన్న అతను ఏ మాత్రం ఆలోచించకుండా ఆ పామును పట్టుకొని నోటికి తీసుకుని కొరికి తినేశాడు. ఈ దృశ్యం చూసిన అతని తల్లి ఒక్కసారిగా కేకలు వేసింది. వెంటనే ఇతర కుటుంబ సభ్యులు వచ్చి అశోక్ను అడ్డుకున్నారు.
అతనికి నీళ్లు తాగించడంతో పాటు నోటిలో ఉన్న పాము ముక్కలను తీసేశారు. అనంతరం అతన్ని తక్షణమే బాబేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. అశోక్ పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉందని వైద్యులు వెల్లడించారు. తిన్న పాము విషపూరితమైనది కాకపోవడం వల్ల అతను ప్రాణాపాయానికి చేరకపోయినట్టు తెలిపారు.
ఈ సంఘటన గ్రామంలో తెగ చర్చకు దారి తీసింది. వైద్యుల పర్యవేక్షణలో ప్రస్తుతం అశోక్ చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం గురించి పోలీసులు ఆరా తీశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
