BBC documentary on PM Modi: ప్రధాని మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ వివాదం.. తప్పుబట్టిన మాజీ న్యాయమూర్తులు..

భారత ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి బీబీసీ తీసిన డాక్యుమెంటరీ సిరీస్‌ కలకలం సృష్టిస్తోంది.  మాజీ న్యాయమూర్తులు, పదవీ విరమణ చేసిన ఉన్నతాధికారులు, సైనికాధికారులు.. బీబీసీ డాక్యుమెంటరీ ను 'భ్రాంతికరమైన రిపోర్టింగ్'

BBC documentary on PM Modi: ప్రధాని మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ వివాదం.. తప్పుబట్టిన మాజీ న్యాయమూర్తులు..
Pm Modi
Follow us

|

Updated on: Jan 21, 2023 | 5:54 PM

భారత ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి బీబీసీ తీసిన డాక్యుమెంటరీ సిరీస్‌ కలకలం సృష్టిస్తోంది.  మాజీ న్యాయమూర్తులు, పదవీ విరమణ చేసిన ఉన్నతాధికారులు, సైనికాధికారులు.. బీబీసీ డాక్యుమెంటరీ ను ‘భ్రాంతికరమైన రిపోర్టింగ్’ అని అభివర్ణించారు.  మొత్తం 302 మంది ప్రముఖులు బీబీసీ డాక్యుమెంటరీని ఖండిస్తూ ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. వారిలో 13 మంది రిటైర్డ్ న్యాయమూర్తులు, 133 మంది రిటైర్డ్ బ్యూరోక్రాట్‌లు, 33 మంది మాజీ దౌత్యవేత్తలు, 156 రిటైర్డ్ సాయుధ దళాల అధికారులు ఉన్నారు. బీబీసీ వెబ్ సిరీస్ ను ఖండిస్తూ రాసిన ఉమ్మడి లేఖలోర రాజస్థాన్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అనిల్ దియో సింగ్, క్యాట్ ఛైర్మన్ ప్రమోద్ కోహ్లీ, ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఎస్.ఎన్.ధింగ్రా, తెలంగాణ హైకోర్టు మాజీ న్యాయమూర్తి బి.శివశంకర్ రావు, రక్షణ శాఖ మాజీ కార్యదర్శి యోగేంద్ర నారాయణ్, విదేశాంగ మాజీ కార్యదర్శి శశాంక్, హోంశాఖ మాజీ కార్యదర్శి ఎల్.సీ.గోయెల్, రా మాజీ చీఫ్ సంజీవ్ త్రిపాఠి తదితరులు ఉన్నారు. 

 బీబీసీ  వెబ్ సిరీస్ పై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. “ఇండియా: ది మోడీ క్వశ్చన్” ఎపిసోడ్ ను షేర్ చేస్తున్న యూట్యూబ్ వీడియోలను బ్లాక్ చేస్తూ సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఆదేశాలు జారీ చేసింది. యూట్యూబ్ వీడియోలతో పాటు, లింక్‌లను కలిగి ఉన్న 50 కి పైగా ట్వీట్లను బ్లాక్ చేయాలని కేంద్రం ట్విట్టర్‌ను ఆదేశించింది.

ఐటీ నిబంధనలు, 2021 ప్రకారం అత్యవసర అధికారాలను ఉపయోగించి సమాచార, ప్రసార కార్యదర్శి శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ డాక్యుమెంటరీ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేలా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. విదేశీ రాష్ట్రాలతో భారత స్నేహపూర్వక సంబంధాలను ప్రతికూలంగా ప్రభావితం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని అధికార వర్గాలు అభిప్రాయపడ్డాయి. విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై రూపొందించిన డాక్యుమెంటరీని తప్పుబట్టింది. అపఖ్యాతి పాలైన కథనాన్ని ముందుకు తీసుకురావడానికి రూపొందించిన ప్రచార భాగమని ఆగ్రహం వ్యక్తం చేసింది.

అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ..”ఇండియా: ది మోడీ క్వశ్చన్” పేరిట తీసిన సిరీస్‌ ను కేంద్రం తప్పుబట్టింది. ఈ సిరీస్‌లో 2002 గుజరాత్‌ అల్లర్ల ఘటనకు సంబంధించి ప్రస్తావన ఉంది. 2002 గుజరాత్‌ అల్లర్ల కేసులో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న మోదీ ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆయనకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవంటూ సుప్రీంకోర్టు కూడా క్లీన్ చిట్ ఇచ్చింది. అయితే.. బీబీసీ మాత్రం అందుకు విరుద్ధంగా సిరీస్ లో ఘటనలు పొందుపరచడం కేంద్రం ఆగ్రహానికి కారణమైంది.

మరోవైపు.. దాయాది దేశం పాకిస్తాన్.. భారత ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల వర్షం కురిపించింది. మోదీ నాయకత్వంలో భారత్ అంతర్జాతీయ స్థాయిలో తనదైన ముద్ర వేసుకుంటోందని పాకిస్తాన్ దిన పత్రిక ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ తాజాగా కీర్తించింది. మోదీ తన నైపుణ్యంతో భారత జీడీపీ 3 ట్రిలియన్ డాలర్లకు పెంచారని ట్రిబ్యూన్ కథనంలో షహజాద్ చౌధరీ ప్రస్తావించారు. మోదీ విదేశాంగ విధానాలు అబ్బురపరుస్తున్నాయని, వ్యవసాయ ఉత్పత్తులు రికార్డు స్థాయిలో అత్యుత్తమ స్థాయికి పెరిగాయని, ఐటీ పరిశ్రమ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో విస్తరించిందని కొనియాడారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..