రఫేల్పై రివ్యూ పిటిషన్లను పరిశీలిస్తాం: సుప్రీం
రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందంలో కేంద్ర ప్రభుత్వానికి క్లీన్చిట్ ఇస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ దాఖలైన రివ్యూ పిటిషన్లపై తక్షణ విచారణ చేపట్టే అంశాన్ని పరిశీలిస్తామని సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది.
దిల్లీ: రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందంలో కేంద్ర ప్రభుత్వానికి క్లీన్చిట్ ఇస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ దాఖలైన రివ్యూ పిటిషన్లపై తక్షణ విచారణ చేపట్టే అంశాన్ని పరిశీలిస్తామని సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం స్పష్టం చేసింది. రఫేల్ తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్లపై తక్షణ విచారణ చేపట్టాలని సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ న్యాయస్థానాన్ని కోరారు. దీనిపై చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ స్పందిస్తూ.. ‘ఈ పిటిషన్లను విచారించేందుకు కొత్త ధర్మాసనాన్ని ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉంది. ఇది కాస్త కష్టమైన పని. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటాం’ అని అన్నారు.
రఫేల్ ఒప్పందంలో అవకతవకలు జరిగాయని, కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం గతేడాది డిసెంబరు 14న తుది తీర్పు వెల్లడించింది. రఫేల్ ఒప్పందం నిర్ణయ ప్రక్రియను సందేహించడానికి ఎలాంటి ప్రాతిపదికా కన్పించలేదని కోర్టు పేర్కొంది. ఈ యుద్ధ విమానాల ఆవశ్యకత, నాణ్యతపై ఎలాంటి అనుమానాలూ లేవని, ఒప్పందాన్ని రద్దు చేయాల్సిన అవసరమేమీ లేదని తెలిపింది. ఈ మేరకు ఒప్పందాన్ని సవాల్ చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. అయితే, ఈ తీర్పును మరోసారి సమీక్షించాలని కోరుతూ న్యాయస్థానంలో రివ్యూ పిటిషన్లు దాఖలవ్వడంతో కోర్ట్ ఈ వ్యాఖ్యాలు చేసింది.