Rah Veer Scheme: కేంద్ర ప్రభుత్వం మరో కొత్త పథకం.. ప్రతీఒక్కరికి రూ.లక్ష వరకు ఆర్ధిక సాయం.. మీరూ పొందాలంటే..?
రోడ్డు ప్రమాద సమయంలో బాధితులను ఆస్పత్రికి తరలించి ప్రాణాలను కాపాడారా..? మీరు వెంటనే ఆస్పత్రికి తరలించడం వల్ల బాధితుడు ప్రాణపాయ స్థితి నుంచి బయటపడ్డారా..? అయితే మీకు కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.లక్ష వరకు ప్రోత్సాహకం పొందే అవకాశముంది. ఈ పథకం వివరాలు ఇప్పుడు చూద్దాం.

దేశంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. ప్రపంచంలో రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ మరణాలు జరుగుతున్న దేశాల్లో భారత్ తొలి స్థానంలో ఉన్నట్లు అధికారిక గణాంకాలు సూచిస్తున్నాయి. జాతీయ రహదారులతో పాటు రాష్ట్ర రహదారుల్లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వీటి వల్ల వేల మంది మరణిస్తుండగా.. మరికొంతమంది క్షతగాత్రులుగా మిగులుతున్నారు. దీంతో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు విధించే జరిమానాలను పెంచడంతో పాటు ఓవర్ స్పీడ్, డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడినవారికి కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు ఎక్కవసార్లు దొరికితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు వంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది.
వారికి రూ.25 వేల సాయం
రోడ్డు ప్రమాదాల సమయంలో మరణాలను తగ్గించేందుకు కేంద్రం చర్యలు చేపడుతుంది. అందులో భాగంగా రహదారుల వెంట ట్రామా సెంటర్ల ఏర్పాటుతో పాటు ఆస్పత్రుల్లో ఉచిత క్యాష్లెస్ ట్రీట్మెంట్ వంటి సౌకర్యాలు కల్పిస్తోంది. ఈ క్రమంలో రోడ్డు ప్రమాద మరణాలను తగ్గించేందుకు మరో స్కీమ్ కూడా అమలు చేస్తోంది. అదే రహ్-వీర్ పథకం. ఈ పథకం ద్వారా రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు బాధితులను వెంటనే ఆస్పత్రికి తరలించి ప్రాణాలను కాపాడినవారికి సాయం అందిస్తోంది. రోడ్డు ప్రమాదం సమయంలో గోల్డెన్ అవర్లో బాధితులను ఆస్పత్రికి తరలిస్తే ప్రాణాపాయం నుంచి తప్పించవచ్చు. దీంతో బాధితులను కాపాడినవారికి రూ.25 వేల చొప్పున ఆర్ధిక సాయం అందిస్తోంది. కేంద్ర రవాణ, హైవే మంత్రిత్వశాఖ ఈ పథకాన్ని అమలు చేస్తోంది. నగదు సాయంతో పాటు ప్రశంసాపత్రం కూడా అందిస్తారు. రోడ్డు ప్రమాదంలో బాధితులను కాపాడేలా ప్రజలను ప్రోత్సహించేందుకు ఈ పథకాన్ని కేంద్రం అమలు చేస్తోంది.
వారికి ఏకంగా రూ.లక్ష
ఇక దేశవ్యాప్తంగా ప్రతీ ఏటా బాధితులను కాపాడినవారిలో 10 మందిని రహ్-వీర్లను ఎంపిక చేస్తారు. వీరికి ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున అందిస్తారు. అలాగే వీరికి సర్టిఫికేట్తో పాటు ట్రోపీ ఇస్తారు. ఇక ప్రాణాలు కాపాడిన వ్యక్తులను పోలీసులు, ఆస్పత్రి డాక్టర్లు గుర్తిస్తారు. కలెక్టర్ల ఆధ్వర్యంలోని కమిటీ ప్రతీనెలా వీరిని ఎంపిక చేసి రాష్ట్ర కమిటీని పంపిస్తుంది. రాష్ట్ర కమిటీ ఎంపిక చేశాక లబ్దిదారుల బ్యాంకు అకౌంట్లోకి ప్రోత్సాహక సాయాన్ని విడుదల చేస్తారు. కాగా ఈ పథకం గురించి చాలామందికి అవగాహన ఉండదు లేదు. దీంతో ప్రజల్లో అవగాహన కల్పించి రోడ్డు ప్రమాద మరణాలను తగ్గించేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది.
