Covid Vaccination: కరోనా వ్యాక్సిన్ తీసుకునేందుకు ఆధార్ అవసరం లేదు.. స్పష్టంచేసిన కేంద్రం..
Aadhaar Not Mandatory For Covid Vaccination: కరోనా వ్యాక్సిన్ కోసం కోవిన్ పోర్టల్ (CO-WIN) లో నమోదు చేసుకునేందుకు ఆధార్ వివరాలు సమర్పించడం తప్పనిసరి కాదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెల్లడించింది.
Aadhaar Not Mandatory For Covid Vaccination: కరోనా వ్యాక్సిన్ కోసం కోవిన్ పోర్టల్ (CO-WIN) లో నమోదు చేసుకునేందుకు ఆధార్ వివరాలు సమర్పించడం తప్పనిసరి కాదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. దీనిపై సోమవారం విచారించిన సర్వోన్నత న్యాయస్థానం.. కరోనా వ్యాక్సిన్ తీసుకునేందుకు వచ్చిన ప్రజలను ఆధార్ (Aadhaar) కావాలంటూ పట్టుబట్టవద్దని స్పష్టం చేసింది. కోవిన్ పోర్టల్లో, పలు వ్యాక్సినేషన్ (Covid Vaccination) కేంద్రాల్లోనూ ఆధార్ కార్డు కచ్చితంగా ఉండాలని చెబుతున్నారని ఫిర్యాదు చేస్తూ సిద్ధార్థ్ శంకర్ శర్మ అనే వ్యక్తి గతేడాది సుప్రీం కోర్టులో పిల్ను దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్లతో కూడిన ధర్మాసనం.. పిల్ను సోమవారం విచారించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (MoHFW) పిటిషన్లో అఫిడవిట్ను పరిశీలించింది.
CO-WIN పోర్టల్లో నమోదు చేయడానికి ఆధార్ కార్డ్ తప్పనిసరి కాదని, తొమ్మిది పత్రాలలో ఏదైనా ఒకదానిని సమర్పించవచ్చని కేంద్రం పేర్కొంది. ఆధార్ వ్యాక్సినేషన్ తీసుకోవడానికి తప్పనిసరి కాదంటూ అఫిడవిట్లో పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ అఫిడవిట్ ప్రకారం.. ఆధార్ వివరాల నమోదు తప్పనిసరి కాదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. సంబంధిత అధికారులందరూ ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల అనుగుణంగా వ్యవహరిస్తారని ఆశిస్తున్నట్లు బెంచ్ పేర్కొంది. మంత్రిత్వ శాఖ తరపున వాదించిన న్యాయవాది అమన్ శర్మ, ఆధార్ ముందస్తు షరతు కాదని, ఎటువంటి గుర్తింపు కార్డు లేని 87 లక్షల మందికి టీకాలు వేసినట్లు ధర్మాసనానికి తెలిపారు.
ఈ సందర్భంగా న్యాయస్థానం స్పందిస్తూ.. CO-WIN పోర్టల్ను తగిన సాఫ్ట్వేర్/సాంకేతిక పరిజ్ఞానంతో యూజర్ ఫ్రెండ్లీగా అప్డేట్ చేయాలని కోరింది. సులభంగా ఉపయోగించేలా పౌరులందరికీ అందుబాటులో ఉండేలా చూడాలని కేంద్రాన్ని ధార్మాసనం సూచించింది. COVID-19 వ్యాక్సినేషన్ను నిర్వహించే క్రమంలో అధికారులు ఆధార్ కార్డును మాత్రమే గుర్తింపు రుజువుగా అందించాలని పట్టుబట్టకూడదంటూ ధర్మాసనం తీర్పును వెల్లడించింది.
Also Read: