AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చత్తీస్‌గఢ్ టూ రాజస్థాన్ వయా తెలంగాణ.. బీజేపీయేతర రాష్ట్రాల్లో ప్రధాని మోదీ వరుస పర్యటన..

Narendra Modi: ఉత్తర్ ప్రదేశ్ మినహా బీజేపీ అధికారంలో లేని మూడు రాష్ట్రాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వరుసగా పర్యటిస్తున్నారు. తన పర్యటనలో భాగంగా ఆయన అనేక అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నారు. శుక్రవారం చత్తీస్‌గఢ్ వెళ్లిన ఆయన అక్కడ రూ. 7,600 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు..

చత్తీస్‌గఢ్ టూ రాజస్థాన్ వయా తెలంగాణ.. బీజేపీయేతర రాష్ట్రాల్లో ప్రధాని మోదీ వరుస పర్యటన..
Narendra Modi
Mahatma Kodiyar
| Edited By: శివలీల గోపి తుల్వా|

Updated on: Jul 08, 2023 | 10:56 AM

Share

Narendra Modi: ఉత్తర్ ప్రదేశ్ మినహా బీజేపీ అధికారంలో లేని మూడు రాష్ట్రాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వరుసగా పర్యటిస్తున్నారు. తన పర్యటనలో భాగంగా ఆయన అనేక అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నారు. శుక్రవారం చత్తీస్‌గఢ్ వెళ్లిన ఆయన అక్కడ రూ. 7,600 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. చత్తీస్‌గఢ్ నుంచి ఉత్తర్‌ప్రదేశ్ గోరఖ్‌పూర్ వెళ్లిన ఆయన అక్కడ రెండు వందే భారత్ రైళ్ల ప్రారంభోత్సవం సహా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శనివారం తెలంగాణ, రాజస్థాన్ రాష్ట్రాల పర్యటన చేపట్టిన ఆయన ఉదయం వరంగల్ చేరుకున్నారు. కాజీపేటలో రైల్వే వ్యాగన్ల తయారీ ఫ్యాక్టరీకి భూమిపూజతో పాటు పలు ఇతర అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. తెలంగాణ పర్యటనను మధ్యాహ్నంతో ముగించుకుని నేరుగా రాజస్థాన్ చేరుకోనున్నారు.

బికనీర్‌లో అనేక ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో అమృత్‌సర్-జామ్‌నగర్ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే కూడా ఉంది. ఇంకా వందేభారత్ రైలుకు పచ్చ జెండా ఊపి ప్రారంభిస్తారు. అనంతరం నౌరంగ్‌దేసర్‌లో జరిగే బహిరంగ సభలో కూడా ప్రధాని ప్రసంగిస్తారు. ఎక్స్‌ప్రెస్‌వే నాలుగు రాష్ట్రాల అభివృద్ధికి కొత్త శక్తిని ఇస్తుందని పేర్కొంటూ ప్రధాని మోదీ బికనీర్ పర్యటనకు ముందు ట్వీట్ చేశారు. అంతకంటే ముందు తెలంగాణ ప్రాజెక్టుల గురించి వివరిస్తూ రూ. 6,100 కోట్ల అభివృధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనల చేసేందుకు వరంగల్ బయలుదేరాను అంటూ ట్వీట్ చేశారు. ఈ ప్రాజెక్టుల వల్ల తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుంది’ అంటూ ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.

రాజస్థాన్‌లో రూ. 25 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు

ఇవి కూడా చదవండి

రాజస్థాన్ పర్యటనలో ప్రధాని మోదీ రూ. 25 వేల కోట్ల విలువైన పనులను ప్రారంభించి, భూమిపూజ చేయనున్నారు. ఇందులో భారతమాల, ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన, వందే భారత్ రైలు వంటివి ఉన్నాయి. గ్రీన్ ఎనర్జీ కారిడార్ అనేది కేంద్ర ప్రభుత్వ ముఖ్యమైన పథకాలలో ఒకటి. సౌర విద్యుత్తు ఉత్పత్తికి అపారమైన అవకాశాలున్న రాజస్థాన్‌లో వీటిని వరుసగా నెలకొల్పడం ద్వారా హర్యానా సరిద్దుల్లో ఉన్న భివాడి వరకు సౌర విద్యుత్తు ప్రజలకు అందుబాటులోకి రానుంది. మరోవైపు రూ. 41 కోట్ల వ్యయంతో కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ నిర్మించిన 100 పడకల ఆసుపత్రిని కూడా ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.

ఇంకా రైసింగ్‌నగర్‌-అనూప్‌గఢ్‌-పుగల్‌, ఖాజువాలా-పుగల్‌-బాప్‌ రోడ్డు ప్రాజెక్టుల ప్రారంభోత్సవంతో పాటు రూ. 500 కోట్లతో బికనీర్‌ రైల్వే స్టేషన్‌ పునరుద్ధరణ పనులకు కూడా శంకుస్థాపన చేస్తారు. శనివారం తెలంగాణలోని వరంగల్ సభ ముగించుకున్న తర్వాత మధ్యాహ్నం 3.30 గంటలకు బికనీర్‌లోని నల్ విమానాశ్రయానికి ప్రధాని చేరుకుంటారు. అక్కడికి సమీపంలోని గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే టోల్ ప్లాజా దగ్గర ప్రధానమంత్రి వివిధ ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. సాయంత్రం 5 గంటలకు బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం ఆయన తిరిగి ఢిల్లీకి చేరుకుంటారు.

-మహాత్మా కోడియార్, టీవీ9 తెలుగు, న్యూఢిల్లీ

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..